మేడారం వనమంతా జన జాతరగా మారింది. జాతరలో మరో ప్రధాన అంకం ప్రారంభమైంది
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మేడారం వనమంతా జన జాతరగా మారింది. జాతరలో మరో ప్రధాన అంకం ప్రారంభమైంది. సారలమ్మ బుధవారం రాత్రి గద్దెపైకి చేరింది. సారలమ్మ గద్దె మీదకు రానున్న నేపథ్యంలో మేడారానికి భక్తుల తాకిడి పెరిగింది. భక్తజనంతో మేడారం పోటెత్తింది. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో తొలిరోజు మేడారం మహాజాతరలో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. మేడారానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి గ్రామంలోని ఆలయంలో కొలువైన సారలమ్మను అంగరంగవైభవంగా గద్దెపైకి తోడుకొని వచ్చారు. బుధవారం మధ్యాహ్నమే కన్నెపల్లికి చేరుకున్న వడ్డెలు రెండు గంటలపాటు సంప్రదాయ పద్ధతిలో డోలు చప్పుళ్ల మధ్య పూజలు చేశారు. పిల్లలు లేనివారు, దీర్ఘకాలిక రుగ్మతలతో భాదపడేవారు పుణ్యస్నానాలు ఆచరించి తడిబట్టలతో గుడిబయట పడుకుంటే దేవతను తీసుకొచ్చే పూజారులు వారిపైనుంచి నడిచి వెళ్ళారు. శివ సత్తుల పూనకాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మేడారానికి బయలుదేరిన సారలమ్మకు కన్నెపల్లి గ్రామ ఆడపడుచులు మంగళహారతి ఇచ్చి సాగనంపారు. దీనికి ముందే కొండాయి నుంచి గోవిందరాజులు, కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు గద్దెలపైకి చేరుకున్నారు. తొలిరోజు గోవిందరాజులు, పగిడిద్దరాజు, సారలమ్మ ముగ్గురు గద్దెలపై పూజలందుకుంటున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు మొక్కులు సమర్పించేందుకు పోటీ పడుతున్నారు. దారులన్నీ మేడారం వైపే అనే విధంగా భక్తులు పెద్ద సంఖ్యలో మేడారం తరలి వెళ్తున్నారు. ప్రధాన రహదారులన్నీ వాహనాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి.
మేడారంలో పోటెత్తిన భక్తజనం
వేకువజామున నుండే భక్తుల తాకిడితో మేడారం ఆలయ ప్రాంగణం కిటకిట లాడుతున్నాయి. క్యూ లైన్ లన్ని నిండి పోయాయి. వనదేవతల రాక సందర్భంగా సర్వాంగ సుందరంగా గద్దెల ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. ప్రధాన ద్వారం వద్ద వివిధ రకాల పూలతో ఏర్పాటు చేసిన అమ్మ వారి అలంకరణ భక్తులను ఆకట్టుకుంటున్నది. తలుచుకుంటేనే కరుణించే తల్లులు సమ్మక్క సారాలమ్మలు. అట్లాంటి తల్లుల దర్శనం కోసం దేశం లోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తున్నారు. అమ్మదేవతలు గద్దెలకు వచ్చే సమయం కోసం వేచి చూస్తున్న భక్తులు పులకించి పోయారు.
జాతరకు సకల సన్నాహాలు
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. గిరిజనదేవతలను దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తజనం తరలివస్తున్నది. గద్దెలపై కొలువుదీరనున్న అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారంలో బుధవారం నుంచి ఒక్కో రోజు ఒక్కో ఘట్టం ఆవిష్కృతం కానున్నది. భక్తులు నిలువెత్తు బంగారం, చీరెసారెలు, పూలు, పండ్లు, పసుపు కుంకుమలు, వడిబియ్యం, గాజులు, ముడుపులు కట్టి మొక్కులు చెల్లిస్తున్నారు. బుధవారం నుంచి శనివారం వరకు మహా జాతర కొనసాగనున్నది.
గద్దెల వద్ద ఎండోమెంట్, రెవెన్యూ, పోలీస్, ఫైర్, సింగరేణి రెస్క్యూ, ట్రాన్స్ కో, పంచాయతీ రాజ్ అధికారులు గద్దెల వద్ద అమ్మవారి సేవలో తరించిపోతున్నారు. గద్దెల వద్ద భక్తులు సమర్పించే బంగారాన్ని శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు తీసివేస్తున్నారు.
మేడారం చేరిన పగిడిద్దరాజు
లక్మీపూరం నుండి మేడారం బయలుదేరిన సమ్మక్క భర్త పగిడిద్దరాజు గద్దెపైకి చేరారు. ములుగు జిల్లా లక్మీపురం, మొద్దులగూడెంలో గిరిజన సంప్రదాయ పద్దతిలో స్వాగతం పలికారు.అనంతరం భారీ బందోబస్తు మధ్య పగిడిద్దరాజు శోభయాత్ర సాగి పస్రా మీదుగా మేడారం చేరుకొనున్నది. తదుపరి సాయంత్రం గద్దె మీదికి చేరుకున్నారు. సంప్రదాయపద్ధతిలో పూజలు నిర్వహించి గద్దె పైన ప్రతిష్టించారు.అనంతరం భక్తులు మొక్కలు సమర్పించుకున్నారు.
బుధవారం గద్దెపైకి సమ్మక్క రాక
జాతరలో రెండోరోజు గురువారం కీలక ఘట్టం ఆవిష్కృతమవుతుంది. సమ్మక్క తల్లి గద్దెలపైకి చేరుతుంది. గిరిజన పూజారులు మేడారం సమీపంలోని చిలుకల గుట్టకు వెళ్లి కంకబొంగును తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించి పూజిస్తారు. ఆ తర్వాత సమ్మక్క పూజా మందిరం నుంచి కుండలను తెచ్చి గద్దెలపై నెలకొల్పుతారు. తర్వాత మళ్లీ చిలుకల గుట్టకు బయలుదేరి.. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కుంకుమ భరిణె రూపంలో సమ్మక్కను గద్దెపైకి తీసుకువచ్చే మహాఘట్టం మొదలవుతుంది. తల్లి రూపాన్ని చేతపట్టుకున్న మరుక్షణమే ప్రధాన వడ్డె తన్మయత్వంతో పరుగు పరుగున గుట్ట దిగుతూ వస్తారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లా ఎస్పీ తుపాకీతో మూడు సార్లు గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతకు ఆహ్వానం పలుకుతారు. సమ్మక్క ఆగమనంతో మేడారమంతా శివసత్తుల పూనకాలు, డప్పుచప్పుళ్లతో మార్మోగుతుంది. కొలువుదీరిన గిరిజన దేవతలకు భక్తులు నిలువెత్తు బంగారం, జంతుబలులతో మొక్కులు చెల్లించుకుంటారు.
23న రాష్ట్రపతి, గవర్నర్, సీఎం రాక
ప్రఖ్యాత మేడారం జాతరలో వనదేవతలైన సమ్మక్క సారలమ్మలకు మొక్కులు సమర్పించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ తమిళసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 23వ తేదీన మేడారం రానున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు తగిన ఏర్పాట్లు బందోబస్తు చర్యలు చేపడుతున్నారు.
పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం
మేడారం పరిసర ప్రాంతాలు స్వచ్ఛ పర్యవేక్షణ స్థలాలుగా మారాయి. ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ప్రత్యేక చొరవతో జిల్లా పంచాయతీ విభాగం ద్వారా జాతరలో పారిశుధ్యం మెరుగుకు అత్యంత ప్రాధాన్యత కల్పించారు. ఆలయ ప్రాంగణంతో పాటు భక్తులు దర్శనానికి వెళ్లే సెక్టార్లు, 4 వేలమంది పారిశుద్ధ్య కార్మికులను నియమించి పరిశుభ్రంగా ఉంచుతూ మేడారం పరిసరాలు స్వచ్ఛ పర్యవేక్షణ స్థలాలుగా తీర్చిదిద్దుతున్నారు. వీటికి భక్తులే ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నారు. మంగళవారం మేడారం సమ్మక్క సారలమ్మ మహజాతర అమ్మవార్లను దర్శించుకునే ఆలయ ప్రాంగణం ముందు భాగంలో పారిశుధ్యం కార్మికులు పరిశుభ్రం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అతిధులు ఎక్కువగా సందర్శించే ప్రాంతం కావడం అధికారులు నిరంతరం పర్యవేక్షించి పారిశుధ్యం పై చర్యలు తీసుకోవడంపట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.