నూతన పారిశ్రామిక వాడలకు 1000 ఎకరాలు
రీజనల్ రింగ్ రోడ్ లోపల ఔటర్ రింగ్ రోడ్ వెలుపల నూతన పారిశ్రామిక వాడల ఏర్పాటుకు సాగుకు యోగ్యం కానీ 500ల నుంచి 1000 ఎకరాల భూములు గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు

- త్రిబుల్ ఆర్ లోపల గుర్తించండి
- సాగుకు యోగ్యం కాని భూములే సేకరించాలి
- ఇప్పటి వరకు కేటాయించిన భూముల వినియోగంపై నివేదిక ఇవ్వండి
- ఐడీపీఎల్ భూములపై నివేదిక ఇవ్వండి
- అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
విధాత, హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్ లోపల ఔటర్ రింగ్ రోడ్ వెలుపల నూతన పారిశ్రామిక వాడల ఏర్పాటుకు సాగుకు యోగ్యం కానీ 500ల నుంచి 1000 ఎకరాల భూములు గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ భూములన్నీ విమానాశ్రయాలకు, జాతీయ రహదారులు, స్టేట్ రహదారులకు 50 నుండి 100 కిలోమీటర్ల దూరంలోపు ఉండాలని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పై సోమవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తో కలసి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ, పరిశ్రమలకు సేకరించే భూములన్నీ సాగుకు ఏమాత్రం యోగ్యం కానీ బంజరు భూములై ఉండాలని స్పష్టం చేశారు. దీనివల్ల, రైతులకు ఎలాంటి నష్టం కలుగదని, కాలుష్యం తక్కువగా ఉండి, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగే విధంగా ఉంటుందన్నారు. పారిశ్రామిక వికేంద్రీకరణకు ప్రాధాన్యత నిస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అనేక కంపెనీలకు పెద్ద ఎత్తున భూములను కేటాయించారని, ఆభూముల్లో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారు? వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అనే అంశాలపై పూర్తి నివేదిక సమర్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యత నివ్వాలని, హైదరాబాద్ లోని నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ తదితర పారిశ్రామిక వాడల విషయంలో ప్రత్యామ్నాయాలను సూచించాలని పేర్కొన్నారు. బల్క్ డ్రగ్ ఉత్పత్తుల కంపెనీల ఏర్పాటుకు చేపట్టాల్సిన చర్యలపై మధ్య ప్రాచ్య, యూరోపియన్ దేశాలలో అమలులో ఉన్న విధానాలపై అధ్యయనం చేయాలనిసీఎం అధికారులను కోరారు.
ఉమ్మడి జిల్లాల్లో బంజరు భూములు గుర్తించండి
రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలైన తొమ్మిది జిల్లాల్లో ప్రభుత్వ, నిరుపయోగ, బంజరు భూములను గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యతనివ్వాలని సీఎం రేవంత్ తెలిపారు. ఇవి నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలన్నారు. దీనివల్ల, ఆయా భూములకు ధరలు కూడా తక్కువగా ఉండడంతోపాటు భూసేకరణకు రైతులు కూడా సహకరిస్తారని తెలియజేసారు. పరిశ్రమలకు ధర్మల్ విధ్యుత్ వినియోగం కాకుండా సోలార్ పవర్ ను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని గ్రామాలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యతనిస్తూ తగిన ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. సందర్భంగా బాలానగర్ లోని ఐడీపీఎల్ భూముల పరిస్థితిపై సి.ఎం ఆరా తీశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణ భాస్కర్, సీఎంఓ అధికారులు శేషాద్రి, శివధర్ రెడ్డి, షా-నవాజ్ కాసీం తదితరులు హాజరయ్యారు.