HYDERABAD | కరెంటు బిల్లు కట్టమంటే … పిడిగుద్దులు గుద్దిన కిక్బాక్సర్…
కరెంటు బకాయిలు కట్టమని వెళ్లిన ఓ విద్యుత్ సిబ్బందిపై కిక్బాక్సర్ పిడిగుద్దలు వర్షం కురిపించాడు. బిల్లు కట్టమని అడిగితే కట్టను పొమ్మన్నాడు. సిబ్బంది కరెంట్ కట్ చేశాడు. దీంతో కిక్బాక్సర్ అయిన ఆ ఇంటి యజమాని కొడుకు పిడిగుద్దుల వర్షం కురిపించాడు.

విధాత, హైదరాబాద్:కరెంటు బకాయిలు కట్టమని వెళ్లిన ఓ విద్యుత్ సిబ్బందిపై కిక్బాక్సర్ పిడిగుద్దలు వర్షం కురిపించాడు. బిల్లు కట్టమని అడిగితే కట్టను పొమ్మన్నాడు. సిబ్బంది కరెంట్ కట్ చేశాడు. దీంతో కిక్బాక్సర్ అయిన ఆ ఇంటి యజమాని కొడుకు పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఆ వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.
ఎర్రగడ్డ సెక్షన్ పరిధిలోని మోతి నగర్ లో శ్రీ టి.రాములు సర్వీస్ కనెక్షన్ నెంబర్: SZ104823 / USC నెంబర్ 100124620 పై రూ.6858/- బిల్లు పెండింగ్ వున్నది. గత ఫిబ్రవరి నెల నుండి విద్యుత్ బిల్లు చెల్లించలేదు. ప్రతి నెలా బిల్లు చెలాయించాలని విద్యుత్ సిబ్బంది అడుగుతున్నా దాట వేత సమాధానాలు ఇస్తూ పెండింగ్ బిల్లులు చెల్లించట్లేదు. సుమారుగా ఐదు నెలలుగా చెల్లించకపోవడంతో, గురువారం విద్యుత్ సిబ్బంది మీటర్ పక్కన వున్న ఎంసీబీ ని నిలిపివేశారు. దీనితో ఆవేశానికి గురైన నివాసితుడు మురళీధర్ స్వామి అక్కడ వున్న విద్యుత్ సిబ్బంది పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ సంఘటనపై బాధితుడు శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో దాడి చేసిన వ్యక్తి ని అదుపులోకి తీసుకుని పలు సెక్షన్లను అనుసరించి కేస్ నమోదు చేసారు.
విద్యుత్ సిబ్బంది పై దాడి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం…
విధి నిర్వహణ లో వున్న విద్యుత్ అధికారులపై, సిబ్బంది పై దాడి చేయడం, విధులు నిర్వర్తించకుండా అడ్డగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముషారఫ్ ఫరూఖీ ఐఏఎస్ హెచ్చరించారు. గురువారం బంజారా హిల్స్ సర్కిల్ పరిధిలోని మోతీ నగర్ లో జరిగిన సంఘటనలో గాయపడిన సిబ్బంది గణేష్, శ్రీకాంత్, భాస్కర్ లను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య పరంగా అవసరమైన సహాయాన్ని అందించాలని సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజినీర్ శ్రీ చంద్ర శేఖర్ ను, డివిజనల్ ఇంజినీర్ గ్రీన్ ల్యాండ్స్ శ్రీ సుధీర్ లను ఆదేశించారు.