గుంటూరు, హైదరాబాద్ కేంద్రాలుగా బెట్టింగ్ల దందా ఎన్నికల ప్రచారంపైనా బెట్టింగ్ ప్రభావం ఒక్కసారి టీఆర్ఎస్. మరో సారి బీజేపీ గెలుపంటూ ప్రచారం నిర్వాహకులకు రూ.100 నుంచి రూ. 150 కోట్ల వరకు లాభం హైదరాబాద్, విధాత: మునుగోడు ఉప ఎన్నికపై భారీ ఎత్తున బెట్టింగ్ దందా నడస్తోంది. దాదాపు రూ.1500 కోట్ల వరకు బెట్టింగ్లో పెట్టినట్లు సమాచారం. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు అసెంబ్లీ […]
హైదరాబాద్, విధాత: మునుగోడు ఉప ఎన్నికపై భారీ ఎత్తున బెట్టింగ్ దందా నడస్తోంది. దాదాపు రూ.1500 కోట్ల వరకు బెట్టింగ్లో పెట్టినట్లు సమాచారం. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా ప్రాతినిద్యం వహిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు శాసన సభ స్థానం ఖాళీ అయింది. ఆతరువాత రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరారు. దీంతో ఎన్నికల సంఘం ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించింది.
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్రెడ్డి పోటీ చేయగా, అధకార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిలు పోటీ చేశారు. పోటీలో 40 మందికి పైగా అభ్యర్థులున్నా.. ప్రధాన పోటీ ఈ మూడు పార్టీల అభ్యర్థుల మధ్యనే ఉన్నది. అయితే మొదటి నుంచి ప్రచారంలో వెనుకబడి ఉన్న పాల్వాయి స్రవంతి మూడవ స్థానానికే పరిమితం అవుతుందన్న ప్రచారం వచ్చింది. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎంత ఖరు చేయడానికైనా వెనుకాడలేదు.
జబర్దస్త్కు రష్మీ గుడ్ బై.. కొత్త యాంకర్ ఎంట్రీ.. కానీ!
గుంటూరు, హైదరాబాద్ కేంద్రాలుగా..
ప్రతి ఎన్నికల్లో డబ్బుల పంపిణీ, మద్యం పంపిణీ జరిగింది. ఇంత భారీ ఎత్తున పంపకాలు ఏ ఎన్నికల్లో జరుగలేదు. మొదటి సారిగా పార్టీలు ఓటర్లకు భారీ ఎత్తున నగదు, మద్యం పంపిణీ చేశాయి. ఓటర్లు బహాటంగానే తమకు డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామని తెగేసీ మరీ చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో తమకు ఒక పార్టీ రూ.5 వేలు ఇచ్చిందని, మరో పార్టీ రూ.4 వేలు ఇచ్చిందని ఓటర్లు చెపుతున్నారు. కొన్ని చోట్ల తాము హైదరాబాద్ నుంచి ఓటు వేయడానికి వచ్చాము కానీ డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. ఇలా మునుగోడులో ఓటర్లకు నగదు పంపిణీలో పార్టీలు పోటీ పడ్డాయి.
ఈ ఎన్నికలను టీఆర్ఎస్, బీజేపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో హోరా హోరీ ప్రచారం జరిగింది. అనేక చోట్ల ఘర్షణలు జరిగాయి. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నువ్వా… నేనా అన్న తీరుగా పోటీ పడ్డాయి. ఉత్కంఠ భరితంగా ఎన్నికల ప్రచారం జరుగడంతో బెట్టింగ్ రాయుళ్లు కూడా రంగంలోకి దిగారు. కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్ చేసే వాళ్లను ఊరించారు.. కవ్వించారు.. ఇలా గుంటూరు, హైదరాబాద్ కేంద్రాలుగా బెట్టింగ్ నిర్వహించిన నిర్వాహకులు రంగంలోకి దిగారు… టీఆర్ఎస్, బీజేపీపైన దాదాపు రూ.1500 కోట్లు బెట్టింగ్ పెట్టినట్లు తెలిసింది.
మునుగోడుకు మకాం..
మొదటి నుంచి బెట్టింగ్లో డబ్బులు పెట్టే వాళ్లు ఎక్కువగా టీఆర్ఎస్ గెలుస్తుందని బెట్టింగ్ చేశారు. దీంతో నిర్వాహకులు తమకు నష్టం వస్తుందని భావించి, తమ మకాంను మునుగోడుకు మార్చారు. దాదాపు 50 కార్లల్లో మునుగోడులో తిష్ట వేసిన బెట్టింగ్ నిర్వాహకులు కొద్ది రోజులు ఎన్నికల ప్రచారాన్ని ప్రభావితం చేశారు. భారీ ఎత్తున సర్వేలు చేయించారు..
బీజేపీ గెలుస్తుందన్న టాక్ను మధ్యలో కొద్ది రోజులు తీసుకువచ్చారు. దీంతో చాలా మంది బీజేపీ గెలుస్తుందని బెట్టింగ్ చేశారు. ఇలా నిర్వాహకులు ప్రత్యేకంగా సర్వేలు చేయించి ఒకసారి టీఆర్ఎస్ గెలుస్తుందని, మరోసారీ బీజేపీ గెలుస్తుందని ప్రచారంలో పెట్టారు. ఇలా రెండు పార్టీల మధ్య జరిగిన హోరా హోరీ ప్రచారాన్ని బెట్టింగ్ నిర్వాహకులు ఎన్ క్యాష్ చేసుకున్నారు.
రెండువైపులా బెట్టింగ్ కాసేలా…
ఉప ఎన్నిక ప్రచారంలో మొదట బీజేపీ పై చేయిగా ఉంటుందన్న ప్రచారం జరిగింది. అప్పటికి బెట్టింగ్లు మొదలు కాలేదు. ఆతరువాత నామినేష్ల ఘట్టం ముగిసి, ప్రచారం ఊపందుకున్న తరువాత టీఆర్ఎస్ ప్రచారంలో పై చేయి సాధించింది. దీంతో టీఆర్ఎస్ గెలుపు ఖాయం అన్న టాక్ వచ్చింది. ఆతరువాత బెట్టింగ్ నిర్వాహకులు రంగంలోకి దిగారు. బెట్టింగ్లు మొదలు పెట్టారు.
అయితే ఎక్కువ మంది టీఆర్ఎస్ గెలుస్తుందని బెట్టింగ్ చేశారు. దాదాపు రూ.800 కోట్ల వరకు టీఆర్ఎస్ గెలుస్తుందని బెట్టింగ్ పెట్టినట్లు తెలిసింది. బీజేపీపై రూ.500 కోట్లలోపే బెటింగ్ పెట్టినట్లు సమాచారం. దీంతో దిమ్మ తిరిగిన నిర్వాహకులు తమకు నష్టం వస్తుందని భావించి, ఎలాగైనా రెండు వైపులా సమంగా బెట్టింగ్ జరిగేలా పావులు కదిపారు. మునుగోడులోనే మకాం వేసి రాజకీయ పార్టీల ప్రచార సరళిని జాగ్రత్తగా పరిశీలించారు.
బీజేపీ గెలుస్తుందటనే టాక్ తెచ్చి మరీ..
బీజేపీ గెలుస్తుందనే టాక్ వచ్చేలా చేశారు. దీంతో కొద్ది రోజులు బీజేపీ గెలుస్తుందట..1500 ఓట్లతోనైనా బీజేపీ బయట పడుతుంది… ఇది పక్కా అనే ప్రచారం తీసుకువచ్చారు. దీంతో చాలా మంది బెట్టింగ్ కాసే వాళ్లు బీజేపీ గెలుస్తుందని బెట్టింగ్ కాశారు. దీంతో రెండు పార్టీలపై కాస్త అటు.. ఇటు సమంగా బెట్టింగ్ కాసేలా చేయడంలో బెట్టింగ్ నిర్వాహకులు సక్సెస్ అయ్యారు. ఇలా రెండు పార్టీలపై భారీ ఎత్తున బెట్టింగ్ పెట్టేలా చేయడంతో నిర్వాహకులు సక్సెస్ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
అయితే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానానికే పరిమితం అవుతుందన్న టాక్ ఉండడంతో కాంగ్రెస్ పార్టీపై ఎవరూ బెట్టింగ్ కాసినట్లుగా లేదు. ఈ భారీ బెట్టింగ్లో నిర్వాహకులకు బెట్టింగ్ కాసిన అమౌంట్లో 7 నుంచి 10 శాతం వరకు కమిషన్ వస్తుందని తెలిసింది. ఏ లెక్కలో చూసినా బెట్టింగ్ నిర్వహాకులకు రూ. 100 నుంచి రూ.150 కోట్ల వరకు లాభం వస్తుంది. ఈ ఎన్నికలో ఎవరు గెలిచినా నయాపైస ఖర్చు లేకుండా లాభ పడేది మాత్రం బెట్టింగ్ నిర్వాహకులే.. తీవ్రంగా కోలుకోలేకుండా నష్టపోయేది మాత్రం బెట్టింగ్లో పందెం కాసిన పందెం రాయుళ్లే..
యాక్టివాలోకి దూరిన నాగుపాము.. ఈ వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..