తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే ఆరుగురి పేర్లను బీజేపీ ప్రకటించింది.
విధాత : లోక్సభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. లోక్సభ ఎన్నికల సన్నాహాలు, అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీలో జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ముందుగా తెలంగాణలోని 6 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసిందని సమాచారం. సిటింగ్లలో ముగ్గురికి మాత్రమే తిరిగి అవకాశం కల్పించింది. సికింద్రాబాద్ అభ్యర్థిగా మరోసారి జీ కిషన్ రెడ్డిని, కరీంనగర్ అభ్యర్థిగా బండి సంజయ్ని, నిజామాబాద్ అభ్యర్థిగా అర్వింద్కు మరోసారి టికెట్ కేటాయించింది. చేవెళ్ల టికెట్ను కొండా విశ్వేశ్వర్ రెడ్డికి, ఖమ్మం టికెట్ను డాక్టర్ వెంకటేశ్వరరావుకు, భువనగిరి టికెట్ను డాక్టర్ బూర నర్సయ్య గౌడ్కు కేటాయించింది.
ఈ మేరకు జాతీయ స్థాయిలో విడుదల చేసే తొలి జాబితాలో వీరు పేర్లు ఉంటాయని తెలిపింది. అయితే అదిలాబాద్ సిటింగ్ ఎంపీ సోయం బాపూరావు టికెట్ విషయమై స్పష్టత రాలేదు. 17స్థానాలలో ప్రస్తుతం 6 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించినందున తదుపరి జాబితాలో బాపూరావుకు అవకాశమిస్తారా లేక మరెవరికైనా అవకాశం కల్పిస్తారా? అన్నది తెలియాల్సివుంది. ఇక గట్టి పోటీ నెలకొన్న మల్కాజిగిరి, మహబూబ్నగర్ స్థానాల అభ్యర్థుల ఎంపికపై కూడా బోర్డులో చర్చ జరిగింది. మల్కాజిగిరి లేక మెదక్ టికెట్ ఆశిస్తున్న ఈటల రాజేందర్, పార్టీ సీనియర్ నేత మురళీధర్రావు సైతం బోర్డు సమావేశాలకు, అమిత్షాతో జరిగిన చర్చలకు హాజరయ్యారు. ఇక మహబూబ్నగర్ స్థానానికి డీకే అరుణ, జితేందర్రెడ్డి మధ్య గట్టి పోటీ నెలకొంది.
కేంద్రంలో మరోసారి ప్రధాని మోదీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్నదని, దీనితో తెలంగాణ నుంచి ఎంపీగా గెలిస్తే తమకు మంత్రి పదవులకు అవకాశం ఉంటుందన్న ఆశతో సీనియర్లు ఎంపీ టికెట్ల కోసం పట్టుబడుతున్నారు. రెండు మూడు రోజుల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు మరోసారి భేటీయై తొలి జాబితాను ఖరారు చేస్తుందని, అందులో తెలంగాణలోని మిగతా ఎంపీ స్థానాల అభ్యర్థులను కూడా ప్రకటించవచ్చని భావిస్తున్నారు.