పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టం తీసుకురావాలని డిమాండ్చేస్తూ 200కు పైగా రైతు సంఘాలు మంగళవారం ఢిల్లీకి పాదయాత్ర చేయనున్నాయి
విధాత: పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టం తీసుకురావాలని డిమాండ్చేస్తూ 200కు పైగా రైతు సంఘాలు మంగళవారం ఢిల్లీకి పాదయాత్ర చేయనున్నాయి. ఎంఎస్పీకి చట్టపరమైన హామీతోపాటు, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని, రైతులు, రైతు కూలీలకు పెన్షన్లు, వ్యవసాయ రుణమాఫీ, పోలీసు కేసుల ఉపసంహరణ, లఖింపూర్ ఖేరీ హింసాకాండ బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్లతో పాదయాత్ర చేపట్టున్నారు.
మంగళవారం సుమారు 20,000 మంది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీకి ప్రవేశించడానికి ప్రయత్నించవచ్చని నిఘా వర్గాలు చెప్తున్నారు. పోలీసుల కండ్లుగప్పి రైతులు కార్లు, ద్విచక్ర వాహనాలు, మెట్రో, బస్సులను ఉపయోగించవచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. రైతు పాదయాత్ర నేపథ్యంలో ఢిల్లీలో 144 సెక్షన్ విధించినట్టు పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా తెలిపారు. రైతుల నిరసనను అడ్డుకునేందుకు సింఘు, ఘాజీపూర్, తిక్రీ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మార్చి 12 వరకు ఢిల్లీలో పెద్ద సమావేశాలు కూడా నిషేధించబడ్డాయి. అంబాలా, జింద్ మరియు ఫతేహాబాద్ జిల్లాల్లో పంజాబ్-హర్యానా సరిహద్దులను మూసివేయడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు.