బోర్ కొట్టిందని కొత్త ప్రభుత్వం రావాలా: మంత్రి కేటీఆర్
అభివృద్ధి చేసేవాళ్లు ఇంకొన్నాళ్లు అధికారంలో ఉంటే తప్పేంటని, బోర్ కొట్టిందని కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటారా అంటూ బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

- అభివృద్ధి చేసేవాళ్లు మళ్లోస్తే తప్పేంటీ
- అసలు సినిమా ముందుంది
- బిల్డర్స్ ఫెడరేషన్ సదస్సులో మంత్రి కేటీఆర్
విధాత: అభివృద్ధి చేసేవాళ్లు ఇంకొన్నాళ్లు అధికారంలో ఉంటే తప్పేంటని, బోర్ కొట్టిందని కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటారా అంటూ బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ తాజ్ దక్కన్లో జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆరెస్కు రెండు సార్లు అవకాశం ఇచ్చాంకదా అని కొందరు అంటున్నారని, బాగా పనిచేసినప్పుడు మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. 11 సార్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్ చేసిందేంటన్నారు. కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కసాయి చేతుల్లో పెడదామా అన్నారు.
కాంగ్రెస్లో ప్రతిఒక్కరు ముఖ్యమంత్రి అభ్యర్థేనని ఎద్దేవా చేశారు. నామినేషన్ రిజెక్ట్ అయిన జానారెడ్డి కూడా సీఎం అభ్యర్థేనని విమర్శించారు. ఆ పార్టీలో 11 మంది సీఎం కాండెట్లు ఉన్నారని చెప్పారు. గతంలో కాంగ్రెస్ సీఎం కుర్చీ కోసం ఆ పార్టీ నేతలే మతకలహాలు సృష్టించారన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఏమోకానీ.. ఆరు నెలలకో సీఎం గ్యారెంటీ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆర్థిక ఛోదక శక్తి హైదరాబాద్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర జీడీపీలో 45 నుంచి 50 శాతం ఇక్కడి నుంచే వస్తున్నదని చెప్పారు. హైదరాబాద్ను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రం కుంటుపడుతుందన్నారు. తెలంగాణ వస్తే భూముల రేట్లు పడిపోతాయని ఆనాడు ప్రచారం చేశారు.
కానీ హైదరాబాద్లో రేట్లు 10 నుంచి 20 రెట్లు పెరిగాయన్నారు. హైదరాబాద్ సహా రాష్ట్రమంతా భూముల రేట్లు అధికమయ్యాయని చెప్పారు. మాజీ సీఎం చంద్రబాబు కూడా ఇదే విషయం చెప్పారని గుర్తుచేశారు. డిసెంబర్ 3 తర్వాత సింగిల్ విండో అమలుచేస్తామన్నారు. అభివృద్ధిలో ఇప్పటివరకు చూసింది ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందుందని వెల్లడించారు. మొదటి రెండు టర్మ్ల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై దృష్టిసారించామని, తెలంగాణను సస్యశ్యామలం చేసుకున్నామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించామని తెలిపారు.
త్వరలో 332 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్) రాబోతున్నదని, ఓఆర్ఆర్కు, ఆర్ఆర్కు మాధ్య కొత్త హైదరాబాద్ ఆవిష్కృతం చేస్తామని చెప్పారు. వచ్చే టర్మ్లో ప్రతి రోజు ఇంటింటికి నల్లా నీళ్లు ఇస్తామని వెలడించారు. ఆ తర్వాత 24 గంటల తాగు నీరు సరఫరా చేస్తామన్నారు. ఇది తమ కమిట్మెంట్ అని తప్పకుండా చేస్తామన్నారు. అది జరుగాలంటే సీఎం కేసీఆర్ ప్రభుత్వం మళ్లా రావాలన్నారు. హైదరాబాద్కు ఇంకా సోషల్ ఇన్ఫ్రా యాడ్ చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. తొమ్మిదిన్నరేండ్లలో రాష్ట్రం బాగుపడిందని, గత పాలకులు తమకేమీ అద్భుత దీపం ఇచ్చిపోలేదని, సుస్థిర ప్రభుత్వం, సమర్ధ నాయకత్వం వల్లే అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు.
కరోనా వల్ల రెండేండ్లు వృథా అయిందని, సరిగ్గా ఆరున్నరేండ్లు మాత్రమే పనిచేయగలిగామని వెల్లడించారు. అమెరికాలో కూడా సమస్యలు ఉన్నాయని చెప్పారు. ప్రాధాన్యక్రమంలో సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. గత 65 ఏండ్ల పాలకులు ఏం చేశారని, ఈ ఆరున్నరేండ్లలో తాము ఏం చేశామో చూడాలన్నారు. గత పాలకులు సరిగ్గా పనిచేస్తే నేడు ఇన్ని సమస్యలు ఉండేవా అని ప్రశ్నించారు. ఆనాడు కరెంటు ఉంటే వార్త.. కానీ ఇప్పుడు కరెంటు పోతే వార్త అని స్పష్టం చేశారు. పదేండ్ల కిందట పరిస్థితి ఎలా ఉండేదో ప్రజలు గుర్తుచేసుకోవాలన్నారు.
2014కు ముందు వ్యవసాయానికి ఆధారం లేదని, పెట్టుబడి, నీళ్లు, కరెంటు ఉండేది కాదన్నారు. నాడు రైతులు ఆస్తులు అమ్ముకున్నా అప్పులు కట్టలేని దుస్థితి ఉండేదని, నేడు వారికి భూములే భరోసా అన్నారు. భూముల విలువ పెరగడంతో రాష్ట్రంలోని వ్యక్తుల్లో ధీమా వచ్చిందని చెప్పారు. దేశానికే తెలంగాణ ఒక దిక్సూచి అని కేటీఆర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు మనకు ముగ్గురు ముఖ్యమంత్రులు మాత్రమే మనకు గుర్తొస్తారని చెప్పారు. ప్రో బిజినెస్, ప్రో అర్బన్ అనేవి చంద్రబాబు మోడల్ అని.. ప్రో రూరల్, ప్రో అగ్రికల్చర్, ప్రో పూర్ అనేవి రాజశేఖర్ రెడ్డి విధానమని, అన్ని రంగాల అభివృద్ధే సీఎం కేసీఆర్ మోడల్ అని మంత్రి కేటీఆర్ చెప్పారు.
కర్ణాటక పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారిందన్నారు. 40 శాతం కమిషన్ అని అక్కడి బీజేపీ ప్రభుత్వాన్ని పంపారని, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్లు చదరపు అడుగుకు రూ.500 వరకు బిల్డర్స్ నుంచి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ గొప్పదనం, తెలంగాణ గొప్పతనం ఇక్కడున్న వారికి అర్థం కాదన్నారు. తెలంగాణలో మౌలిక సదుపాయాలను చూసి మహారాష్ట్ర బిల్డర్స్ ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. పెట్టుబడుల వల్ల అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని వెల్లడించారు.
ధాన్యం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నామని చెప్పారు. ఐటీ రంగం వృద్ధి 2022-23లో రూ.57 వేల కోట్లని, ఈ ఏడాది దేశంలో వచ్చిన ఐటీ ఉద్యోగాల్లో 44 శాతం తెలంగాణ వారేన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ నంబర్వన్గా ఉందని చెప్పారు. ఉద్యోగ కల్పన, టెక్నాలజీ రంగంలో బెంగళూరును హైదరాబాద్ దాటిపోయిందన్నారు. అభివృద్ధి, ప్రగతి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని చెప్పారు. స్థిరమైన ప్రభుత్వం, దృఢమైన నాయకత్వం లేకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందన్నారు.
ఇవాళ తెలంగాణకు ఓ బ్రాండ్ ఇమేజ్ ఉందని చెప్పారు. ప్రపంచంలోనే తెలంగాణ అంటే ప్రోగ్రెసివ్ స్టేట్ అని తెలిపారు. అభివృద్ధే తమ కులం అని, సంక్షేమమే మతం అనే పద్ధతిలో ముందుకుపోతున్నామని చెప్పారు. అందుకే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, సంపద సృష్టించబడుతున్నదని స్పష్టం చేశారు. నాడు ఆర్థిక అసమానతలు, సామాజిక రుగ్మతల వల్లే నక్సలిజం వచ్చిందని చెప్పారు. తెలంగాణలో నేడు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.