Nizamabad | గ్రామాభివృద్ధికి చేసిన అప్పులు తీర్చలేక సతమతం విధాత:ప్రతినిధి నిజామాబాద్: ప్రభుత్వం నుంచి గ్రామాభివృద్ధికి చేసిన పనులకు బిల్లులు రాక, అప్పుల బాధ భరించలేక అధికార పార్టీకి చెందిన ఓ మహిళా సర్పంచ్ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కల్లెడ గ్రామ సర్పంచ్ పెద్దగాని లావణ్య తన గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనుల నిర్వాహణకు 30 లక్షలకు పైగా కొందరి వద్ద అప్పుగా తీసుకుంది. […]
Nizamabad |
విధాత:ప్రతినిధి నిజామాబాద్: ప్రభుత్వం నుంచి గ్రామాభివృద్ధికి చేసిన పనులకు బిల్లులు రాక, అప్పుల బాధ భరించలేక అధికార పార్టీకి చెందిన ఓ మహిళా సర్పంచ్ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది.
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కల్లెడ గ్రామ సర్పంచ్ పెద్దగాని లావణ్య తన గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనుల నిర్వాహణకు 30 లక్షలకు పైగా కొందరి వద్ద అప్పుగా తీసుకుంది. గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు తాను సొంతంగా చేసిన అప్పుల మొత్తాన్ని ఖర్చు చేసింది. చేసిన పనులకు బిల్లులు వచ్చాకా అప్పులు తీర్చాలనుకుంది.
అయితే ప్రభుత్వం నుంచి ఎంతకు బిల్లులు రాకపోవడంతో అప్పులిచ్చిన వాళ్లు ఒత్తిడి తీసుకొచ్చారు. గ్రామానికి చెందిన సంతు గౌడ్ నుండి మూడు లక్షల అప్పు తీసుకున్నారు. దీంతో సోమవారం సంతు గౌడ్ తన కుటుంబ సభ్యులతో ఇంటికి వచ్చి అప్పు తీర్చమని లావణ్య ఇంట్లో కూర్చొని వేధించాడు.
ఇష్టానుసారంగా మాట్లాడుతూ, బూతులు తిట్టడంతో విసిగిపోయిన సర్పంచ్ లావణ్య మంగళవారం ఉదయం ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.
అయితే లావణ్య భర్త ప్రసాద్ గౌడ్ సంవత్సరం క్రితం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యాయత్నం కేసులో అరెస్టై ఇటీవల బెయిల్ పై విడుదలయ్యాడు. ఇంతలోనే సర్పంచ్ లావణ్య అప్పుల వారి బాధ భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం జిల్లాల్లో చర్చనీయాంశమైంది.