కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపాలిట శాపంగా మారిందని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు
బీఆర్ఎస్ “రైతు నిరసన దీక్ష”
రైతుల పక్షాన పోరాడుతాం
విధాత, వరంగల్ ప్రతినిధి: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపాలిట శాపంగా మారిందని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా శనివారం రైతు దీక్షలు చేపట్టింది. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి, వర్ధన్నపేట, నర్సంపేట సెంటర్లలో రైతు దీక్షలు నిర్వహించారు. వర్ధన్నపేటలో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి వినయ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలన్నింటికి క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ ప్రకటించే వరకు తాము ఆందోళన చేపడుతామన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఉచిత కరెంటు, రైతు బంధు అందించారని వివరించారు. రైతు ఏడ్చిన రాజ్యం…ఎద్దు ఏడ్చిన ఎవుసం ఎప్పుడూ బాగుపడదనే సామెత ఉందన్నారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక రైతు మొఖంలో ఆనందం ఆవిరైపోయిందన్నారు. నీళ్లు, నాణ్యమైన కరెంట్, పంట పెట్టుబడి లేక రైతులు కన్నీళ్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై కుట్రలు చేస్తూ… కాంగ్రెస్ కృత్రిమ కరువు సృష్టిస్తోందని విమర్శించారు
కాంగ్రెస్ సృష్టించిన కరువు : పెద్ది సుదర్శన్ రెడ్డి
పదేళ్లు సమర్థవంతంగా పాలించి కరువు ఛాయలను దగ్గరకు కేసీఆర్ రానియ్యలేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులకు పరిపాలన చేత గాక 4 నెలల్లోనే రాష్ట్రమంతట కరువు విలయతాండవం చేస్తోందన్నారు. రైతులు అడగకుండానే రైతుబంధు, నాణ్యమైన కరెంట్, మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులు రోడ్డెక్కి ధర్నాలు, నిరసనలు చేసినా నో రైతుభరోసా అమలు చేయడంలేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ. 25 లక్షలివ్వాల్సిందేనని డిమాండ్ చేశారు
రైతుల మేలు కోసమే బీఆర్ఎస్ నిరసన: ఎంపీ కవిత
రైతుల మేలు కోసమే బీఆర్ఎస్ నిరసన చేపట్టిందని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, బిఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి కేసీఆర్ రైతుల మేలు కోరుతున్నారన్నారు. తమ ప్రభుత్వహయంలో కష్టపడి సాగునీటి ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్లిచ్చామన్నారు. ఉన్న ప్రాజెక్ట్ లు నిర్వహించలేక కాంగ్రెస్ రైతులకు కంట నీరు తెప్పిస్తుందన్నారు.