లోక్సభ ఎన్నికల వేళ హర్యానాలో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకున్నది. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన ముగ్గురు స్వతంత్ర సభ్యులు.. కాంగ్రెస్ పక్షాన నిలిచారు.
మద్దతు ఉపసంహరించిన ముగ్గురు ఇండిపెండెంట్లు
కాంగ్రెస్ పక్షాన నిలిచిన ఎమ్మెల్యేలు
వారి బాటలోనే మరో ఎమ్మెల్యే
నాయబ్సింగ్ సైని రాజీనామా చేయాలి
కాంగ్రెస్ నేత ఉదయ్భాన్ డిమాండ్
రోహతక్: లోక్సభ ఎన్నికల వేళ హర్యానాలో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకున్నది. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన ముగ్గురు స్వతంత్ర సభ్యులు.. కాంగ్రెస్ పక్షాన నిలిచారు. దీంతో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని ప్రభుత్వం మైనార్టీలో పడింది. పుంద్రి నియోజకవర్గం ఎమ్మెల్యే రణధీర్ గోలన్, నిలోఖేరి ఎమ్మెల్యే ధర్మ్పాల్ గోండెర్, దాద్రి ఎమ్మెల్యే సోంబీర్సింగ్ సంగ్వాన్ మంగళవారం రోహతక్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ నిర్ణయాన్ని ప్రకటించారు. బాద్షాపూర్ ఎమ్మెల్యే రాకేశ్ దౌల్తాబాద్ కూడా ఇప్పుడు ఇక్కడికి రాలేకపోయినప్పటికీ తమ వెంటే ఉంటారని తెలిపారు.
ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నట్టు ముగ్గురు ఎమ్మెల్యేలు చెప్పారు. వివిధ అంశాల విషయంలో రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం పట్ల తమ అసంతృప్తిని ధర్మ్పాల్ గొండెర్ వెలిబుచ్చారు. ‘ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మా మద్దతు అవసరమైనప్పుడు మమ్మల్ని పదే పదే కలిశారు. మనోహర్లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రిగా ఉన్నంకాలం ఆయనకు మద్దతు ఇవ్వాలని మేం అప్పట్లోనే నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఆయన అధికారంలో లేకపోవడం బాధగా ఉన్నది. రైతుల ప్రయోజనాల కోసం మేం ఈ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నాం’ అని ధర్మ్పాల్ చెప్పారు.
బీజేపీ పరిపాలనలో హర్యానాలో నిరుద్యోగం, ధరలు పెరిగిపోవడం తమ మద్దతు ఉపసంహరణకు కీలక అంశాలని గోలన్ చెప్పారు. ‘గడిచిన నాలుగున్నరేళ్లుగా మేం బీజేపీకి మద్దతు ఇస్తున్నాం. ఈ రోజు రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది. ధరలు పెరిగిపోయాయి. ఈ పరిస్థితిని చూసి.. ప్రభుత్వానికి మా మద్దతు ఉపసంహరిస్తున్నాం’ అని ఆయన వివరించారు.
స్వతంత్ర సభ్యుల నిర్ణయాన్ని హర్యానా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపిందర్సింగ్ హుడా స్వాగతించారు. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం లేదని, కాంగ్రెస్కు మద్దతు పెరుగుతున్నదనేందుకు ఇది నిదర్శనంగా ఆయన చెప్పారు. ‘వారిది సరైన నిర్ణయం. సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయం. ఇది ప్రజల ప్రయోజనాల కోసం. ఇది కాంగ్రెస్ గాలి. వారిని నేను స్వాగతిస్తున్నాను’ అని హుడా అన్నారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ ఉదయ్ భాన్ మీడియాతో మాట్లాడుతూ.. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని, కాంగ్రెస్ పక్షాన నిలిచారని చెప్పారు.
ప్రస్తుతం 88 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో (మొత్తం 90) 40 మంది బీజేపీ వారు. బీజేపీ ప్రభుత్వానికి గతంలో జేజేపీ ఎమ్మెల్యేలు, స్వతంత్ర సభ్యులు మద్దతు ఇచ్చారు. అయితే.. గతంలోనే జేజేపీ మద్దతు ఉపసంహరించుకుంది. ఇప్పుడు స్వతంత్ర ఎమ్మెల్యేలు అదే బాట పట్టారు’ అని తెలిపారు. ‘ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని ప్రభుత్వం ఇప్పుడు మైనార్టీలో పడింది. ఆయన ముఖ్యమంత్రి సీటు ఒక్క నిమిషం కూడా కూర్చోడానికి హక్కు లేదు. ఆయన వెంటనే రాజీనామా చేయాలి. అసెంబ్లీకి వెంటనే ఎన్నికలు నిర్వహించాలి’ అని డిమాండ్ చేశారు.