14 ఎంపీ సీట్లు గెలుస్తాం
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
విధాత: కేసీఆర్ చేసిన పాపాల వల్లే రాష్ట్రంలో వర్షాలు పడటం లేదని, పదేళ్లలో రైతుల ముఖం చూడని కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల వేళ కరువు పేరుతో రాజకీయం చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. మంగళవారం తుక్కుగూడలోని రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కోమటిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఇంచార్జీగా ఉన్న సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం సహా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. భువనగిరి, నల్లగొండ స్థానాలు భారీ మెజార్టీతో గెలుస్తామన్నారు.
సికింద్రాబాద్ అభివృద్ధిని, బస్తీల్లో మౌలిక వసతుల సమస్యలను కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదన్నారు. కేటీఆర్ కేబుల్ బ్రిడ్జి వేసి ఆభివృద్ధి అంటున్నాడని ఎద్దేవా చేశారు. కేటీఆర్ అంటేనే కల్వకుంట్ల ట్యాపింగ్ రావు అన్నారు. ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా హరీష్ రావుకు బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. పార్టీలు మారే బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి రేపు ఏ పార్టీలో ఉంటాడో తెలువదని, అలాంటి వారి మాటలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. మహేశ్వర్ రెడ్డికి దమ్ముంటే ప్రధాని మోడీ ఇచ్చిన హామీలపై మాట్లాడాలని సూచించారు.