విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: మతోన్మాదానికి వ్యతిరేకంగా భావ సారూప్య పార్టీలతో పొత్తుకు సిద్ధమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా పార్టీ మొదటి నుండి ఖచ్చితమైన అభిప్రాయాన్ని కలిగి ఉందని అన్నారు. ఈ దేశానికి ప్రమాదకరియైన బీజేపీ ఎదుగుదలను నిలువరించడమే లక్ష్యమని పేర్కొన్నారు. నిడమనూరులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. దేశంలో మోడీ పతనం ప్రారంభమైందని, ఇండియా కూటమి విధానాలతో మోడీకి భయం పట్టుకుందన్నారు.
ఇండియాను భారత్ గా పిలవాలని మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అతని భయానికి నిదర్శనమన్నారు. ఇండియా కూటమి పేరును ఉచ్చరించడానికి భయపడుతున్నారన్నారు. దేశం పేరు మారిస్తే దేశ ప్రజల బతుకులు మారవని, మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం హర్షనీయమైనప్పటికీ.. అమలుకు కాలయాపన సరైనది కాదన్నారు. ఈబిల్లు పేరుతో మహిళల్లో సానుభూతి పొందాలనే ఆలోచన, అమలులో చిత్తశుద్ధి లేకపోవడం దేశ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. దేశంలో జన గణనతో పాటు కుల గణన జరగాలని తెలిపారు.
గతంలో తెలంగాణలో కూడా బీజేపీ పాగా వేసి అధికారంలోకి రావాలని కుట్రలు చేసిందని, దానిని కమ్యూనిస్టులు అడ్డుకున్నారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన కేసీఆర్, ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని, మా వైఖరిలో మార్పు లేదని స్పష్టం చేశారు. బీజేపీకి అనుకూలంగా ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్నారని, ఎన్డీఏ అధికారంలోకి వస్తే మా భాగస్వామ్యంతోనే సాధ్యమనే మాటలు బీఆర్ఎస్ మంత్రులనోట వింటున్నామని, ప్రజలు ద్వంద వైఖరిని గమనిస్తున్నారని ఆయన అన్నారు.
కాంగ్రెస్ హామీలతో బీఆర్ఎస్ బెంబేలెత్తు తోందని, విమర్శించడం తప్ప కొత్తగా హామీలు ఇవ్వలేకపోతున్నదన్నారు. తెలంగాణలో పార్టీ నిర్ణయించుకున్న స్థానంలో పోటీలో ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, బండా శ్రీశైలం, చినపాక లక్ష్మీనారాయణ, పాలడుగు నాగార్జున, ఎండీ హషం, జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనందు, ఎండీ సలీం, కొండేటి శ్రీను, అవుతా సైదులు, మండల కార్యదర్శి కందుకూరి కోటేష్, కత్తిలింగారెడ్డి, కుర్ర శంకర్, కోమండ్ల గురువయ్య, మలికంటి చంద్రశేఖర్, వింజమూరు శివ, ఆకారపు నరేష్, ఇంజమూరి పుల్లయ్య పాల్గొన్నారు.