కొన్ని లోక్సభ నియోజకవర్గాలకు కొన్ని కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అలాంటివాటిలో అమేథీ ఒకటి. ఉత్తరప్రదేశ్లోని అమేథీ లోక్సభ నియోజకవర్గం గాంధీ-నెహ్రూ కుటుంబానికి గత ఎన్నికల వరకూ పెట్టని కోటగా భాసిల్లుతూ వచ్చింది.
కొన్ని లోక్సభ నియోజకవర్గాలకు కొన్ని కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అలాంటివాటిలో అమేథీ ఒకటి. ఉత్తరప్రదేశ్లోని అమేథీ లోక్సభ నియోజకవర్గం గాంధీ-నెహ్రూ కుటుంబానికి గత ఎన్నికల వరకూ పెట్టని కోటగా భాసిల్లుతూ వచ్చింది. ఆ కుటుంబంలో పెద్ద చీలికకు కూడా ఇదే నియోజకవర్గం కారణమైంది. 1967, 1971 ఎన్నికల్లో కాంగ్రెస్కు చెందిన విద్యాధర్ బాజ్పాయి ఇక్కడ గెలిచారు.
1977లో జనతా పార్టీ అభ్యర్థి రవీంద్ర ప్రతాప్సింగ్ విజయం సాధించగా.. 1980లో ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్గాంధీ గెలిచాడు. ఆయన మరణానంతరం రాజీవ్గాంధీ అమేథీకి ప్రాతినిథ్యం వహించారు. రాజీవ్గాంధీ నాలుగు దఫాలు, రాజీవ్ సన్నిహితుడు సతీశ్ శర్మ ఒకసారి, సోనియాగాంధీ ఒకసారి, రాహుల్గాంధీ మూడు పర్యాయాలు అక్కడ గెలిచారు. 2019లో బీజేపీ ఈ సీటును దక్కించుకునే వరకూ ఈ నియోజకవర్గం గాంధీ-నెహ్రూ కుటుంబానికి పెట్టని కోట.
సంజయ్ మరణానంతరం చిచ్చు
కానీ.. సంజయ్గాంధీ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలు.. ఆ కటుంబంలో రాజకీయ చిచ్చు పెట్టాయి. సంజయ్గాంధీ సన్నిహితుడు అక్బర్ అహ్మద్ లక్నోలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంజయ్గాంధీ భార్య మనేకా గాంధీ హాజరయ్యారు. ఆమెను క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు. ఈ కార్యక్రమానికి మనేకా హాజరుకావడం అత్త ఇందిరాగాంధీకి కోపం తెప్పిందంటారు. సంజయ్గాంధీ లోటును భర్తీ చేయడానికి తన పెద్ద కుమారుడు రాజీవ్గాంధీని రంగంలోకి దింపాలనుకుంటున్న వేళ ఉన్నట్టుండి మనేకా గాంధీ ప్రవేశించడాన్ని ఆమె సహించలేక పోయారని రాజకీయ పరిశీలకులు గుర్తు చేసుకుంటున్నారు. 1980లో సంజయ్గాంధీ మరణం తర్వాత జరిగి ఉప ఎన్నికలో రాజీవ్గాంధీ గెలిచి.. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
సంజయ్గాంధీ వారసత్వాన్ని చేపట్టాలనుకున్న మనేకా
అయితే.. గాంధీ-నెహ్రూ కుటుంబంలో తన భర్త రాజకీయ వారసత్వాన్ని చేపట్టాలని మనేకాగాంధీ.. భావించడంతో చోటు చేసుకున్న అవాంఛనీయ పరిణామాలు, కుటుంబ కలహాలు అప్పట్లో జాతీయ స్థాయిలో పతాక శీర్షికలయ్యాయి. ఇందిరాగాంధీ వారసుడు సంజయ్గాంధీయే అన్న విషయంలో అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలో మరో అభిప్రాయం లేదు. ఒకవైపు పెద్ద కొడుకు రాజీవ్గాంధీ ఇండియన్ ఎయిర్లైన్స్లో పైలట్గా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటే.. సంజయ్గాంధీ తల్లికి రాజకీయ వ్యవహారాల్లో కుడిభుజంగా మెలిగారు. కానీ.. సంజయ్గాంధీ ఆకస్మిక మరణానంతరం తన రాజకీయ వారసుడిగా రాజీవ్గాంధీని ఇందిర ఎంచుకున్నారు. ఆయన కూడా అందుకు అంగీకరించారు.
అప్పటికి 25 ఏళ్ల వయసులో ఉన్న మనేకాగాంధీ తన తోటికోడలు సోనియాగాంధీ తరహా కాదు. సోనియా తన అత్తగారికి విధేయంగా ఉంటూ, అమెకు ఇష్టురాలిగా ఉండేవారు. కానీ మనేకాగాంధీ దూకుడుగా ఉండేవారు. 1970వ దశకంలో తన భర్త సంజయ్గాంధీతో కలిసి రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. తన భర్త మరణానంతరం అమేథీ నుంచి రాజీవ్గాంధీ పోటీ చేయకుండా మనేకాగాంధీ తీవ్రంగా ప్రయత్నించారని ‘24 అక్బర్ రోడ్: కాంగ్రెస్ ఉత్థాన పతనాల వెనుక ఉన్న వ్యక్తుల సంక్షిప్త చరిత్ర’ అనే పుస్తకంలో రాజకీయ విశ్లేషకుడు రషీద్ కిద్వాయి రాశారు.
ఇంటి నుంచి వెళ్లిపోయిన మనేకా
ఎన్నికల్లో పోటీ చేయడానికి అప్పటికి తగినంత వయసు లేని మనేకా గాంధీ.. అందుకు వీలు కల్పించేలా రాజ్యాంగాన్ని సవరించాలని తన అత్త ఇందిరాగాంధీని కోరారని, అందుకు ఆమె నిరాకరించారని గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉండే మహ్మద్ యూనస్ అనే మాజీ దౌత్యవేత్తను ఉటంకిస్తూ కిద్వాయి రాశారు. ఇది ఇందిరాగాంధీకి, ఆమెకు మధ్య లోతైన అగాధాన్ని సృష్టించింది. అప్పటికే లక్నో కార్యక్రమానికి హాజరైనందుకు ఇందిరాగాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. అదే రోజు.. దీంతో ఆమె మీడియా, పోలీసు సిబ్బంది ముందే ప్రధాన మంత్రి నివాసమైన 1, సఫ్దర్జంగ్ రోడ్డు నుంచి అప్పటికి రెండేళ్లయినా లేని తన కుమారుడు వరుణ్గాంధీని తీసుకుని వెళ్లిపోయారని రెడ్ శారీ అనే పుస్తకంలో స్పానిష్ రచయిత జేవియర్ మోరో రాశారు.
అమేథీలో గాంధీల మధ్య పోరాటం
అత్తగారింటి నుంచి వెళ్లిపోయిన మనేకా గాంధీ.. అమేథీలో రాజీవ్గాంధీ విజయం తర్వాత ఏడాదికి సంజయ్ విచార్ మంచ్ పేరుతో రాజకీయ వేదికను ప్రారంభించారు. 1984లో రాజీవ్గాంధీపై పోటీ చేసి ఓడిపోయారు. 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీ హత్యతో పరిణామాలు మారిపోయాయి. రాజీవ్గాంధీ తాత్కాలిక ప్రధాని అయ్యారు. దాంతో మనేకాకు ఇప్పుడు ఒక కాంగ్రెస్ ఎంపీని కాకుండా.. దేశ ప్రధాన మంత్రిని ఎదుర్కొనాల్సి వచ్చింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో మనేకా గాంధీ డిపాజిట్ కోల్పోయారు. అప్పటి నుంచి.. రాజీవ్గాంధీ హత్య తర్వాత కూడా అమేథీ కాంగ్రెస్కు బలమైన కోటగా నిలిచింది. రాజీవ్ హత్యానంతరం ఆయన సన్నిహితుడు సతీశ్ శర్మ 1991, 1996 ఎన్నికల్లో గెలిచారు. 1999లో సోనియాగాంధీ పోటీ చేశారు.
2004లో తన కుమారుడు రాహుల్ గాంధీకి ఆ సీటు ఇచ్చి.. తాను రాయ్బరేలీకి మారారు. రాహుల్గాంధీ అప్పటి నుంచి 15 ఏళ్లపాటు అమేథీ ఎంపీగా ఉన్నారు. 2019లో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓటమిపాలయ్యారు. ఇప్పుడు సమాజ్వాదితో పొత్తులో భాగంగా మళ్లీ కాంగ్రెస్కే అమేథీలో పోటీ చేసే అవకాశం వచ్చింది. రాహుల్గాంధీ ఈసారి కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తారని భావిస్తున్నారు. మనేకా విషయానికొస్తే ఆమె, ఆమె కుమారుడు వరుణ్గాంధీ బీజేపీలో చేరారు. కొంతకాలంగా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వరుణ్గాంధీ.. సమాజ్వాది పార్టీలో చేరుతారని, ఆయనకు అమేథీ టికెట్ను ఇస్తారని ప్రచారం జరిగింది.