లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతే ముఖ్యమంత్రి కుర్చీ కదులుతుందని భయంతోనే బీజేపీపై సీఎం రేవంత్రెడ్డి దుష్ప్రచారానికి దిగారని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి మండిపడ్డారు
కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి ఫైర్
విధాత : లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతే ముఖ్యమంత్రి కుర్చీ కదులుతుందని భయంతోనే బీజేపీపై సీఎం రేవంత్రెడ్డి దుష్ప్రచారానికి దిగారని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి మండిపడ్డారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో తన ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబర్పేట లో ఏర్పాటు చేసిన గౌడ కులస్థుల ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్తో కలిసి కిషన్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. బీజేపీ ఎజెండా ఎంటో మేము చెప్పాలి కానీ కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నారన్నారన్నారు. రిజర్వేషన్స్ ను రద్దు చేస్తున్నామని కాంగ్రెస్ అబద్దపు ప్రచారం చేస్తుందని.. బీజేపీ, బీఆరెస్ ఒక్కటే అని గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్రెడ్డి ప్రచారం చేశారన్నారు. బీజేపీ, బీఆరెస్ ఒక్కటే అనడానికి ఒక్క సాక్షం చూపించలేదన్నారు. కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న రిజర్వేషన్స్ రద్దు అనేది ఈ దశాబ్దంలోనే పెద్ద అబద్ధం అని కిషన్ రెడ్డి చెప్పారు. మైనార్టీల రిజర్వేషన్ల పేరుతో తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్ కు రాష్ట్ర ప్రభుత్వం గండి కొడుతుందని కిషన్ రెడ్డి ఆరోపించారు.
ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా ప్రకటిస్తే.. అడ్డుకోవడానికి కాంగ్రసె్ ప్రయత్నించిందని, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధాని చేసిన ఘనత బీజేపీదని తెలిపారు. బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన అధికారాలు కల్పించి.. బీసీలకు గౌరవం పెంచామని తెలిపారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ మ్యానిఫెస్టోలో లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలన పట్ల కోపంతో ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారన్నారు. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి పట్టం కట్టాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని చెప్పారు. కేంద్రంలో మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండలేకపోతుందని ఆరోపించారు. మేము మా కుటుంబం మాత్రమే దేశాన్ని పరిపాలించాలి అనే దుర్మార్గపు ఆలోచనతో సోనియా గాంధీ కుటుంబం వ్యవహరిస్తుందన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్రను ప్రజలు పట్టించుకోలేదని, రాహుల్ గాంధీ చేసింది భారత్ జోడో యాత్ర కాదు చోడో యాత్ర అని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ యాత్ర చేసిన దగ్గర కాంగ్రెస్ నాయకులు పార్టీని వదిలి వెళ్తున్నారని తెలిపారు.