ఎన్నికల వేళ 50వేలకు మించి నగదుతో ప్రయాణించకండి.. పట్టుబడితే?
భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సాధారణ పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు

విధాత మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల అధికారి/ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హల్లో జిల్లా ఎస్పీ బాలస్వామితో కలిసి జిల్లాలో ఎన్నికల నిర్వహణపై మీడియాతో మాట్లాడారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు, దుబ్బాక, గజ్వేల్.. ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో తుది ఓటరు జాబితా ప్రకారం 18 లక్షల 12 వేల 858 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు సరి చూసుకోవాలని, జాబితాలో పేరు లేని వారు ఏప్రిల్ 15 వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైనమేర పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఓటరుకు రెండు కిలోమీటర్ల పరిధిలో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అవసరమైన మేర బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెకింగ్ పూర్తయిందని, పోలింగ్ సిబ్బంది మొదటి రెండవ, తుది, రాండమైజేషన్ పార్లమెంట్ పరిధిలో ఉన్న మొత్తం ఎన్నికల సిబ్బంది తీసుకొని చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని తెలిపారు.
మతం, కులం, ప్రాంతంపై విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడటం, తప్పుడు ప్రచారాలు చేయడంపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు, నాయకులకు సమావేశాలు నిర్వహించుకునేందుకు సింగిల్ విండో సిస్టం ద్వారా అనుమతులు అందిస్తామని, ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీలులేదని అన్నారు. రాజకీయ సమావేశాలు ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థన స్థలాలల్లో, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో నిర్వహించరాదని కలెక్టర్ తెలిపారు.
నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదు ఇలా..
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్టయితే ప్రజలు 1950 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి తెలియజేవచ్చని కలెక్టర్ చెప్పారు. సి-విజల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదుల స్వీకరణకు 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని, సి -విజల్ యాప్ లో లైవ్ వీడియో అప్ లోడ్ చేసిన 100 నిమిషాల గడువులోపు అధికారులు క్షేత్రస్థాయిలో చేరుకొని ఫిర్యాదు పై చర్యలు తీసుకుంటారని అన్నారు.
జిల్లాలో కరపత్రాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ముద్రించే సమయంలో ప్రింటింగ్ ప్రెస్ ఫోన్ నెంబర్, అదేవిధంగా ఎవరు ప్రింట్ చేయమన్నారు వారి ఫోన్ నెంబర్ తప్పనిసరిగా పేర్కొనాలని , ఈ అంశాన్ని అన్ని ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశం నిర్వహించి వివరించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఎస్పీ బాలస్వామి మాట్లాడుతూ అక్రమ నగదు, లిక్కర్ సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
జిల్లాలో అవసరమైన మేర చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, 24 గంటలపాటు గట్టి నిఘా ఉంచామని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎన్నికల దృష్ట్యా ప్రజలు ఆధారాలు లేకుండా 50 వేలకు మించి నగదుతో ప్రయాణించవద్దని, ప్రతిరోజు తనిఖీలలో జప్తు చేసిన సొమ్మును జిల్లాలో ఏర్పాటు చేసే గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామని, ఆధారాలు సమర్పిస్తే గ్రీవెన్స్ కమిటీ నగదు విడుదల చేస్తుందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.