Ramkrishna Mission | రామకృష్ణ మఠం, మిషన్ అధ్యక్షుడు స్వామి స్మరణానంద మహరాజ్ (95) ఇక లేరు. ఆయన 8.15 గంటల సమయంలో మహాసమాధి అయినట్లు ఆర్కే మిషన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. గతకొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. జనవరి 29న ఆసుపత్రిలో చేరారని.. ఆ తర్వాత శ్వాసకోశ సంబంధిత వ్యాధి కారణంగా మార్చి 3న వెంటిలేటర్పై ఉంచినట్లుగా ప్రకనటలో తెలిపింది. స్వామి స్మరణానంద మహరాజ్ 2017లో 16వ అధ్యక్షుడి నియామకమయ్యారు. బేలూరు మఠంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 5న రెండోసారి బెంగాల్లో పర్యటించిన ప్రధాని.. ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయన మరణానంతరం ప్రధాన సంతాప సందేశం విడుదల చేశారు. రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ గౌరవనీయ అధ్యక్షుడు స్వామి స్మరణానంద జీ మహరాజ్ తన జీవితాన్ని ఆధ్యాత్మికతకు, సేవకు అంకితం చేశారన్నారు. లెక్కలేనన్ని హృదయాలు, మనసులపై చెరగని ముద్ర వేశారన్నారు.
ఆయన కరుణ, వివేకం తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్న ప్రధాని.. కొన్నేళ్లుగా ఆయనతో నాకు మంచి అనుబంధం ఉందంటూ గుర్తు చేసుకున్నారు. 2020లో బేలూరు మఠానికి వెళ్లినప్పుడు ఆయనతో మాట్లాడానని.. కొన్ని వారాల కిందట కోల్కతాలో ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీసినట్లు తెలిపారు. బేలూరు మఠంలోని అసంఖ్యాక భక్తులతో నా ఆలోచనలు ఉన్నాయన్న ప్రధాని.. ఓం శాంతి అంటూ ట్వీట్ చేశారు. బెంగాల్సీఎం మమతా బెనర్జీ సైతం సంతాపం ప్రకటించారు. మిషన్ గౌరవనీయ అధ్యక్షుడు స్వామి స్మరణానందజీ మహరాజ్ మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులకు ఓదార్పుగా ఉన్నారన్నారు. ఆయన అనుచరులు, భక్తులందరికీ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం సంతాపం తెలిపారు.