రెండేళ్లలో నల్గొండ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి
నల్గొండ జిల్లా రైతాంగానికి సాగునీరు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి

– మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి
– నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష
విధాత: నల్గొండ జిల్లా రైతాంగానికి సాగునీరు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో శుక్రవారం ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షించారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను త్వరతగతిన పూర్తిచేసేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి ఇద్దరు మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వంలో నల్గొండ సాగునీటి ప్రాజెక్టులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. మెజారిటీ పనులు పూర్తయిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును కూడా నిర్లక్ష్యం చేసి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను స్వయంగా ఎన్నోసార్లు ఈ ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో మాట్లాడినా ఆనాటి ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నల్గొండ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో ఉందన్నారు. జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగునీటిపారుదల శాఖ మంత్రిగా ఉండటం జిల్లా ప్రజల అదృష్టమని ఆయన అన్నారు. సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఉదయసముద్రం బ్రహ్మణవెల్లముల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కెనాల్స్ తో పాటు, పెండింగ్ లో ఉన్న ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను యుద్ధప్రతిపాదికన చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్ఎల్బీసీ కాలువలు, వరద కాలువకు గత 10 సంవత్సరాల నుంచి మొయింటెనెన్స్ లేకపోవడంతో చెట్లు, పూడిక పెరిగింది.. వీటికి మరమ్మతులు చేపట్టాలని, బెడ్, సైడ్స్ లైనింగ్ పనులను ఈ సంవత్సరంలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఉదయ సముద్రం ప్రాజెక్టు క్రింద మొదటిదశలో 50 వేల ఎకరాలకు, రెండవ దశలో మరో 50 వేల ఎకరాలకు భూసేకరణ చేపట్టడం, కాలువలను తవ్వే పనులను పూర్తి చేసి లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉదయ సముద్రం మొదటి దశ భూసేకరణకు సుమారు 100 కోట్లు, పనులకు గాను మరో 100 కోట్లను త్వరితగతిన విడుదల చేస్తామని, అధికారులు అవిశ్రాంతంగా శ్రమించి యేడాదిలో మొదటి దశను పూర్తి చేసి 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని మంత్రిలిద్దరు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ సెక్రెటరీ రాహుల్ బొజ్జ, ఈఎన్ సీ మురళీధర్ రావు, ఛీఫ్ ఇంజనీరు అజయ్ కుమార్, డిప్యూటీ ఈఎన్ సీ జనరల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.