గొర్రెలు చేపల పంపిణీ పథకాలపై విచారణ.. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
త ప్రభుత్వంలో గొర్రెలు, చేపల పంపిణీ పథకాల్లో లావాదేవీలపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు

- విజిలెన్స్ అండ్ ఎన్పోర్స్మెంట్కు బాధ్యతలు
- ప్రాథమిక నివేదిక ఆధారంగా ఏసీబీకి
- ఏప్రిల్ నుంచి పాడి రైతులకు ప్రోత్సాహకం
- వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామకాలకు వెయిటేజీ
హైదరాబాద్: గత ప్రభుత్వంలో గొర్రెలు, చేపల పంపిణీ పథకాల్లో లావాదేవీలపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పథకాలు ప్రారంభమైన దగ్గర నుంచీ ఇప్పటిదాకా లబ్ధిదారుల ఎంపిక మొదలుకొని గొర్రెల కొనుగోళ్లు, పంపిణీలు జరిగిన తీరుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని చెప్పారు. విజిలెన్స్ ఇచ్చే ప్రాథమిక నివేదికలో ఏమైనా అవినీతి, అవకతవకలను గుర్తిస్తే వెంటనే ఈ వివరాలను ఏసీబీకి అప్పగించాలని అధికారులకు సూచించారు. పశు సంవర్ధక శాఖ, పాడి అభివృద్ధి, మత్స్య శాఖ అధికారులతో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మంగళవారం సచివాలయంలో సమీక్షించారు.
గొర్రెల పంపిణీలో అవకతవకలు, దీనిలో జరిగిన భారీ అవినీతిని ఇటీవల కాగ్ తన నివేదికలో పేర్కొన్న విషయాన్ని సీఎం రేవంత్.. ప్రస్తావించారు. ఇటీవల గొర్రెల పంపిణీకి ఉద్దేశించిన నిధులను కొందరు ఉద్యోగులు బినామీ పేర్లతో సొంత ఖాతాలకు మళ్లించుకున్న కేసులో ఏసీబీ దర్యాప్తు చేస్తున్న విషయాన్ని గుర్తు చేసిన రేవంత్.. అందులో శాఖాపరంగా వివరాలేమీ సేకరించలేదా? అని ఆరా తీశారు. గొర్రెల పంపిణీ పథకాన్ని 2017లో అప్పటి బీఆరెస్ ప్రభుత్వం ప్రారంభించింది. తొలి విడతకు రూ.3955 కోట్ల రుణం ఇచ్చిన నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్.. రెండో విడతకు ఎందుకు రుణం నిలిపివేసింది. ఇది ఎందుకు జరిగిందని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. అప్పటికే ఈ పథకంపై కాగ్ వివిధ అభ్యంతరాలు లేవనెత్తడంతోపాటు.. అవకతవకలను గుర్తించిందని, ఆ కారణాలతో ఎన్సీడీసీ రుణం ఇవ్వలేదని అధికారులు బదులిచ్చారు.
ఇప్పటికే తమ వాటా కింద 25% మొత్తానికి డీడీలు అందించిన లబ్ధిదారులకు గొర్రెలను ఎందుకు పంపిణీ చేయలేదని సీఎం ప్రశ్నించారు. రెండో విడతలో 85488 మంది తమ వాటా కింద 25% డబ్బు చెల్లించారని, దాదాపు రూ.430 కోట్లు జిల్లా కలెక్టర్ల ఖాతాల్లోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో 2,20,792 మంది లబ్ధిదారులు డబ్బులు ఇంకా కట్టలేదన్నారు. ఈ పథకం అమలు జరిగిన తీరుపై రకరకాల అనుమానాలున్నాయని, దీంతో పాటు చేపల పెంపకానికి సంబంధించి ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
పాడి రైతులకు ప్రభుత్వం లీటరు పాలపై ఇచ్చే నాలుగు రూపాయల ప్రోత్సాహకాన్ని మూడేండ్లుగా ఇవ్వడం లేదని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. సుమారు రూ.203 కోట్ల బకాయిలు పేరుకుపోయి ఉన్నాయని పేర్కొన్నారు. దీనికి సీఎం.. పాడి రైతులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాన్ని ఏప్రిల్ నుంచి క్రమం తప్పకుండా విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెలా గ్రీన్ చానల్ ద్వారా చెల్లింపులు జరపాలని చెప్పారు. ప్రతి మండలంలో వెటర్నరీ హాస్పిటల్ తప్పకుండా ఉండాలని, 91 కొత్త మండలాల్లోనూ అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మొబైల్ వెటర్నరీ క్లినిక్ సేవలను కొనసాగించాలని, అందుకు అవసరమైన టెండర్లను వెంటనే పిలవాలని చెప్పారు. వివిధ పథకాల్లో కేంద్రం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. టీఎస్పీఎస్సీ చేపట్టిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకాల్లో ఈ విబాగంలో ఏళ్లకేళ్లుగా పని చేస్తున్న వారికి వెయిటేజీ ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలించాలని, వైద్యారోగ్య శాఖలో అమలైన వెయిటేజీ విధానాన్నిఈ విభాగంలోనూ వర్తించేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి స్పెషల్ సీఎస్ ఆధర్ సిన్హా, డెయిరీ డైరెక్టర్ లక్ష్మి, ఫిషరీస్ డైరెక్టర్ గోపి ఈ సమావేశంలో పాల్గొన్నారు.