ప్రాంతీయ పార్టీల కూటమే శాసిస్తది : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
కేసీఆర్ బస్సు యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, యాత్రను విజయవంతం చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కటే మాట మనవి చేస్తున్నా.. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు నమ్మకం లేదు. 14 ఏండ్లు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించాను.

– ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాబోతున్నది
-బీజేపీ ఎంజెడాలో రైతులు, పేదలు, సామాన్య ప్రజలు, దళితులు ఉండరు
– ఇండియా కూటమికి దిక్కు లేదు. బీజేపీకి 200 సీట్లు దాటే పరిస్థితి లేదు
– కాంగ్రెస్, బీజేపీలే సపోర్ట్ చేసే పరిస్థితి వస్తది
– మీడియా సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
కేసీఆర్ బస్సు యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, యాత్రను విజయవంతం చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కటే మాట మనవి చేస్తున్నా.. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు నమ్మకం లేదు. 14 ఏండ్లు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించాను. ఆ తర్వాత పదేండ్లు పూల పొదరిట్టు మాదిరిగా అందర్నీ గౌరవిస్తూ నీట్ గా ఉండే తెలంగాణను తయారు చేశాను. తలసరి ఆదాయం పెంచాను. మౌలిక సమస్యలు తీర్చాను. ఈ రోజు అనుకోకుండా మొన్న ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓడిపోయింది. ప్రజల తీర్పు శిరోధార్యం. ప్రతిపక్ష పాత్ర తప్పకుండా పోషిస్తాం అని కేసీఆర్ పేర్కొన్నారు. లోకసభ ఎన్నికల తర్వాత జాతీయస్థాయిలో ప్రాంతీయపార్టీలే దేశాన్ని శాసించబోతున్నాయన్నారు. వచ్చే అసెంబ్లీలో కేసీఆర్ ప్రళయ గర్జన చూస్తారని.. అవకాశంవస్తే వంద శాతం ప్రధాని రేసులో ఉంటాను అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ ఐదు నెలల పాలనపై, పదేళ్ల మోడీ పాలనపై విమర్శలు గుప్పించారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 17 రోజుల బస్సు యాత్ర చేపట్టాను. ఆ తర్వాత జనం నుంచి వచ్చిన స్పందనలు, మధ్యాహ్నాం సమయంలో జనం ఇచ్చిన సమాచారం ద్వారా తెలుస్తున్నది ఏందంటే ఈ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలను మించి ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ అద్భుతంగా గెలవబోతుంది. ఇందులో సందేహం లేదు. ఈ రెండు ప్రభుత్వాల ఆచరణ, అవలంభించిన తప్పుడు విధానాలు ప్రజల్లోకి వెళ్లాయి. వాటిని మేం చెప్పగలిగాం. దాని ఫలితమే బీఆర్ఎస్ అద్భుతమైన విజయం సాధించబోతుంది అని కేసీఆర్ స్పష్టం చేశారు.
ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాబోతున్నది
ఏ ఊరుకి పోతే ఆ దేవుని మీద ఒట్టు పెట్టుకోవడం అలవాటు అయిపోయింది. రైతు రుణమాఫీకి డిసెంబర్ 9 పోయింది. ఇప్పుడు ఆగస్టు 15 అని అంటుడు. మరి తెలివిగా ఏ ఆగస్టు 15 చెప్పడం లేదు. అర్థమైతలేదు. వచ్చే ఏడాది ఆగస్టుల అంటే అప్పుడు ఏం చేయాలి. బస్సు యాత్ర చేస్తున్నప్పుడు మధ్యాహ్నం సమయంలో చాలా మంది రైతులు కలిశారు. రైతుల అడ్వాన్స్గా అనుమానం వ్యక్తం చేశారు. ఏ ఆగస్టు అని అడిగారు. వ్యవసాయా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రావడమే మాకు శాపంగా మారిందని రైతులు భావించారు. రైతు భరోసా, రుణమాఫీ లేదు. ఒట్లు పెట్టుకోవడం పెద్ద జోక్ అయిపోయింది. కేసీఆర్ మీద తిట్లు దేవుళ్ల మీద ఒట్లు తప్ప ఏం లేదు. పంటలు ఎండిపోయాయి. అక్కడక్కడ పండిన ధాన్యాన్ని కూడా కొంటలేరు. చెరువులు, చెక్ డ్యామ్లు నింపలేదు. బోర్లు వేసి లక్షల రూపాయాలు వేస్ట్ చేసుకున్నారు రైతులు. భూగర్భ జలాలు పడిపోయాయి. సాగు నీళ్లు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయాయి. చెరువుల్లో నీళ్లు లేక చేపలు చనిపోయాయి. ఇదంతా షార్ట్ పీరియడ్లో జరిగిపోయింది. చేపలు పట్టుకోవడం ఇబ్బందిగా మారింది నీళ్లు వదలాలని గతంలో మమ్మల్ని అడిగారు. ఇప్పుడేమో నీళ్లు లేక చేపలు చనిపోయాయి. ధాన్యానికి క్వింటాల్కు బోనస్ 500 ఇస్తామన్నారు. బోనస్ మాటనే లేదు. బోనస్ బోగస్ అయింది. రైతులు ఆగ్రహం మీద ఉన్నారు. బోనస్ పక్కన పెడితే మద్దతు ధర ఇప్పించమని రైతులు అడుగుతున్నారు. ఈ ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురికాబోతోంది. వాళ్ల దుష్ప్రపరిపాలన వారికి శాపంగా మారుతుందన్నారు.
దుర్మార్గమైన పద్ధతిలో దుర్భషలాడారు
ప్రజలకు కోపం తెప్పించింది ఏందంటే.. శాసనసభలో కానీ బయట కానీ అంత గలీజ్గా, చండాలంగా మాట్లాడారు. జనరల్గా పార్టీ నాయకులు, ప్రజలు కేసీఆర్ను టైగర్ అంటరు. పులిని బోనులో వేస్తాం.. చర్లపల్లి జైల్లో వేస్తాం. చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం కట్టిస్తాం అని దురుసుగా మాట్లాడి ఒక దర్మార్గమైన పద్ధతిలో దుర్భషలాడారు. పులిని ఎందుకు బోనులో వేస్తారు.. ఏ కారణం చేత వేస్తారు అని కేసీఆర్ నిలదీశారు. 2014-15లో తలసరి ఆదాయం లక్షా 24 వేలు ఉంటే 2014 వరకు 3 లక్షల 13 వేలకు తీసుకుపోయాం. అది కేసీఆర్ చేసిన తప్పా..? దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణను నంబర్ వన్ చేయడం తప్పా..? తెలంగాణ జీఎస్డీపీ 2014లో 4.17 లక్షలు ఉంటే 2024 వచ్చే సరికి 14.5 లక్షలకు తీసుకుపోయాం. దేశ సగటు కంటే చాలా ఎక్కువ పురోగతి సాధించాం. దాని కోసం కేసీఆర్ను నిందించాలా..? వ్యవసాయ రంగంతో పాటు పరిశ్రమలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ను అందించినందుకు కోసం దుర్భషలాడాల్నా..? మోటార్లకు మీటర్లు పెట్టాలని రూ. 25 వేల కోట్ల కట్ చేసిన మీటర్లు పెట్టలేదు. ఆ విషయంలో రైతులను కాపాడినందుకు దుర్భషలాడాల్నా..? వడ్ల ఉత్పత్తిలో పంజాబ్ను తలదన్ని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టినందుకు దుర్బషలాడాల్నా..? అని కేసీఆర్ నిలదీశారు.
ముందుకు పోయినట్టా? వెనకకు పోయినట్టా?
బీజేపీ ఎంజెడాలో రైతులు, పేదలు, సామాన్య ప్రజలు, దళితులు ఉండరు. ఈ పదేండ్లలో పేదల గురించి మోదీ పట్టించుకోలేదు. 2014 నుంచి 150 నినాదాలు ఇచ్చారు. ఏ ఒక్క నినాదం కూడా ఆచరణలోకి రాలేదు. 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్నాడు. అర్బన్ నక్సలైట్లు అని వారిని హత్య చేశాడు. యూపీ ఎన్నికల నేపథ్యంలో నల్ల చట్టాలు వాపస్ తీసుకుని క్షమాపణ వేడుకున్న అతి దుర్మార్గమైన ప్రధాని మోదీ. మేకిన్ ఇండియా లేదు.. మన్ను లేదు. డిజిటల్ ఇండియా లేదు. స్మార్ట్ సిటీలు ఒక్కటి కూడా కాలేదు. ఊకదంపుడు మచ్చట్లు తప్ప ఏం లేదు. సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఎక్కడ..? ఈ దేశంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని కేసీఆర్ గుర్తు చేశారు. 2004-14 మధ్య జీడీపీ 6.8 శాతం ఉంటే.. ఈ దేశానికి ఘనత వహించిన విశ్వ గురు కాలంలో 5.8 శాతం వచ్చింది. దేశం వెనుకకు పోయినట్టా..? ముందుకు పోయినట్టా..? ఒక రకమైన ఉన్మాద స్థితిలోకి ఈ దేశాన్ని నెట్టేస్తున్నారు. విద్వేషం పెంచడం తప్ప దేశానికి ఒరిగిందేమీ లేదు. చాలా ఘోరాలు జరిగాయి. బీజేపీ పట్ల తెలంగాణ ప్రజల్లో కూడా విముఖత ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీజేపీలే సపోర్ట్ చేసే పరిస్థితి వస్తది
ఈ ఎన్నికల్లో కచ్చితంగా నిర్ధారణకు వస్తున్న విషయం ఏంటంటే.. ఇండియా కూటమికి దిక్కు లేదు. బీజేపీకి 200 సీట్లు దాటే పరిస్థితి లేదని చెబుతున్నారు. అందుకే మోదీ చొక్కాలు చింపుకుంటున్నారు. బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. ఆ పార్టీ 250 కంటే దాటే పరిస్థితి లేదు. దాంతో గాండ్రింపులు ప్రారంభించారు. కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయింది. కచ్చితంగా ప్రాంతీయ పార్టీల కూటమి ఈ దేశాన్ని శాసించే స్థాయికి పోతుంది. దేశంలో ఒక రివర్స్ సీన్ కనబడుతది. బీఆర్ఎస్ 12 సీట్లు గెలిస్తే ఎటు మద్దతిస్తారు అని జాతీయ మీడియా ప్రతినిధులు అడుగుతున్నారు అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈసారి ప్రాంతీయ పార్టీలంతా కలిసి బలమైన కూటమిగా ఏర్పడుతాం. మాకు కాంగ్రెస్, బీజేపీ సపోర్ట్ చేసే పరిస్థితి వస్తది. మేం వాళ్లకు సపోర్ట్ చేసే రోజులు పోయాయి. బీజేపీకి ఈ రాష్ట్రంలో ఒకటి లేదా సున్నా.. బీజేపీకి డిజిట్ దిక్కు లేదంటే అమిత్ షా డబుల్ డిజిట్ అంటడు. దక్షిణాదిలో 10 సీట్లు దాటే పరిస్థితి లేదు. తెలంగాణ, కేరళ, తమిళనాడు, ఏపీ సున్నా.. ప్రజ్వల్ రేవణ్ణ కేసు తర్వాత కర్ణాటకలో ఆరేడు సీట్లకే పరిమితమైంది బీజేపీ. 130 సీట్లు ఉన్నా దక్షిణాదిలో బీజేపీకి 10 సీట్లు దాటే పరిస్థితి లేదు. ఉత్తర భారతంలో కూడా చాలా ఘోరంగా దెబ్బతింటుంది బీజేపీ అని కేసీఆర్ తెలిపారు.
ఖర్గే అట్ల మాట్లాడం దురదృష్టం
ఖర్గే లాంటి వ్యక్తి అట్ల మాట్లాడం అంతకంటే దురదృష్టం ఇంకోటి ఉండదు. ఇన్ని రోజులు ఢిల్లీకి పోయిన ఆయన.. నాకు హైదరాబాద్ దగ్గరైతదని చెప్పి హైదరాబాద్ గొంతు కోస్తమంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఖర్గే లాంటి వ్యక్తి కూడా హైదరాబాద్ రెండో రాజధాని కావాలని అంటుండంటే వీళ్లు ఎవరు వచ్చినా హైదరాబాద్ను దెబ్బ పెడుతారు అని అర్థమైతుంది. హైదరాబాద్ మనది మన సొంతం. దాన్నికి అట్ల పోనివ్వం. అటువంటి పిచ్చివాళ్లకు ఇక్కడ స్థానం ఇవ్వకూడదు.
ఏం జరగబోతదో చూద్దాం
వచ్చే అసెంబ్లీలో కేసీఆర్ ప్రళయ గర్జన చూస్తారు. డెఫినెట్గా చూస్తరు. అవకాశం వస్తే వంద శాతం ప్రధాని రేసులో ఉంటాను. అవకాశం వస్తే ఎవరైనా ఉండరా..? నేను అంత అమాయకుడినా..? అవకాశం రావాల్నే కానీ.. తప్పకుండా రేసులో ఉంటాను. పార్లమెంటరీ పార్టీ లీడర్ సురేశ్ కాబోతున్నారు. చైర్మన్కు నేను రేపు లెటర్ ఇష్యూ చేస్తున్నాను. సురేశ్ ఈజ్ మెయిన్ ప్లేయర్ ఇన్ ఢిల్లీ అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఒక రోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నీ దొడ్లే ఎంత మంది ఉంటారో చూడు అని అన్నారు. ఏం కాలేదు. ఇది కూడా అంతే ఉంది. ఈయననే బీజేపీలోకి జంపు కొడుతురాని కాంగ్రెస్ పార్టీలో అనుమానాలు ఉన్నాయి. ఓటుకు నోటు కేసులో ఆయన తప్పించుకోలేరు. కాబట్టి కిందమీద అయితే కేసులు తప్పించుకునేందుకు బీజేపీలోకి వెళ్తాడని అనుకుంటున్నారు. మా పార్టీలోకే కాంగ్రెసోళ్లు రాబోతున్నారు. నన్ను ఎవరూ డైరెక్ట్ అడగలేదు. మా పార్టీలో ఉన్న ముఖ్యులను కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యులు కన్సల్ట్ అవుతున్నారు. 26 నుంచి 33 మంది ఎమ్మెల్యేలం రెడీగా ఉన్నాం. ఇద్దరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఏం జరగబోతదో చూద్దాం అని కేసీఆర్ అన్నారు.