విధాత: తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపుదల అంశాలపై వచ్చే మంత్రిమండలి సమావేశంలో చర్చించి, తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సమగ్ర ప్రతిపాదనలను రూపొందించాలని రవాణా, విద్యుత్ శాఖ మంత్రులు, అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రగతిభవన్లో ఆయన ఆర్టీసీ, విద్యుత్ శాఖలపై సమీక్షించారు. మంత్రులు కేటీ రామారావు, పువ్వాడ అజయ్కుమార్, జగదీశ్రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సీఎస్ సోమేశ్కుమార్, రవాణా, ఆర్థిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్శర్మ, రామకృష్ణారావు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, […]
విధాత: తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపుదల అంశాలపై వచ్చే మంత్రిమండలి సమావేశంలో చర్చించి, తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సమగ్ర ప్రతిపాదనలను రూపొందించాలని రవాణా, విద్యుత్ శాఖ మంత్రులు, అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రగతిభవన్లో ఆయన ఆర్టీసీ, విద్యుత్ శాఖలపై సమీక్షించారు. మంత్రులు కేటీ రామారావు, పువ్వాడ అజయ్కుమార్, జగదీశ్రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సీఎస్ సోమేశ్కుమార్, రవాణా, ఆర్థిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్శర్మ, రామకృష్ణారావు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛార్జీల పెంపుదలపై చర్చించారు. ఆర్టీసీని పటిష్ఠపరిచేందుకు రెండేళ్ల క్రితం చర్యలు చేపట్టామని, గాడిలో పడుతోందనుకుంటున్న నేపథ్యంలో కరోనా, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా తిరిగి నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమని సీఎం అన్నారు.
గడ్డు పరిస్థితిలో ఆర్టీసీ..
ఆర్టీసీ ఛార్జీలను పెంచాల్సిందేనని మంత్రులు అజయ్కుమార్, జగదీశ్రెడ్డి, ఉన్నతాధికారులు సజ్జనార్, ప్రభాకర్రావు అన్నారు. ‘కరోనా సంక్షోభంతోపాటు డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీ పరిస్థితి దిగజారిందని తెలిపారు. గత ఏడాదిన్నర కాలంలో డీజిల్ ధర లీటరుకు భారీగా పెరగడం వల్ల రూ. 550 కోట్ల మేర, టైర్లు, ట్యూబులు వంటి విడిభాగాల ధరల వల్ల మరో రూ.50 కోట్ల మేర కలిసి సాలీనా రూ.600 కోట్ల భారం పడుతోంది. లాక్డౌన్ల వల్ల రూ. 3000 కోట్ల మేరకు నష్టపోయింది. హైదరాబాద్ పరిధిలోనే నెలకు రూ. 90 కోట్ల వరకు నష్టం వస్తోంది. ఈ కష్టకాలంలో ఛార్జీలు పెంచక తప్పదు. 2020 మార్చిలోనే ఛార్జీలను పెంచుతామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. కానీ, కరోనా కారణంగా పెంచలేదు. ఇప్పటికే ఉద్యోగుల సంక్షేమానికి, ఆర్టీసీని పటిష్ఠపరిచేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వంపై ఇంకా మీద భారం మోపమనడానికి మాకు మాటలు రావడంలేదు. ఛార్జీలు పెంచుకోవడానికి అనుమతిస్తే తప్ప మనుగడ సాధ్యం కాదు’ అని అజయ్కుమార్, సజ్జనార్ తెలిపారు.
బస్సు ఛార్జీలు 10 నుంచి 20 శాతం పెంపు?
ఆర్టీసీ ప్రయాణికులపై త్వరలో ఛార్జీల పెంపు భారం పడనుంది. చివరిసారిగా 2019 డిసెంబరులో ప్రభుత్వం ఛార్జీలను సవరించింది. కనీస ఛార్జీని రూ. 5 నుంచి రూ. 10కి చేరుస్తూ మొత్తంగా ఛార్జీలను 20 శాతం వరకు పెంచింది. దాంతో రోజువారీ ఆదాయం రూ. 4 కోట్ల మేరకు పెరిగింది. అంతలోనే కరోనా కారణంగా 2020 మార్చిలో లాక్డౌన్ ప్రారంభం కావటంతో బస్సులు మూలకు చేరాయి. మహమ్మారి తగ్గుముఖం పట్టటంతో ఇప్పుడిప్పుడే ఆదాయం కొద్దికొద్దిగా పుంజుకుంటోంది. కొద్దిరోజుల కిందటే రోజువారీ ఆదాయం రూ. 13 కోట్లు దాటింది. అయినా డీజిల్, విడిభాగాల ధరల పెరుగుదల కారణంగా ఈసారి కనీసం 10 నుంచి 20 శాతం మేరకు ఛార్జీలు పెంచాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. 20 శాతం పెంచితే రోజువారీ ఆదాయం రూ. 6 నుంచి రూ. 7 కోట్ల వరకు పెరుగుతుందని అంచనా. ఏడాదిలో కనీసం 175 రోజుల పాటు ఆ మేరకు ఆదాయం వస్తే రూ. వెయ్యి కోట్ల వరకు అదనపు ఆదాయం లభిస్తుందని భావిస్తున్నారు.