తెలంగాణలోని ఎంపీ స్థానాల్లో, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో మాదిగలకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించిన కాంగ్రెస్ను మాదిగలు ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు
విధాత, హైదరాబాద్ : తెలంగాణలోని ఎంపీ స్థానాల్లో, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో మాదిగలకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించిన కాంగ్రెస్ను మాదిగలు ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశాన్ని 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడూ మాదిగల వర్గీకరణ గూర్చి ఆలోచించలేదని మండిపడ్డారు. మాదిగలను ఘోరంగా అవమానించిన కాంగ్రెస్ నేతలు మాదిగలను ఓట్లు అడగొద్దని సూచించారు. రాజ్యాంగానికి మోడీ రక్షణ కవచం అన్నారు. ఎన్నికల సంఘం అనుమతితోనే కాంగ్రెస్ వ్యవహారశైలిపై మహాధర్నా చేయబోతున్నట్లు తెలిపారు. ఎంపీ టికెట్ల విషయంలో మాదిగలకు కాంగ్రెస్ చేసిన అన్యాయంపై రాష్ట్రంలోని 80లక్షల మంది మాదిగ ఓటర్లు తమ చైతన్యం చాటి బుద్ది చెప్పాల్సిన అవసరముందన్నారు.
కాంగ్రెస్ కంటే బీఆరెస్ నయం : మోత్కూపల్లి
మాదిగలకు టికెట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ కంటే బీఆరెస్ నయమని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ మాదిగలకు అన్యాయం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాదిగల వ్యతిరేకి అని చెప్పుకొచ్చారు. 80 లక్షల మంది మాదిగలు ఓటు వేయకుండానే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా? అని గొంతెత్తి ప్రశ్నించారు. మాదిగలకు టికెట్లు ఇవ్వకపోవడంపై ధర్నాచౌక్ వద్ద దీక్ష చేస్తానని మోత్కుపల్లి నర్సింహులు ప్రకటించారు.