Nalgonda విధాత: ఉమ్మడి నల్గొండ(Nalgonda) జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, వారికి పోటీగా టికెట్లు ఆశిస్తున్న ఆశావహులకు మధ్య దూరాన్ని మరింత పెంచాయి. ఇటీవల దాకా సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలకు పార్టీ టికెట్ ఆశావహులు డుమ్మా కొట్టారు. ఇదే రీతిలో మంగళవారం పార్టీ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పార్టీ పతాకావిష్కరణలు, ప్రతినిధుల సభలు సైతం సిట్టింగ్ ఎమ్మెల్యేల సారథ్యంలోనే సాగాయి. దీంతో […]
Nalgonda
విధాత: ఉమ్మడి నల్గొండ(Nalgonda) జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, వారికి పోటీగా టికెట్లు ఆశిస్తున్న ఆశావహులకు మధ్య దూరాన్ని మరింత పెంచాయి. ఇటీవల దాకా సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలకు పార్టీ టికెట్ ఆశావహులు డుమ్మా కొట్టారు.
ఇదే రీతిలో మంగళవారం పార్టీ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పార్టీ పతాకావిష్కరణలు, ప్రతినిధుల సభలు సైతం సిట్టింగ్ ఎమ్మెల్యేల సారథ్యంలోనే సాగాయి. దీంతో యథావిధిగా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసమ్మతి వ్యక్తం చేస్తూ, వారికి పోటీగా టికెట్ ఆశిస్తున్న నాయకులు ఈ సమావేశాలకు గైర్హాజరయ్యారు. వారు సొంతంగా పార్టీ జెండా ఆవిష్కరణలు, సభలు నిర్వహించుకోవడం గమనార్హం.
ముఖ్యంగా నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో ప్రతినిధుల సభ నిర్వహించారు. పోటీగా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సైతం నకిరేకల్ లోని పన్నాలగూడెం క్యాంపు కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించి వివిధ మండలాల నుండి వచ్చిన పార్టీ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.
నల్గొండ(Nalgonda)లో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన పార్టీ ఆవిర్భావ వేడుకల ప్రతినిధుల సభకు అసమ్మతి నేత పిల్లి రామరాజు, చాడ కిషన్ రెడ్డిలు గైర్హాజరయ్యారు. రామరాజు ప్రత్యేకంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. కోదాడలో సైతం బొల్లం మల్లయ్య ఆధ్వర్యంలో సాగిన బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో కన్మంత్ రెడ్డి శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావులు కనిపించలేదు.
నాగార్జునసాగర్ లో ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ వేడుకలకు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి జనగామ జిల్లా ఇన్చార్జిగా వెళ్లడంతో, ఆయన వర్గీయులు ఇక్కడ అంటి ముట్టనట్లుగానే ఉన్నారు.
మునుగోడులో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన పార్టీ ఆవిర్భావ వేడుకలకు మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ వర్గీయులు ముఖం చాటేశారు.
భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన ఆవిర్భావ వేడుకల సమావేశాలకు చింతల వెంకటేశ్వర్ రెడ్డి వర్గీయులు దూరంగా ఉన్నారు.
దేవరకొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సమావేశానికి ఆయన వ్యతిరేక వర్గీయులు దూరంగా ఉండాలనుకున్నప్పటికీ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరు కావడంతో వారంతా సమావేశానికి వచ్చారు.