కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందన్న బీఆరెస్, బీజేపీ ప్రచారం పగటి కలలేనని, మా ప్రభుత్వాన్ని కాపాడుకునే సత్తా మాకుందని, ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏమి లేదని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు
క్రికెట్ టీమ్లాగా పనిచేస్తున్నాం
బీఆరెస్కు సున్నా సీట్లే..త్వరలో వీఆరెస్
మోదీ పాలనలో దేశం అస్తవ్యస్తం
మరోసారి మోదీ వస్తే నియంతృత్వమే
విధాత: కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందన్న బీఆరెస్, బీజేపీ ప్రచారం పగటి కలలేనని, మా ప్రభుత్వాన్ని కాపాడుకునే సత్తా మాకుందని, ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏమి లేదని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడారు. రేవంత్ సీఎంగా, భట్టి డిప్యూటీ సీఎంగా, మేం 11మంది మంత్రులం క్రికెట్ టీమ్ మాదిరిగా జట్టుగా పనిచేస్తున్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే ఐదు గ్యారంటీలు అమలు చేశామని, ఎన్నికల కోడ్ కారణంగా మిగతా హామీల అమలులో జాప్యం నెలకొందన్నారు. కోడ్ ముగిసిన వెంటనే హామీల అమలు కొనసాగుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని, ఇరిగేషన్ను కేసీఆర్ సర్వ నాశనం చేశారని విమర్శించారు. కాళేశ్వరం విషయంలో జరిగిన తప్పులకు ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆరెస్ ఉండదంటూ సంచలన కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆరెస్కు సున్నా సీట్లు వస్తాయని, బీఆరెస్ త్వరలోనే వీఆర్ఎస్ తీసుకుంటుందన్నారు. మేడిగడ్డలో నీళ్లు నింపాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్న కేసీఆర్ ఆ బ్యారేజీకి కుంగటుబాటుకు బాధ్యత నుంచి తప్పించుకోలేరన్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక మేరకు కాళేశ్వరం మరమ్మతులపై ముందుకెలుతామన్నారు. బీజేపీకి తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. హైదరాబాద్, విజయవాడ బుల్లెట్ ట్రైనల్కు అనుకూలమని, మోదీ వాటి ఊసెత్తడం లేదన్నారు.
మోదీ పాలనలో దేశం అస్తవ్యస్తం
దేశ ప్రగతికి వెన్నుముకగా నిలిచిన అనేక ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం ప్రైవేట్ దళారిలకు అమ్మిందని ఉత్తమ్ ఆరోపించారు. కార్పోరేట్లకు, సంపన్నులకు మేలు చేసే విధానాలకు మోదీ అనుకూలంగా వ్యవహారిస్తున్నారన్నారు. పార్లమెంట్ వ్యవస్థను మోదీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని విమర్శించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎలాంటి ఆధారాలు లేకుండా చార్జ్షీట్ ఫైల్ చేయకుండానే జైలులో పెట్టారని ఆరోపించారు. ఒక సీఎంకే ఆ పరిస్థితి వస్తే.. సామాన్యుల పరిస్థితి ఎంటని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నిలదీసిన వాళ్లపై.. ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేయిస్తూ లొంగిదీసుకుంటున్నారని మండిపడ్డారు.
సాక్షాత్త సుప్రీం కోర్టు న్యాయమూర్తులు మీడియా సమావేశం పెట్టి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వివరించారని గుర్తు చేశారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం, వాక్ స్వేచ్ఛ ప్రమాదంలో పడ్డాయని తెలిపారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి పార్లమెంట్లో ఎక్కువ మంది ఎంపీలను సస్పెండ్ చేసింది బీజేపీ ప్రభుత్వమని.. బిల్లుల మీద కనీసం చర్చ కూడా చేయలేదన్నారు. దేశాన్ని బనానా రిపబ్లిక్గా మార్చారన్నారు. మరొకసారి మోదీ ప్రధాని అయితే పాకిస్థాన్, రష్యా, నార్త్ కొరియా లాగా దేశం తయారవుతుందని వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉండదన్నారు. చైనా 2వేల కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమిస్తే మోదీ ప్రభుత్వం చేష్టలూడిగిందన్నారు. జాతీయ భద్రతపై మోదీ ప్రచారం ఎక్కువ పని తక్కువన్నారు.
ఎన్నికల హామీలను అమలు చేయలేదు
మోదీ ఇచ్చిన ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. మోదీ ప్రభుత్వం నల్లధనం తెస్తామని, ఎంఎస్పీకి చట్ట బద్దత కల్పిస్తామని చెప్పి చేయలేదన్నారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ స్కీం కింద ఒక్క ఇళ్లు కూడా కట్టలేదన్నారు. అగ్నివీర్ దేశ రక్షణకు మంచిది కాదని తెలిపారు. ప్రధాన మంత్రిగా మోదీ ఎన్నికల ప్రచారంలో అబద్ధాలతో దిగజారి మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. గతంలో ఏ ప్రధాని కూడా మోదీలా దిగిజారి మాట్లాడలేదని, ఆర్థిక విధానల్లో బీజేపీ పూర్తిగా విఫలమైందన్నారు. బీజేపీ పాలనలోదేశంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
70 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం 40 శాతానికి పెరిగిందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన బీజేపీ రైతుల ప్రయోజనాలకు విరుద్దంగా నల్ల చట్టాలు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఉద్యమిస్తే తప్పా వాటిని రద్దు చేయలేదన్నారు. కేంద్రంలో 30 లక్షల ఉద్యోగాలు ఉంటే భర్తీ చేయడం లేదని ఆరోపించారు. పదేళ్లలో ఏం చేశారో మోడీ చెప్పడం లేదని, మళ్లీ గెలిస్తే, ఏం చేస్తారో చెప్పడం లేదని మత రాజకీయాలతో విద్వేషపు ప్రసంగాలతో, అబద్ధాలతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.