CWC | సీడ‌బ్ల్యూసీలో మొద‌టిరోజు మూడు తీర్మానాలు

CWC | హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మొద‌టిరోజు ముసాయిదా తీర్మానాలపై చర్చించారు. రాజకీయ, ఆర్ధిక పరిస్ధితులు, భద్రతా సవాళ్లకు సంబంధించి స్ధూలంగా ముసాయిదా తీర్మానంలో ప్రస్తావించినట్లు మాజీ ఆర్థిక‌మంత్రి చిదంబ‌రం తెలిపారు. రాజ్యాంగ, ఫెడరల్ వ్యవస్ధలు బలహీనపడుతున్నాయని, రాష్ట్రాల ఆదాయం గణనీయంగా తగ్గిపోయినట్లు, రాష్ట్రాల బాధ్యతలను నెరవేర్చటంలో అడ్డంకులు ఎదురవుతున్నాయని కూడా స‌మావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి వైపరీత్యం సంభవించినా కేంద్రం సహాయం చేయలేని […]

  • By: krs    latest    Sep 17, 2023 12:41 AM IST
CWC | సీడ‌బ్ల్యూసీలో మొద‌టిరోజు మూడు తీర్మానాలు

CWC |

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మొద‌టిరోజు ముసాయిదా తీర్మానాలపై చర్చించారు. రాజకీయ, ఆర్ధిక పరిస్ధితులు, భద్రతా సవాళ్లకు సంబంధించి స్ధూలంగా ముసాయిదా తీర్మానంలో ప్రస్తావించినట్లు మాజీ ఆర్థిక‌మంత్రి చిదంబ‌రం తెలిపారు. రాజ్యాంగ, ఫెడరల్ వ్యవస్ధలు బలహీనపడుతున్నాయని, రాష్ట్రాల ఆదాయం గణనీయంగా తగ్గిపోయినట్లు, రాష్ట్రాల బాధ్యతలను నెరవేర్చటంలో అడ్డంకులు ఎదురవుతున్నాయని కూడా స‌మావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి వైపరీత్యం సంభవించినా కేంద్రం సహాయం చేయలేని దుస్థితిలో ఉండ‌టంపై, అటు మాణిపూర్‌లో గడ్డు పరిస్ధితులున్నా ప్రధాని మోదీ పర్యటించకపోవటంపై కూడా చ‌ర్చించారు. కాశ్మీర్‌లో సాధారణ స్దితి లేదని, అనేక స్ధాయిల్లో చర్చలు జరిగినా ఉత్తర సరిహద్దుల్లో చైనా దళాలు ఒక్క అంగుళం కూడా వెనక్కు తగ్గక‌పోవ‌డం గురించి స‌మావేశంలో చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యోల్బణం పెరగటంపై, దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతుండ‌టం వంటి అంశాల‌పై చ‌ర్చించార‌ని స‌మాచారం.

తొలిరోజు 3 తీర్మానాలు చేసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ

హైద‌రాబాద్‌లో మొదటిసారి జ‌రుగుతున్న సీడ‌బ్ల్యూసీ స‌మావేశాల తొలిరోజున మూడు అంశాల‌పై తీర్మానాలు చేశారు. ఇటీవ‌ల మృతి చెందిన కేరళ కాంగ్రెస్ నేత ఊమెన్ చండీ మృతిపట్ల సీడ‌బ్ల్యూసీ సంతాపం వ్యక్తం చేస్తూ తీర్మానం చేసినట్లు పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ చెప్పారు. మణిపూర్ ఘటనలలో ప్రాణాలు కొల్పోయిన వారికి సంతాపం వ్యక్తం చేస్తూ మరో తీర్మానం ఆమోదించిందని, హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి వైపరీత్యాన్ని జాతీయ వైపరీత్యంగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతూ మరో తీర్మానాన్ని కూడా ఈ స‌మావేశాల్లో అమోదించినట్లు ఆయన తెలిపారు.

సోనియా, రాహుల్‌కు ఘ‌న స్వాగ‌తం!

కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ శ‌నివారం ఉద‌యం హైదరాబాద్‌కు చేరుకున్నారు. సోనియాతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే , రాహుల్ , ప్రియాంక గాంధీలు శంషాబాద్ ఎయిర్పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి కేసీ వేణుగోపాల్, ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, వీహెచ్ హ‌నుమంత‌రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు.

కాంగ్రెస్ పెద్దల రాక సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున్న ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున కార్గే తాజ్‌కృష్ణకు చేరుకున్నారు. తెలంగాణ సంప్రదాయ నృత్యాలు, కళా బృందాలతో కాంగ్రెస్ పెద్దలకు టీ కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు.