ప్రజాపాలన దరఖాస్తులపై నేడు సీఎం సమీక్ష
ప్రజాపాలనలో భాగంగా గత నెల 26వ తేదీ నుండి ఈనెల 6 వతేదీ వరకు నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో అందిన దరఖాస్తుల

విధాత, హైదరాబాద్: ప్రజాపాలనలో భాగంగా గత నెల 26వ తేదీ నుండి ఈనెల 6 వతేదీ వరకు నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో అందిన దరఖాస్తుల పరిశీలన, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేక నోడల్ అధికారులు, సీజీజీ డైరెక్టర్ జనరల్, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితర ఉన్నతాధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్-సైట్ prajapalana.telangaana.gov.inను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.
ప్రజాపాలనలో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు
ప్రజాపాలన జరిగిన పదిరోజుల్లో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో ఐదు గ్యారంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు రాగా, ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 ఉన్నాయి. రాష్ట్రంలోని 16,392 గ్రామ పంచాయతీలు, 710 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహించారు. ఈ గ్రామసభల్లో 1,11,46,293 మంది పాల్గొన్నారు. ఈ ప్రజాపాలనలో మొత్తం 3,714 అధికార బృందాలు పాల్గొని దరఖాస్తుల స్వీకరణకు 44,568 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ప్రజాపాలన సజావుగా జరిగేందుకు పది ఉమ్మడి జిల్లాలు, జీహెచ్ఎంసీలోని 5 జోన్లకు ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక పర్యవేక్షణాధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఈ దరఖాస్తులన్నింటినీ జనవరి 17వ తేదీలోగా డేటా ఎంట్రీని పూర్తి చేయాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశించారు.