కేసీఆర్కు ఇప్పుడు రైతులు గుర్తొచ్చారు ఆయన పాపాలకు భయపడ్డ వరుణుడు చలికాలంలో అధికారంలోకి వచ్చాం.. వర్షాకాలంలో ఉన్నది కేసీఆర్ ప్రభుత్వమే ఎన్నికల పొగతో ఫామ్హౌస్ నుంచి బయటకు 200 మంది పేర్లు 48 గంటల్లో ఇవ్వండి వారి కుటుంబాలను ఆదుకుంటాం కేసీఆర్ రద్దైన వెయ్యి నోటు లాంటోడు మాజీ సీఎంపై రేవంత్రెడ్డి ఫైర్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర అక్కడే ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల
విధాత, హైదరాబాద్ : బీఆరెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని, తెలంగాణ కోలుకోలేని విధంగా ఆర్థిక, సహజ వనరుల దోపిడీ చేశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. తాము రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నామని చెప్పారు. తుక్కుగూడలో నిర్వహించనున్న కాంగ్రెస్ బహిరంగ సభ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రేవంత్రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం కరువు తెచ్చిందన్న కేసీఆర్ విమర్శలపై మండిపడ్డారు. 80 వేల పుస్తకాలు చదివిన మేధావికి వర్షాకాలం, చలికాలం ఎప్పుడొస్తాయో తెలియదా? అని ఎద్దేవా చేశారు. గత వర్షాకాలంలో కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలో ఉందని, కేసీఆర్ చేసిన పాపాలకు వరుణుడు భయపడి పారిపోయాడని వ్యాఖ్యానించారు. తాము చలికాలంలో అధికారంలోకి వచ్చామని గుర్తు చేశారు. ‘మీ పాపాల పాలనలో 20 రోజులు వానలు పడకపోవడం వల్లే 2024లో కరువు వచ్చింది. మీ పాలనలో చేసిన పాపాలను, మోసాలను మాపై రుద్దకండి’ అని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
రైతులు గుర్తొచ్చినందుకు సంతోషం
పదేళ్ల తరువాతనైనా తెలంగాణ రైతులున్నారని కేసీఆర్కు గుర్తొచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు. కేసీఆర్ పొలం బాట పట్టడం సంతోషకరమనిమని, పొగ పెట్టగానే కలుగులోంచి ఎలుకలు బయటకు వచ్చినట్లు.. ఎన్నికలు అనే పొగ పెట్టడంతో కేసీఆర్ ఫామ్హౌస్ నుంచి బయటకు వచ్చారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వారి పాలనలో తాము రైతులు, విద్యార్థుల, ప్రజా సమస్యలపై ఆందోళనలకు పిలుపిస్తే తమను గృహనిర్బంధం చేశారని గుర్తు చేశారు. కానీ తాము మాత్రం ప్రతిపక్ష నేత ప్రజల్లోకి వెళ్లాలనిచెప్పి.. ఆయన పర్యటనకు అధికారికంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ‘మీ పాపాలు కడుక్కోవడానికి ప్రజల వద్దకు వెళ్లారు. మీ పార్టీ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి. ఆ పాపపు సొమ్ము నుంచి 100 కోట్లు రైతులకు ఇచ్చి ఉంటే మీరు చేసిన పాపం కొంతైనా తగ్గేది’ అని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
పార్లమెంటు ఎన్నికల కోసమే రైతు వేషం
పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు, పారిపోతున్న ఎంపీ అభ్యర్థులను కాపాడుకునేందుకు కేసీఆర్ నక్కజిత్తుల రైతు వేషాల నాటకాలు వేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. అధికారం పోకుండా ఉండి ఉంటే.. కిందపడి గాయం కాకుండా ఉంటే.. కూతురు జైలుకు వెళ్లకపోయి ఉంటే ఆయన ఎవరికీ దొరికే వారు కాదన్నారు. ఆడబిడ్డల కళ్లలో సంతోషం చూసి కేసీఆర్ నిప్పులు పోసుకుంటున్నారని, కేసీఆర్ రైతు పర్యటన చూస్తోంటే వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలకు వెళ్లినట్లుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రద్దైన వెయ్యి రూపాయల నోటు లాంటి వారని, ఎవడైనా జేబులో ఆ నోటును పెట్టుకుంటే జైలుకు పోతడన్నారు. ప్రతీ వారం కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలి.. ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యత నెరవేర్చాలని రేవంత్ చురకలేశారు. వంద రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతనవుతలేదంటూ, ప్రభుత్వం కూలాలంటూ మాట్లాడిన తీరు కేసీఆర్కు తగన్నారు.
కోడ్ ముగియగానే పంట నష్టపరిహారం
రైతులకు పంట నష్టపరిహారం ఎన్నికల కోడ్ ముగియగానే అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ వెన్నుపూస లాంటిదని, దాన్ని ఎలా సరిచేయాలన్నదానిపై ఎన్డీఎస్ఏ నివేదిక కోసం చూస్తున్నామని తెలిపారు. మేడిగడ్డ నీళ్లను వదిలేసిందే బీఆరెస్ ప్రభుత్వమని, మిగిలిన నీటిని ఎన్డీఎస్ఏ వదిలిపెట్టాలని చెప్పిన సంగతిని మరువరాదని అన్నారు. మేడిగడ్డ, అన్నారంలలో నీళ్లు నింపాలంటున్న కేసీఆర్ ఆ విషయాన్ని ఎన్డీఎస్ఏతో చెప్పించాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే కృష్ణా జలాలు అందిస్తున్నామని చెప్పారు. వర్షాభావంతో భూగర్భ జలాలు ఇంకిపోవడంతో బోర్ల నీరు అందక ట్యాంకర్ల అవసరం ఏర్పడిందన్నారు. 1000 ట్యాంకర్లతో బుక్ చేసిన 12 గంటల్లో సరఫరా నీటిని చేస్తున్నాం మమ్మల్ని అభినందించకుండా కేసీఆర్ తిడుతున్నారని వ్యాఖ్యానించారు.
తాగునీటికి ప్రాధాన్యం ఇస్తున్నాం
సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీలకు పడిపోయాయని, అందుకే రైతులకు కష్టమైనప్పటికీ తాగునీటికి ప్రాధాన్యం ఇస్తున్నామని రేవంత్రెడ్డి చెప్పారు. తాగునీటి ఇబ్బందుల పరిష్కారానికి అన్ని ప్రత్యామ్నాయ చర్యలూ చేపట్టామన్నారు.
రైతుబంధు లెక్కలు వాస్తవమైతే కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
రైతుబంధు వేయడం లేదన్న కేసీఆర్ మాటలు మరో మోసమని రేవంత్రెడ్డి అన్నారు. 64 లక్షల 75 వేల 581 మంది రైతుల ఖాతాల్లో తమ ప్రభుత్వం రైతు బంధు వేసిందని, ఇంకా మిగిలింది 4 లక్షల ఖాతాలు మాత్రమేనన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే మిగతా రైతులకు రైతు బంధు చెల్లిస్తామన్నారు. బీఆరెస్ హయాంలో నాలుగు నెలల నుంచి పది నెలలు సమయం తీసుకున్నారని, ఆ లెక్కలు ఉన్నాయని, తాము వంద రోజుల్లోనే వేశామన్నారు. తాము చెప్పిన లెక్కలు తప్పని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని స్పష్టంచేశారు. తాము చెప్పిన లెక్కలు వాస్తవమైతే తెలంగాణ రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
జనరేటర్ పెట్టుకుని.. కరెంటు పోయిందన్నారు
కేసీఆర్ పర్యటించిన రోజు సూర్యాపేటలో 30 సెకన్లు కూడా కరెంటు పోలేదని రేవంత్రెడ్డి తెలిపారు. సూర్యాపేట ప్రెస్ మీట్లో కేసీఆర్ మైక్ జనరేటర్కు కనెక్ట్ అయి ఉందన్న రేవంత్.. ‘నీ జనరేటర్లో ఎవడు పుల్ల పెట్టాడో ఎవరికి తెలుసు?’ అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఎక్కడ నిద్రపోతున్నావని కేసీఆర్ అంటుండని, రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ లోనో.. సినిమా వాళ్ల గెస్ట్ హౌసుల్లోనో పడుకోవడం లేదని కేసీఆర్ గ్రహించాలని కౌంటరిచ్చారు.
ఆ 200 మంది పేర్లు ఇవ్వండి
కేసీఆర్కు 48 గంటల సమయం ఇస్తున్నానని.. చనిపోయిన 200 మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి ఇస్తే.. వారు నిజంగా చనిపోయి ఉంటే.. వారి కుటుంబాలను ఆదుకునే బాధ్యత తమదని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. తాలు పేరిట క్వింటాలుకు ఎవరైనా 10 కిలోలు కట్ చేస్తే తాట తీస్తామన్నారు. మీ లెక్క కమీషన్లు, కటింగ్లు చేయబోమన్నారు. కేసీఆర్, కేటీఆర్ వాళ్ల బాస్ మోదీ గెలవాలని కోరుకుంటున్నారని విమర్శించారు. కేటీఆర్ మాటలు మందుకల్లు తాగిన పోరగాళ్ల లెక్క ఉందన్నారు. కాంగ్రెస్కు 40 వస్తాయంటున్నాడంటే మోదీకి 400 సీట్లు వస్తయని చెబుతున్నాడని అన్నారు. బీఆరెస్ ఒకటి రెండు గెలిచినా మోదీతోనే కలుస్తారని స్పష్టంచేశారు. అందుకే కాంగ్రెస్కు 40 రావాలని కోరుకుంటున్నారని విమర్శించారు. లిక్కర్ దొంగల నుంచి కాంట్రాక్టర్ల వరకు చీకట్లో వందల కోట్ల రూపాయల బాండ్లు ఆ రెండు పార్టీలకే ఇచ్చారని రేవంత్ గుర్తు చేశార. పదేపదే తాము ఢిల్లీకి వెళ్లేది రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు సాధించేందుకేనంటూ వివరించారు. మహిళా సంఘాలకు కేసీఆర్ పెండింగ్ పెట్టిన కోట్ల రూపాయలను తాము వారికి తిరిగి అందిస్తున్నామని, ఆడబిడ్డల కళ్లలో ఆనందం చూడలేక నిప్పులు పోసుకుంటున్నాడని, అందుకే నీకు పాపాల భైరవుడి పేరు తక్కువేనన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తుందన్నారు. రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారానికి అందరూ ఆహ్వానితులేనన్నారు. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న తెలంగాణ జనజాతర సభ నిర్వహించనున్నామని, ఇదే సభలో జాతీయ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో తెలంగాణ వేదికగా విడుదల కాబోతోందన్నారు. జాతీయ కార్యాచరణకు ఇక్కడి నుంచే పిలుపునివ్వడం అంటే మా కార్యకర్త కష్టాన్ని అధిష్ఠానం గుర్తించినట్లేనని చెప్పారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు రాష్ర్టం నలుమూలల నుంచి జనజాతర సభకు తరలి రావాలని, ఆడబిడ్డలు పెద్ద సంఖ్యలో సభకు తరలి వచ్చి ఆశీర్వదించాలని రేవంత్రెడ్డి కోరారు. తెలంగాణ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రత్యేకమని, తెలంగాణకు సోనియమ్మ కుటుంబం మరీ ప్రత్యేకమన్నారు.