రేవంత్రెడ్డికి హరీశ్రావు లేఖ
విధాత. హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని సీఎం రేవంత్రెడ్డిని కోరుతూ బీఆరెస్ మాజీ మంత్రి, టి.హరీశ్రావు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేస్తామని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
బీఆరెస్ ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతులు కూడా మళ్లీ బ్యాంకులకు వెళ్లి 2 లక్షల రూపాయల రుణాలు తీసుకోవాలని మీరే స్వయంగా పిలుపునిచ్చారని, మీ మాటను నమ్మి రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్నారని, డిసెంబర్ 9న మీరు ప్రకటించినట్టుగా రుణమాఫీ జరగలేదని, మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 4 నెలలు కావొస్తున్నప్పటికి రుణ మాఫీ కాలేదన్నారు.
రైతులు బ్యాంకుల నుంచి నోటీసులు, ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారని, అసలే కరవు, అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులకు బ్యాంకర్ల ఒత్తిడి మరింత ఇబ్బందికరంగా మారిందన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు మీరిచ్చిన హామీ మేరకు వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని హరీశ్రావు కోరారు.
ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్ జిల్లాలో వందలాది మంది రైతులకు బ్యాంకు నోటీసులు అందాయని, దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తీసుకున్న అప్పుకు వడ్డీ మీద వడ్డీ పెరిగి రైతులపై పెను ఆర్థిక భారం పడుతున్నదన్నారు. బ్యాంకులు రైతులను డిఫాల్టర్ల జాబితాలోకి ఎక్కిస్తున్నాయని, సిబిల్ రేటింగ్ కూడా దారుణంగా పడిపోతున్నదని, రైతుల పిల్లలు చదువు కోసం విద్యారుణాలు తో పాటు ఇతర రుణాలు పొందలేక పోతున్నారని, ఈ సమస్యలతో రైతులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని హరీశ్రావు తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందక, పంటలు ఎండిపోయి, సకాలంలో నీళ్లు అందక, ఈ నాలుగు నెలల కాలంలో 209 మంది అన్నదాతలు చనిపోయారని పేర్కోన్నారు. రుణమాఫీ విషయంలో బ్యాంకర్ల ఒత్తిళ్లకు, వేధింపులకు తట్టుకోలేక రైతులు ప్రాణం తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని ఎప్పట్లోగా చేస్తారో స్పష్టమైన తేది ప్రకటించాలని రైతుల పక్షాన కోరుతున్నానని లేఖలో పేర్కోన్నారు. రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు, పంట మద్దతు ధరపై 500 రూపాయల బోనస్, ఎకరానికి 15 వేల చొప్పున పెట్టుబడి సాయం, పంటపొలాలకు నీళ్లు, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలని సీఎం రేవంత్రెడ్డిని లేఖలో హరీశ్రావు డిమాండ్ చేశారు.