సింగపూర్లో భారతీయ సంస్కృతిని, తెలుగు రాష్ట్రాల సంస్కృతిని ప్రోత్సహిస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆపన్నులకు సాయం అందించడంలోనూ ముందుంటానని చాటుకున్నది. సింగపూర్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తూ హృదయ సంబంధ వ్యాధితో చనిపోయిన విజయవాడకు చెందిన ప్రదీప్ కుమార్ వంగపండు (32) కుటుంబానికి విరాళాలు సేకరించి, ఆర్థిక సహాయం అందింది. ప్రదీప్ కుమార్ ఫిబ్రవరి 3 వ తేదీన గుండె సంబంధిత వ్యాధితో చనిపోయారు. ఆయన సింగపూర్లో గత 8 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్లోని తన తల్లిదండ్రుల బాగోగులు చూసుకునే వారు. ఆయనకు మూడు సంవత్సరాల క్రితమే సంబంగి లావణ్యతో వివాహం జరిగింది.
ప్రదీప్ మరణంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నది. విషయం తెలుసుకున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) సభ్యులు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఆ కుటుంబానికి సహాయం చేయడానికి పిలుపునివ్వగా అనేక మంది దాతలు ముందుకు వచ్చారు. చందాల ద్వారా వచ్చిన 3,28,000 రూపాయలను మృతుడు ప్రదీప్ తల్లిదండ్రుల ఖాతాలో రూ.1,64,000, భార్య లావణ్య ఖాతాలో రూ.1,64,000 జమ చేసినట్టు తెలంగాణ కల్చరల్ సొసైటీ తెలిపింది. సాయం అందించిన దాతలకు ప్రదీప్ కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) తరపున సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్ తదితరులు దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని సొసైటీ దృష్టికి తీసుకువచ్చి చందాల సేకరణకు సమయాన్ని వెచ్చించిన సొసైటీ కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, మణికంఠ రెడ్డి, స్థానిక వాట్సాప్ సమూహాలలో షేర్ చేస్తూ ప్రాచుర్యం కలిగించడంలో ముఖ్య పాత్ర పోషించిన సంతోష్ వర్మ మాదారపుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.