విధాత: మన ఆలోచనలే మన కళ్లు. మనం ఎలా ఆలోచిస్తే మన కళ్లు అలా చూస్తాయి. మన ఆలోచనలు మంచివైతే మన కళ్లకి అన్నీ మంచిగానే కనిపిస్తాయి. అలాగే మన ఆలోచనలు చెడ్డవైతే మనకు అన్నీ చెడ్డగానే కనిపిస్తాయి. అవే మన మనో నేత్రాలు. అందుకే ఎప్పడూ మంచిగానే ఆలోచించాలి. అన్నింటి లోనూ మంచినే చూడాలి. అద్దం ముందు నిలబడితే మనం ఎలా ఉన్నామో అలాగే చూపిస్తుంది. అలాగే ఒక విషయంపై మన ఆలోచనలు ఎలా ఉంటాయో […]
విధాత: మన ఆలోచనలే మన కళ్లు. మనం ఎలా ఆలోచిస్తే మన కళ్లు అలా చూస్తాయి. మన ఆలోచనలు మంచివైతే మన కళ్లకి అన్నీ మంచిగానే కనిపిస్తాయి. అలాగే మన ఆలోచనలు చెడ్డవైతే మనకు అన్నీ చెడ్డగానే కనిపిస్తాయి. అవే మన మనో నేత్రాలు. అందుకే ఎప్పడూ మంచిగానే ఆలోచించాలి. అన్నింటి లోనూ మంచినే చూడాలి. అద్దం ముందు నిలబడితే మనం ఎలా ఉన్నామో అలాగే చూపిస్తుంది. అలాగే ఒక విషయంపై మన ఆలోచనలు ఎలా ఉంటాయో అలాగే మన కళ్లకు కనిపిస్తుంది. అది ఎలాగో కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
చూసేది ఒకటే.. కానీ చూపు వేరు ఒక పాదచారి నడుచు కుంటూ వెళ్తున్నాడు. అదే దారిలో రోడ్డు పక్కన ఒక వ్యక్తి అచేతనంగా పడి ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన అతను పీకల దాకా తాగి పడిపోయాడని అనుకుంటూ వెళ్లిపోయాడు. అదే దారిలో వెళ్తున్న మరో వ్యక్తి ఆ వ్యక్తిని చూసి అయ్యో పాపం అని చల్లని నీళ్లు తెచ్చి ఆ వ్యక్తి ముఖం మీద చల్లాడు. వెంటనే అతను తేరుకొని ధన్యవాదాలు తెలిపి వెళ్లిపోయాడు. మొదటి వ్యక్తి ఆలోచన ప్రకారం అతను తాగుబోతుగా కనిపించాడు. రెండో వ్యక్తి ఆలోచనా విధానం మరోలా ఉండడంతో ఆపదలో ఉన్నట్టు గ్రహించి సాయం చేశాడు. ఈ సంఘటన మన ఆలోచననే మన కళ్లు చూస్తాయని అనిపిస్తోందా.. లేదా!
మచ్చలు అవే.. అర్థాలు మరోలా..
ఇద్దరు వ్యక్తులు చంద్రునిపై ఉన్న మచ్చలను చూస్తున్నారు. అందులో ఒకతను అన్నాడు. ఆహా ఆ మచ్చలను చూడండి అచ్చం దేవాలయ గోపుర శిఖరాల్లా ఎంత అందంగా ఉన్నాయో అని. దానికి రెండో అతను అబ్బే అదేం కాదు ఇద్దరు ప్రేమికులు ఒకరినొకరు ముద్దాడుకుంటున్నట్టు ఉన్నాయన్నాడు. మొదటి వ్యక్తి ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే రెండో అతను కామంగా చూశాడు. అవే మచ్చలు కానీ చూసే దృక్కోణం వేరు. మన మనసు ఎలా ఉంటే మన పరిసరాలు కూడా అలాగే కనిపిస్తాయని అర్థమైంది కదా. మనం సంతోషంగా ఉంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా ఆనందమయంగా కనిపిస్తుంది. అదే మనం విచారంగా, బాధగా ఉంటే మన పరిసరాలు కూడా దుఃఖమయంగా కనిపిస్తాయి. అవునా.. కాదా.. ఆలోచించండి.
రామాయణంలోని అంతరార్థం
అలాగే రామాయణాన్నిఒక కథగా భావిస్తే కథలాగే కనపడుతుంది. అలా కాకుండా ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే రామాయణంలోని అంతరార్థం బోధ పడుతుంది. అదెలాగో తెలుసుకుందాం. శ్రీరాముడు పరమాత్మ. సీతమ్మ జీవాత్మ. ప్రతి మానవుని దేహం లంకా నగరం. ఈ లంకా ద్వీపమనే దేహంలో బంధింపబడిన సీత అనే జీవాత్మ శ్రీరాముడనే పరమాత్మను చేరుకోవాలని తహతహలాడుతుంది. కానీ రాక్షసులు అది జరగనీయరు.
రాక్షసులు అంటే ఎవరో కాదు మానవుడిలో ఉన్న రజో, తమో గుణాలు. ఈ రజో, తమో గుణాలు సీత అనే జీవాత్మను శ్రీరాముడనే పరమాత్మను కలవనీయకుండా దేహమనే లంకలో బంధించి ఉంచుతాయి. అలా బంధింపబడి, ఎలాగైనా శ్రీరాముడిని చేరుకోవాలనే కోరికతో ఉన్నసీత దగ్గరకు హనుమంతుడనే గురువు వస్తాడు. శ్రీరాముని అంగుళీయకం ఆమెకు చూపిస్తాడు. సకల భ్రాంతులను రూపుమాపే బ్రహ్మ జ్ఞానమే ఆ అంగుళీయకం.
ఈ విధంగా శ్రీరాముడిని చేరడానికి సీతకు మార్గం ఏర్పడుతుంది. అంటే గురువు వల్ల పొందే బ్రహ్మ జ్ఞానమే జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావడానికి మార్గదర్శనం చేస్తుంది. అలా మానవులందరిలో ఉన్నది ఒకే జీవాత్మ. ఆ విషయాన్ని గ్రహించి మన చుట్టూ ఉన్న మనుషులు, జీవరాశులపై ప్రేమ, దయ, జాలితో కూడిన ఆలోచనలు చేస్తే మన కళ్లు కూడా ప్రేమ పూర్వకంగా చూస్తాయి. ఆ ప్రేమ పూరితమైన ఆలోచనలతో జీవితాన్నిసజావుగా, సంతోషంగా గడిపేయచ్చు. ఏమంటారు..