ఎల్బీ న‌గ‌ర్ వ‌స్తే నా గుండె వేగం పెరుగుతోంది: సీఎం రేవంత్ రెడ్డి

ఎప్పుడు ఎల్బీ నగర్ కు వచ్చినా గుండె వేగం పెరుగుతుందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. నాకు అండగా ఉండే వారంతా ఈ ప్రాంతంలో ఉన్నారన్నార‌ని, మీ అభిమానం ఎప్ప‌టికీ మ‌రిచిపోలేనిద‌ని అన్నారు

ఎల్బీ న‌గ‌ర్ వ‌స్తే నా గుండె వేగం పెరుగుతోంది: సీఎం రేవంత్ రెడ్డి

విధాత‌: ఎప్పుడు ఎల్బీ నగర్ కు వచ్చినా గుండె వేగం పెరుగుతుందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. నాకు అండగా ఉండే వారంతా ఈ ప్రాంతంలో ఉన్నారన్నార‌ని, మీ అభిమానం ఎప్ప‌టికీ మ‌రిచిపోలేనిద‌ని అన్నారు. శ‌నివారం మంత్రులు దుద్దిళ్ల శ్రీధ‌ర్‌బాబు, పొన్న ప్ర‌భాక‌ర్‌రెడ్డిల‌తో క‌లిసి బైరామల్‌గూడ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి చేస్తామ‌న్నారు. దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఓవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, మైలార్ దేవర్ పల్లి మీదుగా మెట్రో రైలు నిర్మించాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు.

మురికి కూపంగా మారిన మూసీ పరివాహక ప్రాంతాన్ని రూ.40 నుంచి 50 వేల కోట్లతో అభివృద్ధి చేయబోతున్నామ‌ని సీఎం వెల్ల‌డించారు. లండన్ థెమ్స్ నదీపరివాహక ప్రాంతం మాదిరిగా మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామ‌న్నారు. వైబ్రాంట్ తెలంగాణ 2050లో భాగంగా త్వరలోనే 55 కి.మీ మేర మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామ‌న్నారు.

ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. 354 కి.మీ ల రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలోపల సబర్బన్ హైదరాబాద్ కింద రేడియల్ రోడ్లు నిర్మించి అభివృద్ధి చేస్తామ‌ని, అందరి సలహాలు, సూచనలతో వైబ్రాంట్ తెలంగాణ 2050 మెగా మాస్టర్ ప్లాన్ తీసుకురాబోతున్నామ‌న్నారు.

హైదరాబాద్ లో మెట్రో విస్తరణ అడ్డుకోవాలని చూసేవారిని ఈ వేదికగా హెచ్చరిస్తున్నా న‌ని, హైదరాబాద్ నగర అభివృద్ధికి అడ్డు పడొద్దు.. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే వారికి నగర బహిష్కరణ శిక్ష విధించాలని సీఎం రేవంత్‌రెడ్డి వెల్ల‌డించారు.