ఆర్ఎస్ఎస్ మార్గదర్శనంలో భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం రద్దుకు పూనుకోనున్నదని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల కాంతం ఆరోపించారు.
8న కరీంనగర్లో రాజ్యాంగ రక్షణ సభ
ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల కాంతం
విధాత బ్యూరో, కరీంనగర్: ఆర్ఎస్ఎస్ మార్గదర్శనంలో భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం రద్దుకు పూనుకోనున్నదని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల కాంతం ఆరోపించారు. సోమవారం స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బిజెపిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో 400 స్థానాలను గెలవడం ద్వారా సులువుగా రాజ్యాంగాన్ని రద్దు పరచవచ్చన్న అంగీకారానికి ఆర్ఎస్ఎస్, బీజేపీలు వచ్చాయన్నారు. ఎస్సీ ఎస్టి,బీసీ, మైనారిటీలకు ఉద్దేశించిన రిజర్వేషన్ల తొలగింపు కూడా వారి కుట్రలో భాగమేనన్నారు. నరేంద్ర మోడీ పదేళ్ల పాలనలో బడుగు బలహీన వర్గాల బతుకులు ఏమాత్రం బాగుపడలేదన్నారు.
డీజిల్, సిలిండర్ ,నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. దేశ సంపదను అదాని, అంబానీలకు ధారాదత్తం చేశారని ఆయన విమర్శించారు. నిరుద్యోగ యువతకు 15 లక్షలు ఇస్తామని ఇవ్వలేదని నల్లధనం తిరిగి తెప్పించలేదని, రైతులపై నల్ల చట్టాలు తీసుకొచ్చి 750 మంది రైతుల చావులకు కారకులయ్యారని ఆయన ఆరోపించారు. మణిపూర్, నాగాలాండ్, హర్యానా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో దాడులు, హత్యలు, అత్యాచారాలు సాగుతున్నా మోడీగాని, ఆయా బిజెపి ప్రభుత్వాలు గానీ దోషులను శిక్షించలేకపోతున్నాయని ఆయన ఆరోపించారు.
రాజ్యాంగం, రిజర్వేషన్ల రద్దును వ్యతిరేకిస్తూ ఈ నెల 8న కరీంనగర్లో రాజ్యాంగ రక్షణ సభ నిర్వహించనున్నట్టు గజ్జలకాంతం తెలిపారు. రాజ్యాంగం, రిజర్వేషన్ల రద్దుకు బిజెపి, ఆర్ఎస్ఎస్ లు సంయుక్తంగా చేసిన తీర్మాన ప్రతి ప్రతులు తమ వద్ద ఉన్నాయని, 8న జరిగే రాజ్యాంగ పరిరక్షణ సభలో బహిర్గతం చేస్తామన్నారు. రాజ్యాంగం, రిజర్వేషన్ల రద్దుకు బీఆర్ఎస్ కూడా మద్దతిస్తోందని, అందువల్లనే ఆ పార్టీ అధినేత కెసిఆర్ నోరు మెదపటం లేదని ఆరోపించారు వీరందరి బండారాన్ని అదే రోజు బయట పెడతామని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు గజ్జల ఆనందరావు సముద్రాల అజయ్, కొండ్ర స్వరూప, సుద్దాల లక్ష్మణ్, గోశిక శంకర్, కల్లేపల్లి శంకర్ ఆవర్ల లత,భారతి తదితరులు పాల్గొన్నారు.