Holi Festival | హోలీ పండుగను జరుపుకోవడం అనాది నుంచి ఆనవాయితీగా వస్తున్నది. ప్రతియేటా ఫాల్గుణ పౌర్ణమి హోలీ వేడుకలను జరుపుకుంటారని లింగపురాణం చెబుతున్నది. హోలీ పండుగను కేవలం భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే సంప్రదాయం ఉన్నది. ప్రకృతిలో వ్యక్తమయ్యే నవచైతన్యానికి ప్రతీకగా వేడుకలను జరుపుకుంటారు. ముఖ్యంగా హోలీతో ముడిపడిన ప్రధాన గాథ కామదహనం. తన తపస్సును భగ్నం చేసిన మన్మథుడిని పరమేశ్వరుడు మూడోకన్ను తెరచి భస్మం చేసింది ఫాల్గుణ పౌర్ణమినాడేనని శివమహా పురాణం చెబుతున్నది.
హోలీ సంబరాలు దేశంలోని ఝాన్సీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎరిచ్ సిటీలో తొలుత ప్రారంభమైనట్లు చెబుతారు. హోలీని ఇక్కడ ఫాగ్ అని పిలుస్తారు. ఈ నగరంలో ఓ పురాతన నారసింహ దేవాలయం ఉంది. ఇక్కడ పురాతన రాజభవనాలు, పురాతన భవనాలు ఎన్నో ఉన్నాయి. వీటిని హిరణ్యకశ్యపుడి రాజభవనంగా స్థానికులు చెబుతుంటారు. హిరణ్యకశ్యపుడి కాలంలో ఎర్చ్ రాజధానిగా ఉండేది. ఈ రాజభవనం సమీపంలో అగ్ని సైతం దహించలేని హిరణ్యకశ్యపుడి సోదరి హోలిక తన ఒడిలో విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడితో కలిసి అగ్నిలో కూర్చుని ఆహుతైనట్లు స్థానికులు చెబుతారు. ప్రహ్లాదుడి స్పర్శతో ఆమె ఆగ్నికి ఆహుతైన తర్వాత ప్రహ్లాదుడు అగ్ని నుంచి క్షేమంగా బయటికి వచినట్లు పురాణాలు చెబుతున్నాయి. అలా హోలిక దహనమైన ఫాల్గుణ పౌర్ణమినే ప్రహ్లాద పౌర్ణమిగా పిలుస్తారు. ఇక్కడి పురాతన ఆలయాలను చూసేందుకు ఏటా లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి తరలివస్తుంటారు. నేటికీ ఇక్కడ హోలీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.
పురావస్తు తవ్వకాల్లో లభించిన ఆధారాల ఆధారంగా.. ఎరిచ్ ఓ చారిత్రక నగరం. పట్టణానికి సమీపంలో బెత్వా నది ఒడ్డున ఉన్న డికోలి గ్రామం చారిత్రాత్మక దేకంచల్ పర్వతం ఒడ్డున ఉన్న గ్రామంగా చెబుతారు. భక్తుడు ప్రహ్లాదుడిని ఆదేశాల మేరకు భటులు ఇక్కడి దేకాంచల్ పర్వతం నుంచి నదిలోకి విసిరినట్లు నమ్ముతారు. భక్తుడు ప్రహ్లాదుడి విసిరిన ప్రదేశాన్ని ప్రస్తుతం ప్రహ్లాద్ కుండ్గా పిలుస్తారు. పురావస్తు పరిశోధనల్లో అనేక సాక్ష్యాలు కనుగొన్నారు. ఇక్కడ ఒకప్పుడు అభివృద్ధి చెందిన నాగరికత విలసిల్లినట్లు చారిత్రక ఆధారాలు బయటపడ్డాయి. హిరణ్యకశ్యపుడి రాజధానిగా పరిగణించబడే ఈ ప్రదేశంలో అనేక అవశేషాలు గుర్తించారు. ఝాన్సీ జిల్లాలోని ఈ ఎరుచ్ పట్టణం నుంచి హోలీ పండుగ ప్రారంభమైందని ప్రజలు విశ్వసిస్తారు. ఎరిచ్ పట్టణం జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. 3500 సంవత్సరాల కిందట ఎరిచ్ ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్నట్లు విశ్రాంత ప్రాంతీయ పురావస్తు అధికారి డాక్టర్ సురేష్ కుమార్ దూబే తెలిపారు. ఝాన్సీ జిల్లా ఎరుచ్ పట్టణంలో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో లభించిన ఆధారాల ప్రకారం సుమారు 3200 సంవత్సరాల కాలం నాటి కొంతమంది రాజుల పేర్లు కూడా దొరికాయి. ఇక్కడ లభించిన ఓడరేవు ఆధారాలను బట్టి ఇక్కడ పెద్ద వాణిజ్య కేంద్రం ఉండేదని భావిస్తారు. గ్రంధాల ఆధారంగా ఎరుచ్ హిరణ్యకశ్యపుడి రాజధానిగా పేర్కొన్నారు.
హిమాలయాల కంటే బుందేల్ఖండ్ చరిత్ర పురాతనమైనదని చారిత్రక నిపుణులు ముకుంద్ మెహ్రోత్రా తెలిపారు. గ్రంధాల ప్రకారం.. భక్త ప్రహ్లాదుడి అగ్నిలో కాల్చే ప్రయత్నం.. హిరణ్యకశ్యపుడి చంపడం, విష్ణువు నరసింహ అవతారమనే నమ్మకం. బుందేల్ఖండ్ నుంచి దక్షిణ భారతదేశానికి వలస వచ్చిన ప్రజలు నారసింహ భగవానుడి ఆలయాలను నిర్మించడంతో ఈ నమ్మకం మరింత బలపడింది. హిరణ్యకశ్యపుడి చంపిన తర్వాత ఇక్కడ దేవతలు, రాక్షసులకు పంచాయితీ జరిగిందని.. ఇందులో రెండు పార్టీలు ఒకరికొకరు రంగులు వేసుకోవడం ద్వారా శత్రుత్వాన్ని అంతం చేయాలనే సందేశాన్ని ఇచ్చారని.. అలా అప్పటి నుంచి హోలీ వేడుకలు మొదలయ్యాయిని చెబుతున్నారు.
ఏటా హోలీ వేడుకలు ఎరిచ్ పట్టణంలో ఐదురోజుల పాటు జరుగుతుంటాయి. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భక్త ప్రహ్లాద్ జన్ కల్యాణ్ సంస్థాన్తో కలిసి నిర్వహించే హోలీ మహోత్సవ్కు ప్రభుత్వం రూ.10లక్షలు అందిస్తుంది. ఈ ఏడాది ఇక్కడ 21న భక్త ప్లహ్లాదుడి ఊరేగింపుతో ఉత్సవాలు మొదలయ్యాయి. 22న బేబీ ఇమ్రాన్ బృందంచే బుందేలి రాయ్ నృత్యం, రాత్రి కవి సమ్మేళనం, 23న రంగోలీ పోటీలు, రాత్రి సితార్ వాద్యకారుడు సర్జూ శరణ్ పాఠక్చే శాస్త్రీయ సంగీతం, భజనల ప్రదర్శన జరిగాయి. 24న జానపద గేయాలు, ఆలాపన ఉంటాయి. సంజో బాఘేల్చే అల్హా భజన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయగా.. 25న రాత్రి అఖిలేష్ అలఖ్, రాధికా ప్రజాపతిచే జానపద పాటలు, రాయ్ నృత్యంతో భక్త ప్రహ్లాద్ నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు.