విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొందరు బీఆరెస్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీలోని అసంతృప్తివాదులు, రెబల్ అభ్యర్థులతోనే ప్రమాదం కనిపిస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ- ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్కు అసంతృప్తివాదుల అల్టిమేటాలతో టెన్షన్ పట్టుకున్నది. మొదటినుంచి మల్లయ్య యాదవ్ తన అనుచరులు, వెంట వచ్చిన టీడీపీ నేతలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దానికి తోడు పార్టీలో ఉన్న సీనియర్లను కలుపుకోకపోవడం అసంతృప్తిని రాజేసిందని చెబుతున్నారు.
ఈ అసంతృప్తి చినికి చినికి గాలివానగా మారి.. అసంతృప్తివాదుల సభలు, సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాల దాకా వెళ్లాయి. కోదాడ నియోజకవర్గంలో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావుతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి శశిధర్ రెడ్డి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వర్గం కట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. బీఆరెస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒకరిద్దరు మినహా సిటింగ్లకే మళ్లీ అవకాశం కల్పించడం కోదాడలో అసమ్మతివాదులకు జీర్ణం కాలేదు. జాబితా ప్రకటన అనంతరం వేనేపల్లి చందర్రావు, శశిధర్రెడ్డి ఆధ్వర్యంలో అనేక ఆత్మీయ సమ్మేళనాలు, ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.
ఎమ్మెల్యే అద్దె ఇంటి వ్యవహారంతో మరింత డామేజ్..
పార్టీలో విభేదాలు రచ్చకెక్కుతున్న తరుణంలో ఎమ్మెల్యే ఇంటి వివాదం మరోసారి ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశం అయింది. ఎమ్మెల్యే కాకముందు అద్దెకు తీసుకున్న ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారని, ఇంటి ఓనర్ శ్రీనివాస్ రెడ్డిని బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. అదే ఇంటికి దొంగ పత్రాలు సృష్టించడమే కాకుండా కోర్టుల చుట్టూ తిరుగుతూ జరిమానాలు కడుతున్న విషయాన్ని స్వయంగా ఇంటి యజమాని శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వివరించడంతో మరోసారి ఎమ్మెల్యే వ్యవహారం చర్చల్లోకి వచ్చింది.
ఈ విషయాలపై ఇప్పటికే శశిధర్ రెడ్డి నేతృత్వంలో జిల్లా మంత్రి జగదీశ్రెడ్డితో పాటు మంత్రి కేటీఆర్, అధిష్ఠానానికి కూడా ఫిర్యాదులు చేశారు. అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాజాగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన అసమ్మతి వర్గం పార్టీకి ఉమ్మడిగా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
రాబోయే ఎన్నికల్లో బొల్లం మల్లయ్యకు బీఫాం ఇస్తే పార్టీకి రాజీనామాలు చేయడమే కాకుండా.. అవసరమైతే రెబల్ అభ్యర్థిగా బరిలో దిగి.. మల్లయ్యను ఓడిస్తానని శశిధర్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అసమ్మతి వర్గానికి మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు పెద్దదిక్కుగా వ్యవహరిస్తుండగా పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్నేని బాబు, లక్ష్మీనారాయణ పలువురు జడ్పీటీసీలు ప్రజా ప్రతినిధులు ఆయన వర్గంగా ఉన్నారు.
సయోధ్యకు మంత్రి యత్నం
కోదాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తున్న మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, శశిధర్ రెడ్డి, ఎర్నేని బాబులతో మాట్లాడిన మంత్రి జగదీశ్రెడ్డి.. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పలు దఫాలుగా ప్రయత్నాలు చేశారు. అయితే.. అవి ఫలించినట్టు కనిపించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మల్లయ్య అభ్యర్థిత్వాన్ని మార్చాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది.
మల్లయ్య కాకుండా వేరే ఎవరినైనా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాలంటూ మంత్రి ముందే తెగేసి చెప్పినట్లు సమాచారం. అధిష్ఠానం తమ ప్రతిపాదనలను పట్టించుకోకుంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా తానే పోటీలో ఉంటానని శశిధర్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అసంతృప్తి వాదులను ఏకతాటిపైకి తెస్తున్న మంత్రి జగదీశ్రెడ్డి.. కోదాడ సమస్యను గట్టేక్కిస్తారా.. లేదా సొంత పార్టీ నేతలతోనే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎదురీదుతారా? అనేది వేచి చూడాలి.