అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి అధికారానికి దూరమై.. పార్లమెంటు ఎన్నికల్లో ఉనికి చాటేందుకు పోరాడుతున్న బీఆరెస్ పార్టీకి ఇండిపెండెంట్ల ఎన్నికల గుర్తులు మరో సవాల్గా తయారయ్యాయి
విధాత : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి అధికారానికి దూరమై.. పార్లమెంటు ఎన్నికల్లో ఉనికి చాటేందుకు పోరాడుతున్న బీఆరెస్ పార్టీకి ఇండిపెండెంట్ల ఎన్నికల గుర్తులు మరో సవాల్గా తయారయ్యాయి. ముఖ్యంగా కారును పోలిన రోడ్డు రోలర్, రోటీ మేకర్లు పార్లమెంటు ఎన్నికల బరిలో ఉన్న బీఆరెస్ ఎంపీ అభ్యర్థులను టెన్షన్ పెడుతున్నాయి. గతంలో ఎన్నికల సంఘం వద్ద, న్యాయస్థానాల ద్వారా కూడా కారును పోలిన గుర్తులను స్వతంత్రులకు కేటాయించరాదంటూ బీఆరెస్ పోరాడినప్పటికి ఫలితం దక్కడం లేదు. కారును పోలిన గుర్తులను రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆరెస్ శ్రేణులు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం తిరస్కరించింది. ఫ్రీసింబల్స్ను తొలగించలేమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో గులాబీ దళంలో ఎప్పటిలాగే ఈసారి కూడా గుర్తుల గుబులు మొదలయింది. ఫ్రీ సింబల్స్గా ఉన్న రోడ్డు రోలర్, రోటీ మేకర్లను ఈ దఫా పార్లమెంటు ఎన్నికల్లోనూ పలువురు ఎంపీ అభ్యర్తులకు ఎన్నికల అధికారులు కేటాయించడంతో మరోసారి బీఆరెస్లో గుర్తుల టెన్షన్ మొదలైంది.
ఆ స్థానాల్లో గుర్తులు గుబులు
లోక్సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో యుగ తులసి పార్టీకి రోడ్డు రోలర్ గుర్తు కేటాయించబడింది. స్వతంత్ర అభ్యర్థులకు రోటీ మేకర్ గుర్తు లభించింది. సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో యుగ తులసి పార్టీ అభ్యర్థి కె. శివ కుమార్కు ఈవీఎం బ్యాలెట్ యూనిట్లో 5 నంబర్ ఉన్న రోడ్డు రోలర్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. ఈవీఎం బ్యాలెట్ యూనిట్లో 4గా ఉన్న కారు గుర్తుపై ఇక్కడ బీఆరెస్ అభ్యర్థి టి. పద్మారావు గౌడ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి దండెం రత్నంకు రోడ్డు రోలర్ గుర్తు లభించగా, నివేదిత సాయన్నఈ స్థానంలో కారు గుర్తుతో బీఆరెస్ టికెట్పై పోటీ చేస్తున్నారు. హైదరాబాద్ లోక్సభ రేసులో స్వతంత్ర అభ్యర్థికి రోటీ మేకర్ గుర్తును కేటాయించారు.
గతంలో 2019 భువనగిరి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 5వేల ఓట్ల మెజార్టీతో గెలవగా.. ఇక్కడ కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్ నుంచి పోటీ చేసిన అభ్యర్థికి ఏకంగా 25 వేల ఓట్లు వచ్చాయి. ఇప్పుడూ ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి రెండు స్థానాల్లోనూ స్వతంత్రులకు రోడ్డు రోలర్, రోటీ మేకర్ గుర్తులు కేటాయించారు. రాష్ట్రంలోని ఇతర ఎంపీ స్థానాల్లోనూ ఆ గుర్తులు కలిగిన వారు పోటీలో ఉన్నారు. దీంతో వారు ఈ సారి పార్లమెంటు ఎన్నికల్లో ఎవరి గెలుపు అవకాశాలను దెబ్బకొడతారనే చర్చ సాగుతోంది. 2018 ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల వల్ల బీఆరెస్ అభ్యర్థులకు 20కిపైగా స్థానాల్లో నష్టం జరిగిందని బీఆరెస్ వాపోయింది. ఇందుకు గుర్తింపు పొందిన ఇతర పార్టీల అభ్యర్థులకన్నా కారును పోలిన గుర్తులతో బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు పోలవ్వడాన్ని రుజువుగా చూపింది. మునుగోడు, జహీరాబాద్, సిర్పూర్, డోర్నకల్లో 2018 ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తుకు సీపీఎం, బీఎస్పీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆ పార్టీ పేర్కోంది. నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, గద్వాల, నాగార్జునసాగర్లో కెమెరా గుర్తుకు కూడా బీఎస్పీ, సీపీఎం కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయని నివేదించింది. నకిరేకల్ నుంచి పోటీ చేసి గెలిచిన చిరుమర్తి లింగయ్యకు 8259 ఓట్ల మెజార్టీ రాగా ఇక్కడి నుంచి సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ట్రక్కు గుర్తుపై పోటీ చేసినదుబ్బ రవి అనే అభ్యర్థికి ఏకంగా 10383 ఓట్లు వచ్చాయి. అదే ఎన్నికల్లో కోదాడలోనూ బీఆరెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేకు 756 ఓట్లు మెజార్టీ రాగా, ఇక్కడ స్వతంత్ర అభ్యర్థికి ఏకంగా 5240 ఓట్లు రావడం అప్పట్లో చర్చనీయాంశమైంది.