మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి, ఇప్పటి పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి పెద్ద తేడా లేదూ...అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే కాసింత ప్రచార పటోపాన్ని, హంగామాను బీజేపీ నాయకులు ప్రదర్శిస్తున్నారు
పది ఎంపీలు గెలుస్తామని ప్రకటన
ఎనిమిదిమంది ఎమ్మెల్యేలకే పరిమితం
ఐదు నెలల్లో అంత మార్పు జరిగిందా?
బీజేపీ ప్రకటనలపై సర్వతా విమర్శలు
పోలిటికల్ మైండ్ గేమ్ అంటున్న కాంగ్రెస్
విధాత ప్రత్యేక ప్రతినిధి: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి, ఇప్పటి పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి పెద్ద తేడా లేదూ…అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే కాసింత ప్రచార పటోపాన్ని, హంగామాను బీజేపీ నాయకులు ప్రదర్శిస్తున్నారు. మొన్న ఒక్కసారి మోదీ పేరెత్తితే ఇప్పుడు పదేపదే మోదీ భజనచేస్తున్నారు. గదే రాముడు…అదే హిందూ సెంటిమెంట్, గదే ముస్లీం రిజర్వేషన్ల రద్దు తప్ప నాయకులు కొత్తగా చెబుతుందేమీలేదు. పదేండ్లు అధికారంలో ఉండి ప్రజలకు చేసిందేమీ అనేది పక్కకు పోయి సెంటిమెంట్, రెచ్చగొట్టే అంశాలే పదేపదే ఎజెండా పైకి బీజేపీ నాయకులు తెస్తున్నారు.
అంత మాత్రాన పది ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలుస్తారా? అనే చర్చ సాగుతోంది. ఆ పార్టీ ముఖ్యనాయకులు ఇప్పుడు రాష్ట్రంలో పది స్థానాల్లో గెలుస్తామనే మాటలు వల్లెవేస్తున్నారు. ఆదివారం రాష్ట్ర ప్రచారంలో పాల్గొన్న హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో బీజేపీకి పది స్థానాలొస్తాయంటూ ప్రకటించారు. ఇదిలా ఉండగా ఇదంతా బీజేపీ పొలిటికల్ మైండ్ గేమ్ తప్ప మరొకటి కాదని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ సారి కేంద్రంలో బీజేపీ అధికారాన్ని కోల్పోతోందని ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్, కాంగ్రెస్ పై విమర్శలు
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆరెస్ ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పై బీజేపి నాయకులు విమర్శలు చేశారు. అప్పుడు డబులు ఇంజన్ సర్కారు అంటే ఇప్పుడు సింగిల్ ఇంజన్ 400 ఎంపీ సీట్లుఅంటున్నారు. అప్పటికీ ఇప్పటికీ ప్రచారానికి వచ్చే ముఖ్య నేతల ముఖాల్లో తేడాలేదు. అదే ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ తదితరులు పర్యటిస్తున్నారు. పైగా మొన్నటి ఎన్నికల్లో మాదిగల ఓట్లు పొందేందుందుకు మంద కృష్ణ మాదిగను రంగంలోకి దింపారు.అయినా పెద్దగా తేడా లేదు. బీజేపీ రాష్ట్ర ముఖ్యనేతలుగా గుర్తింపు పొందిన కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు హైదరాబాద్ లో కూర్చోని మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలో మరో నియోజకవర్గానికి ప్రచారానికి వెళ్ళిందీ లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడు మాట్లాడే మాటల్లోనూ చెప్పే విషయాలు…రేగ్గొట్టే సెంటిమెంటులోనూ పెద్దగా అంతరం కనిపించడంలేదూ. కాకుంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలు…నేడు పార్లమెంటు ఎన్నికలు. అంతమాత్రానా ఈ ఐదు నెలల్లో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అంతగా బీజేపీకి అనుకూలంగా మార్పు జరిగాయా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రకాల శక్తియుక్తులను వినియోగిస్తే ఎనిమిది అసెంబ్లీ స్థానాలు మాత్రామే దక్కాయి. ఇప్పుడు పదిమంది ఎంపీలుగా గెలుస్తారనడం అతిశయోక్తిగా అభివర్ణిస్తున్నారు.
ఐదునెలల్లో అంతమార్పు జరిగిందా?
మొన్నటికీ, ఇప్పటికే ఐదు నెలల కాలపరిమితిలో రాష్ట్రంలో అంత రాజకీయ మార్పు జరిగిందా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇంకా చెప్పాలంటే పదేళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు అమలు చేయలేదనే విమర్శలు బీజేపీపై ఉన్నాయి. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామనే వాగ్దానం, జనధన్ ఖాతాల్లో రూ.15లక్షల నిధులు తదితర అనేక హామీలు బీజేపీ అమలు చేయలేదనే విమర్శలు విపక్షాలు చేస్తున్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయని బీజేపీ ఇవేమీ పట్టించుకోకుండా ఆ పార్టీ గ్రాఫ్ పెరిగిందంటే ఏ విధంగా నమ్మాలనే అనే చర్చ సాగుతోంది.
ఈ ఐదునెలల్లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆరెస్ అధికారంలో ఉండి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. గత ఎన్నికల్లో బీఆరెస్, కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ మోదీ గొప్పతనాన్ని కీర్తిస్తూ ఓట్లడిగారు. రాష్ట్రంలో బీజేపీ సర్కారు వస్తుందనే నమ్మబలికారు. 40 సీట్లతో రాజ్యాధికారాన్ని చేజిక్కించుంటామంటూ ఆ పార్టీ ముఖ్యనేత బిఎల్ సంతోష్ కుమార్ జోస్యం చెప్పి చర్చను వేడెక్కించారు. కానీ,ఎన్నికల్లో జరిగిందేమిటీ 40 స్థానాల బదులు బీజేపీకి నాలుగుకు రెట్టింపు సీట్లు జనం కట్టబెట్టారు.
అదీ కూడా రెండు మూడు జిల్లాలకు మాత్రమే ఈ ఫలితాల ప్రభావం కన్పిస్తోంది. బీజేపీకి ఎనమిది సీట్లతో చావుతప్పి కన్నులొట్టబోయిన రిజల్టు కళ్ళముందే కనిపిస్తోందీ. మొన్నటి ఎన్నికల్లోనూ ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా, రాజ్ నాథ్ సింగ్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యనేతలు, కేంద్రమంత్రులు, పార్టీ నాయకులు ఒక్కటేమిటీ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ప్రచారాన్ని కొనసాగించినా అత్తెసరు మార్పులతో 8 మంది ఉత్తీర్ణత సాధించారు. అట్లాంటిది ఇప్పుడు పది ఎంపీ స్థానాలెలా? వస్తాయంటూ ప్రశ్నలుతలెత్తుతున్నాయి.
ఓడిన బీజేపీ నేతలే మళ్ళీ పోటీ
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీలుగా ఉంటూ బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయంబాపురావు ఎమ్మెల్యేలుగా పోటీచేసి ఓటమిపాలైన వారిలో సోయం బాపురావు మినహా మరోసారి ఎంపీ అభ్యర్ధులుగా బరిలో నిలిచారు. ఎమ్మెల్యేలుగా ఉంటూ పోటీచేసిన ఈటల రాజేందర్, రఘునందన్ రావులు ఓటమిపాలయ్యారు. వీరు మరోసారి ఎంపీగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎమ్మెల్యేలుగా ఓడిన వారిని పెద్దగా ఆదరించకపోవచ్చంటున్నారు. ఇదిలా ఉండగా బీఆరెస్ లో ఎంపీలుగా ఉన్న బీబీపాటిల్, రాములు కుమారుడు భరత్ తో పాటు బీఆరెస్ కు చెందిన సీతారాంనాయక్, అరూరి రమేష్ , నగేష్ బీజేపీలో చేరి ఎంపీలుగా పోటీచేస్తున్నారు.
అరూరి రమేష్ కూడా మొన్న ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. గతంలో సిట్గింగ్ ఎంపీగా ఉన్న సీతారాం నాయక్ కు బీఆరెస్ టికెట్ నిరాకరించింది. ఇప్పుడు బీజేపీ ఆయనకు టికెట్ ఇచ్చింది. ఈ మార్పులు చేర్పులు, అద్దెకు తెచ్చుకున్న అభ్యర్ధులు తప్ప ఈ మధ్యకాలంలో తన వ్యూహాలతో బీజేపీ స్వంతంగా బలపడిందేమీలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ స్థితిలో రాష్ట్రంలో బీజేపికి ఆదరణ లభిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
బీఆరెస్ ఓట్లకు గండిపడుతుందా?
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆరెస్ నుంచి సహజంగానే నాయకుల, కార్యకర్తల వలసలు జరిగాయి. క్షేత్రస్థాయిలో కేడర్ మెజార్టీ కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు కాంగ్రెస్ లో చేరారు. అదే విధంగా అక్కడక్కడ బీజేపీ వైపు కూడా కొందరు మొగ్గుచూపారు. దీనికి తోడు బీఆరెస్ కంటే బీజేపీ నిర్మాణాత్మకంగా బలం పెరిగిందనే పరిస్థితేమీ లేదు. దీనికి తోడు బీఆరెస్ ఓటమి నుంచి పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ, మారిన పరిస్థితుల్లో బీఆరెస్ బీజేపీకి సహకరిస్తుందా? బీజేపీతో బీఆరెస్ చీకటి ఒప్పందం చేసుకుందనే విమర్శలున్నాయి. కేసీఆర్ తన బిడ్డ కల్వకుంట కవిత జైలు నుంచి బెయిలు పొందాలన్నా, అక్రమ కేసుల నుంచి రక్షణ పొందాలన్నా, రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడిల నుంచి తట్టుకునేందుకు కేంద్రంలోని బీజేపీ సహకారం తీసుకుంటుందనే ఆరోపణలున్నాయి.
ఈ కారణంగా ఎంపీ అభ్యర్ధుల ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య లోపాయకారి ఒప్పందం ఉందంటున్నారు. స్ధానికంగా బలాబలాలను బట్టి అంతర్గతంగా సీట్ల పంపకం చేసుకుని దానికి తగిన విధంగా అభ్యర్ధుల ఎంపీక, ప్రచారం తదితర వాటిని చేపడుతున్నారని కాంగ్రెస్ ను ఓడించడమే లక్ష్యంగా ఈ ప్రణాళికను అమలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ వ్యూహం ఎన్నికల్లో బీజేపీకి అనుకూల ఫలితాలిస్తాయా? అనే చర్చ సాగుతోంది. అనూహ్య పరిణామం జరిగితే తప్ప బీజేపీ చెబుతున్నట్లు రాష్ట్రంలో 10 స్థానాలు లభించే అవకాశం లేదంటున్నారు.