ధాన్యంం కొనుగోలు సమస్యలపై అన్నదాతల వరుస ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఎక్కడో ఒక చోట నిత్యం రైతన్నలు నిరసనలకు దిగుతున్నారు
ధాన్యం కొనుగోలు సమస్యలపై నిరసనల పరంపర
యాదాద్రి కలెక్టరేట్ ముందు ధర్నా
వరంగల్-హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో
విధాత : ధాన్యంం కొనుగోలు సమస్యలపై అన్నదాతల వరుస ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఎక్కడో ఒక చోట నిత్యం రైతన్నలు నిరసనలకు దిగుతున్నారు. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట వరుసగా రెండో రోజు బుధవారం కూడా రైతులు ధర్నా నిర్వహించారు. అటు హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిని దిగ్బంధం చేసిన రైతులు తమ నిరసనను వ్యక్తం చేశారు. గంట పాటు రాస్తారోకో నిర్వహించారు.
దీంతో జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. స్థానిక తహసీల్దార్ శ్రీధర్ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. అంతకుముందు భువనగిరి మండలం పచ్చళ్లపాడు తండా గ్రామానికి చెందిన గిరిజన రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని లేకపోతే తమ ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు.