గంట సేపు లైన్‌లో నిలుచొని ఓటు హ‌క్కు వినియోగించుకున్న బ‌న్నీ.. ఎన్టీఆర్ కూడా..!

గంట సేపు లైన్‌లో నిలుచొని ఓటు హ‌క్కు వినియోగించుకున్న బ‌న్నీ.. ఎన్టీఆర్ కూడా..!

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఎన్నిక‌ల హ‌డావిడి న‌డుస్తుంది. ఉదయం 7 గంటలకే మొదలైన పోలింగ్‌లో సామాన్యులు, రాజ‌కీయ నాయకులు, పలువురు సినీ సెలబ్రెటీలు కూడా పాల్గొంటున్నారు. గంట‌ల కొద్ది లైన్‌లో నిలుచొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జూ ఎన్టీఆర్ , అల్లు అర్జున్ క్యూ లైన్‌లో నిల్చొని తమ ఓటు వేశారు. ఎన్టీఆర్‌ అయితే తన కుటుంబంతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఉన్న పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. సతీమణి లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినితో కలిసి ఎన్టీఆర్ క్యూ లైన్‌లో కనిపించ‌గా, అక్కడి వారంద‌రు ఎన్టీఆర్‌ని చూసి మురిసిపోయారు. ఇక అల్లు అర్జున్‌ అయితే బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఉద‌యం 6.50 గం.ల‌కే పోలింగ్ కేంద్రం వ‌ద్ద‌కు చేరుకున్న అల్లు అర్జున్ కొద్ది సేపు లైన్‌లో ఉన్న‌వారితో స‌ర‌దాగా మాట్లాడి ఆ త‌ర్వాత ఓటు వేసిన‌ట్టు తెలుస్తుంది. ఇక అలానే జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో సుమంత్‌ ఓటు వేశారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా తన ఓటు వేశారు. షేక్‌పేట ఇంటర్నేష‌న‌ల్ స్కూల్‌లో రాజ‌మౌళి దంప‌తులు త‌మ ఓటు హ‌క్క‌కు వినియోగించుకున్నారు. ఇక వెంక‌టేష్ కూడా త‌న ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. జూబ్లిహిల్స్ క్ల‌బ్‌లో మెగాస్టార్ చిరంజీవి త‌న కూతురు శ్రీజ‌, స‌తీమ‌ణి సురేఖాతో క‌లిసి వెళ్లి ఓటు వేసారు. ఇక‌ గేమ్‌ ఛేంజర్ సినిమా షూటింగ్ మైసూర్‌లో శరవేగంగా జరుగుతుండ‌గా,ఆ సినిమా షూటింగ్ కోసం అక్క‌డికి వెళ్లిన రామ్ చ‌ర‌ణ్‌.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు మైసూర్‌ నుంచి ఒక ప్రైవేట్‌ విమానంలో హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. మ‌రి కొద్ది నిమిషాల‌లో ఆయ‌న కూడా త‌న ఓటు వినియోగించుకోనున్నారు.

ఇక బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్‌ పోలింగ్ కేంద్రంలో ఓటేసారు క‌విత‌. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటు వేయడానికి క్యూలైన్‌‌లో నిరీక్షించే ఓటర్ల రద్దీని తెలుసుకునేందుకు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారులు వినూత్న చర్యలు చేపట్టారు. ఇందుకోసం ‘పోల్‌ క్యూ రూట్‌’ అనే ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురాగా, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే ఉద్దేశంతో ఈ పోర్టల్‌ను తీసుకొచ్చినట్లు హైదరాబాద్ ఎన్నికల కమిషన్ రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు.