తెలంగాణలో మెజార్టీ ఎంపీ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఇండియా టుడే సీ ఓటర్ సర్వే అభిప్రాయపడింది.
విధాత : తెలంగాణలో మెజార్టీ ఎంపీ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఇండియా టుడే సీ ఓటర్ సర్వే అభిప్రాయపడింది. తాజాగా ఇండియా టుడే తెలంగాణలో ఎంపీ ఎన్నికలపై నిర్వహించిన సర్వే ఫలితాలను వెల్లడించింది. సర్వే మేరకు తెలంగాణలో 17ఎంపీ సీట్లలో కాంగ్రెస్ 10, బీజేపీ 3, బీఆరెస్ 3, ఎంఐఎం 1 స్థానం గెలుచుకుంటాయని తెలిపింది. రాష్ట్రంలో అధికార పార్టీగా అసెంబ్లీ ఎన్నికల తరహాలోనూ పార్లమెంటు ఎన్నికల్లోనూ తన ఆధిక్యతను నిలబెట్టుకుంటుందని సర్వే పేర్కోంది. ఓటు షేర్ విషయానికి వస్తే కాంగ్రెస్ 41 శాతం, బీఆరెస్ 29 శాతం, బీజేపీ 21 శాతం, ఎంఐఎం 3శాతం, ఇతరులు 6 శాతం దక్కించుకుంటాయని స్పష్టం చేసింది.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాలు గెలుచుకోగా ఈ దఫా ఆ పార్టీ ఒక స్థానం కోల్పోయి 3 స్థానాలకే పరిమతమవ్వనుందని సర్వే తెలిపింది. ఇక గత ఎన్నికల్లో 3 ఎంపీ స్థానాల్లో నెగ్గిన కాంగ్రెస్ ఈ దఫా ఏకంగా 7 స్థానాలు మెరుగుపరుచుకుని 10 స్థానాలు గెలవబోతుందని పేర్కొన్నది. గత ఎంపీ ఎన్నికల్లో 9 స్థానాలను గెలుచుకున్న బీఆరెస్ ఈ దఫా 6 స్థానాలు కోల్పోయి 3 స్థానాలకు పరిమితం అవుతుందని సర్వే అభిప్రాయపడింది.