మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై భూకబ్జా కేసు నమోదు
మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులపై చేవెళ్ల పోలీసులు భూకబ్జా కేసు నమోదు చేశారు. సామ దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన భూమిని కబ్జా చేసిన వివాదంలో ఈ కేసు నమోదైంది.

ఆరు సెక్షన్ల కింద కేసు
విధాత : మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులపై చేవెళ్ల పోలీసులు భూకబ్జా కేసు నమోదు చేశారు. సామ దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన భూమిని కబ్జా చేసిన వివాదంలో ఈ కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు ఎర్లపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో దామోదర్రెడ్డి కొనుగోలు చేసి సర్వేనెంబర్ 32, 35, 36, 38లో ఫంక్షన్ హాల్ నిర్మించుకున్నాడు. దామోదర్ రెడ్డి భూమికి పక్కనే జీవన్ రెడ్డి భూమి ఉంది. ఆ భూమిని ఆక్రమించే ప్రయత్నంలో 2023లో ఫంక్షన్ హాల్ కూల్చేసి దామోదర్ రెడ్డి భూమిని జీవన్రెడ్డి కబ్జా చేశాడు.
కబ్జా చేసిన భూమికి రక్షణగా పంజాబీ గ్యాంగ్ ను జీవన్రెడ్డి నియమించాడు. తన ఫంక్షన్ హాల్ కూల్చేయడంతో నిలదీసేందుకు వెళ్లిన దామోదర్ రెడ్డి పై పంజాబీ గ్యాంగ్, జీవన్రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. మరణాయుధాలు చూపించి దామోదర్ రెడ్డిని భయభ్రాంతులకు గురిచేశారు. ఘటనపై తాజాగా చేవెళ్ల పోలీసులకు బాధితుడు దామోదర్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. దీంతో చేవెళ్ల పోలీస్ స్టేషన్లో జీవన్ రెడ్డి, కుటుంబ సభ్యులపై ఐపీసీ సెక్షన్లు 447, 427, 341, 386, 420, 506, r/w 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.