మీకు వివాహం కావడం లేదా..? వివాహం జరిగినప్పటికీ పిల్లలు పుట్టడం లేదా..? అప్పులతో బాధపడుతున్నారా..? గ్రహ దోషాలు వెంటాడుతున్నాయా..? ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఆధ్యాత్మికతను కోరుకుంటారు. మనసుకు నచ్చిన భగవంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ కోరికలను నెరవేర్చాలని కోరుకుంటారు.
మీకు వివాహం కావడం లేదా..? వివాహం జరిగినప్పటికీ పిల్లలు పుట్టడం లేదా..? అప్పులతో బాధపడుతున్నారా..? గ్రహ దోషాలు వెంటాడుతున్నాయా..? ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఆధ్యాత్మికతను కోరుకుంటారు. మనసుకు నచ్చిన భగవంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ కోరికలను నెరవేర్చాలని కోరుకుంటారు. అయితే ఈ రకమైన సమస్యలతో బాధపడేవారు.. ప్రతి మంగళవారం స్కంధగిరి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. మరి హైదరాబాద్ నగరంలో ఉన్న ఈ స్కంధగిరి ఆలయం ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం..
సికింద్రాబాద్ పరిధిలోని పద్మారావు నగర్లో స్కంధగిరి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రధాన మూలవిరాట్టు సుబ్రహ్మణ్య స్వామియే అయినప్పటికీ భక్తుల దర్శనార్థం అనేక ఉప ఆలయాలను కూడా నిర్మించారు. సుందర గణపతి, ప్రసన్నాంజనేయుడు, శివుడు, మీనాక్షి, దక్షిణామూర్తి లింగోద్భవ, బ్రహ్మ, చండికేశ్వరుడు, గోవిందరాజులు, శ్రీదేవి, భూదేవి దుర్గామాత నటరాజ ఆలయం, బయట రాగి చెట్టుకు కింద నాగదేవతలు, షణ్ముఖ, నవగ్రహాలు, రాహుకేతువులు, కదంబ దేవతల ఆలయాలతో పాటు ఆదిశంకరాచార్యుల పాదుకులను ఏర్పాటు చేశారు. ఆలయంలోని అన్ని దేవతామూర్తులకు నిత్య పూజలు జరుగుతాయి.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారం అభిషేకం చేయించి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో స్కంద షష్ఠిని ఘనంగా నిర్వహించడంతో పాటు, సంవత్సరంలో రెండుసార్లు స్వామివారికి కళ్యాణోత్సవాన్ని, కావడి పూజలనీ నిర్వహిస్తుంటారు. ఈ దేవాలయంలో 51 లేదా 101 ప్రదక్షిణలు చేస్తే గ్రహదోషం పోతుందనీ, సంతానంలేని వారికి సంతానం కలుగుతుందనీ, రుణవిమోచన కలుగుతుందనీ ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతి మంగళవారం మహిళలు తెల్లవారుజామున మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు నిమ్మకాయలను కోసి, వాటిని వెనక్కి తిప్పి అందులో నూనె పోసి దీపాలు వెలిగిస్తారు. అలా చేయడంవల్ల సంతానం కలుగుతుందని, పెళ్లిళ్లు అవుతాయని, భార్యాభర్తల మధ్య బంధాలు మెరుగుపడతాయని భక్తులు విశ్వసిస్తారు.