రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో నల్లగొండకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరో కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకున్నారు
అదుపులోకి మరో నల్లగొండ పోలీస్
ఉన్నత పోలీస్ అధికారితో సాన్నిహిత్యం
దాన్ని అడ్డం పెట్టుకుని.. బెదిరింపులు
భారీగా నగదు వసూళ్లు!
విధాత: రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో నల్లగొండకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరో కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయట పడుతున్నాయి. ఓ కానిస్టేబుల్కు అప్పటి జిల్లా పోలీస్ బాస్తో సాన్నిహిత్యం ఉండటంతో కొందరు ఉన్నతాధికారులను సైతం భయపెట్టాడని సమాచారం. ఇంతటితో ఆగకుండా మహిళల ఫోన్లు ట్యాప్ చేసి, వారి వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించి బ్లాక్ మెయిల్కు, లైంగిక దాడులకు పాల్పడ్డాడని తెలుస్తోంది. జిల్లాలోని పలు దందాల్లో జోక్యం చేసుకొని కోట్ల రూపాయలు వసూళ్లు చేశాడని అంటున్నారు. గుర్రంపోడ్ వద్ద ఓ పోలీస్ బాస్ తన బినామీల పేరిట రౌడీ షీటర్లతో సెటిల్మెంట్ చేసి.. 9 ఎకరాల తోట విక్రయించినట్టు విచారణలో వెల్లడైందని సమాచారం. నార్కెట్పల్లి వద్ద గంజాయి కేసులో దొరికిన వారి వ్యక్తిగత జీవితాల్లో ప్రవేశించిన కానిస్టేబుల్ వందల మందికి సంబంధించిన ఫోన్ రికార్డులు విన్నాడని, బెదిరించి, భారీగా నగదు వసూళ్లు చేయడంతోపాటు అనేక మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. ఈ విషయంలో మరికొంత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.