విధాత: తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం, అనుబంధ రంగాల్లోని రైతులు, సంబంధిత పరిశ్రమలు, వినియోగ దారులకు విస్తృత సమాచారం అందిస్తూ ఆయా వర్గాల వారికి ఓ వేదికగా నిలిచిన అన్నదాత మాస పత్రిక మూత బడింది. ఈనాడు వ్యవస్థాపకులు రామోజీ రావు సారథ్యంలో నడిచిన ఈ పత్రిక దాదాపు ముప్పయ్యేళ్ళ పాటు గణనీయంగా వెలిగింది. దాదాపు లక్షకు పైగా కాపీలు, వేలాది మంది చందాదారులతో తులతూగేది. వ్యవసాయ, పశుపోషణ ఇతరత్రా అనుబంధ పరిశ్రమలు, వాటి నిర్వహణ, కష్ట నష్టాలు.. […]
విధాత: తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం, అనుబంధ రంగాల్లోని రైతులు, సంబంధిత పరిశ్రమలు, వినియోగ దారులకు విస్తృత సమాచారం అందిస్తూ ఆయా వర్గాల వారికి ఓ వేదికగా నిలిచిన అన్నదాత మాస పత్రిక మూత బడింది. ఈనాడు వ్యవస్థాపకులు రామోజీ రావు సారథ్యంలో నడిచిన ఈ పత్రిక దాదాపు ముప్పయ్యేళ్ళ పాటు గణనీయంగా వెలిగింది.
దాదాపు లక్షకు పైగా కాపీలు, వేలాది మంది చందాదారులతో తులతూగేది. వ్యవసాయ, పశుపోషణ ఇతరత్రా అనుబంధ పరిశ్రమలు, వాటి నిర్వహణ, కష్ట నష్టాలు.. లాభాలు.. ఆదాయ మార్గాలు, మార్కెటింగ్ సౌకర్యాలు.. నిపుణుల సలహాలు అనుభవజ్ఞుల అభిప్రాయాలు మేళవింపుతో ఈ పత్రిక ఆయా వర్గాల వారికి దిక్సూచిలా ఉండేది.
అయితే రానురాను డిజిటల్ మీడియా, యూట్యూబ్, వెబ్సైట్ల ప్రాబల్యం విస్తృతం కావడం.. అన్నదాత పత్రికకు ప్రాచుర్యం తగ్గడంతో గత కొన్నేళ్లుగా చందాదారులు కొరవడ్డారు. కోవిడ్ సీజన్ పత్రికను మరింతగా దెబ్బ కొట్టింది. దీంతో అనివార్యంగా అన్నదాతను మూసేస్తున్నట్లు మేనేజిమెంట్ ప్రకటించింది.
ఇదివరకే రామోజీ గ్రూప్ నుంచి వచ్చే సితార సినీవార పత్రికతో బాటు విపుల, చతుర వంటి కథల ప్రచురణలు సైతం నిలిపివేశారు. ఈ మేరకు అన్నదాత సంపాదకుడు అమిర్నేని హరికృష్ణ పేరుతో ప్రకటన విడుదల అయింది.
టెక్నాలజీలో వేగంగా వస్తున్న మార్పులే ఈ అన్నధాతను మూసివేయడానికి ముఖ్య కారణమని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే అన్నదాత పేరుతో టీవీలో వస్తున్న కార్యక్రమాన్ని కొనసాగిస్తామని దాని ద్వారా వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందిస్తామని.. ఇప్పుడు అన్నదాత పుస్తక అవసరం పూర్తిగా తగ్గడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. వ్యవసాయానికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు చేరిపోతున్నందువలన మాస పత్రికల ప్రాధాన్యం తగ్గినట్లుగా విశ్లేషించారు.