ఎన్నో ఏళ్ల భారతీయుల కల సాకారం కాబోతున్నది. అయోధ్య రామయ్య ఆలయం రూపుదిద్దుకోగా.. సోమవారం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగనున్నది
Ayodhya | ఎన్నో ఏళ్ల భారతీయుల కల సాకారం కాబోతున్నది. అయోధ్య రామయ్య ఆలయం రూపుదిద్దుకోగా.. సోమవారం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా గర్భాలయంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ క్రమంలో యావత్ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల్లో ఉత్సాహం నెలకొన్నది. ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో బ్రిటన్లో కారు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హిందువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ర్యాలీలో 325కి పైగా కార్లు పాల్గొన్నాయి. వెస్ట్ లండన్లోని కొల్లియర్ రోడ్లోని ది సిటీ పెవిలియన్ నుంచి కార్ ర్యాలీ ప్రారంభం కాగా.. తూర్పు లండన్ గుండా సాగింది. జై శ్రీరాం నినాదాలు బ్రిటన్లో మార్మోగాయి. శ్రీరాముడిని స్తుతిస్తూ భజనలు చేశారుం. అలాగే మహా హారతి కార్యక్రమం సైతం చేపట్టారు. ర్యాలీలో పాల్గొన్న రవి బానోత్ మాట్లాడుతూ.. ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. రామ మందిర నిర్మాణం హిందువులకు కీలకమైందన్నారు. రామాలయం ఒక నిర్దిష్ట సమాజానికి ప్రత్యేక ప్రాముఖ్యతను ఉందన్నారు. 500 ఏళ్ల తర్వాత రాముడి గుడి ప్రారంభం కానుంది. కోర్టులో హిందువులు గెలిచిన సందర్భంలోనే మనకు దేవాలయం వచ్చిందని.. వాటికన్ సిటీకి క్రైస్తవులకు ప్రత్యేక స్థానంగా.. గోల్డెన్ టెంపుల్ సిక్కులకు ప్రత్యేకమైన స్థలంగా.. రామ మందిరం హిందువులకు ప్రత్యేక స్థలంగా మారిందన్నారు. భారతదేశ స్వాతంత్య్రం, అభివృద్ధిపై బానోత్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రానంతరం భారత్లో జరిగిన అభివృద్ధిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు.
భారత్పై ప్రపంచానికి నమ్మకం పెరుగుతోందని.. ఇది అద్భుతమైన విషయమన్నారు. ర్యాలీలో పాల్గొన్న ప్రతిభా చౌదరి మాట్లాడుతూ.. అందరం ర్యాలీ కోసం ఇక్కడకు తరలివచ్చామన్నారు. మేమంతా చాలా సంతోషంగా ఉన్నామని.. ప్రవాస భారతీయుల్లో ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదన్నారు. దేవుడే తన ఇంటికి వస్తున్నట్లు అనిపిస్తుందంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. అమెరికాలోని హిందూ సమాజం సైతం వాషింగ్టన్లో రామ మందిరాన్ని పురస్కరించుకుని బైక్-కార్ ర్యాలీని కూడా నిర్వహించింది. ఫ్రెడరిక్ సిటీలోని శ్రీ భక్త ఆంజనేయ దేవాలయం వద్దకు హిందూ సంఘాలు ర్యాలీకి తరలివచ్చాయి. 500 ఏళ్ల హిందువుల పోరాటం తర్వాత అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని ప్రారంభించబోతున్నట్లు విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు మహేంద్ర సాపా అమెరికాలో ప్రకటించారు. ఈ చారిత్రక సందర్భంలో అమెరికాలోనూ సంబరాలు జరుపుకుంటున్నామన్నారు.