హైదరాబాద్ నగరానికి చెత్త సమస్య తీరినట్టే! ఇక మరిన్ని డంప్ యార్డులు
హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా నాలుగు డంప్ యార్డులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు

- జనావాసాలకు దూరంగా ఏర్పాటు
- ప్రజారోగ్యానికి ఇబ్బంది లేకుండా చర్యలు
- ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలు
- మెట్రో అలైన్మెంట్పై మరోసారి స్పష్టత
విధాత, హైదరాబాద్: హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా నాలుగు డంప్ యార్డులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ డంప్ యార్డుల వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికంతటికీ జవహర్ నగర్లో ఒకే డంప్ యార్డు ఉన్నది. ప్రతిరోజూ సుమారు 8 వేల టన్నుల చెత్తను ఇక్కడి డంప్ యార్డుకు చేరవేస్తున్నారు. డంప్ యార్డ్ వల్ల వాయు కాలుష్యం, చెడువాసన చుట్టు ప్రక్కల ప్రజలకు ఇబ్బందికరంగా మారింది.
కాలుష్యాన్ని తగ్గించే విధంగా సిటీకి దూరంగా గతంలో శంషాబాద్, మెదక్ వైపు డంప్ యార్డు సైట్లను పరిశీలించామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిశీలించి ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. చెత్త ద్వారా 15 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని, ఇందుకు గాను టీఎస్ఎస్పీడీసీఎల్తో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. చెత్తను సాధ్యమైనంతవరకు రీసైకిల్ చేయాలన్నారు. ఇందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలందిస్తామన్నారు.
మెట్రో రైల్
సీఐఐ ప్రతినిధుల సమావేశంలో మెట్రో రైల్ రూట్ విస్తరణపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు స్పష్టతను ఇచ్చారు. గతంలో గచ్చిబౌలి – ఎయిర్ పోర్టు వరకు 32 కిలోమీటర్ల మేర ప్రణాళికలు రూపొందించారని, దానివల్ల సామాన్య జనాలకు పెద్దగా ఉపయోగం లేదని అన్నారు. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో అధికంగా ధనికులు వుండటం వల్ల వారు ఎక్కువగా స్వంత వాహనాలు వాడుతున్నారని పేర్కొన్నారు. గతంలో సర్వే చేసిన గౌలిగూడ – ఫలక్నుమా – ఎయిర్ పోర్టు రూట్, ఎల్బీ నగర్ నుంచి ఎయిర్ పోర్టు రూట్ను ప్రజలు ఎక్కువగా వినియోగించుకునేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంతాల నుంచి అరబ్ దేశాలకు అధికంగా వెళుతుంటారని, విదేశాలకు వెళ్లే వారి కుటుంబాలు ఎయిర్ పోర్టుకు వెళ్లి సెండాఫ్ ఇస్తుంటారని, అందుకే ఈ రూట్ చాలా వినియోగకరంగా వుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.
మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
మూసీ నది పరివాహక ప్రాంతాన్ని తొలిదశలో 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. రింగ్ రోడ్ టూ రింగ్ రోడ్ మొత్తం ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఐకానిక్ డిజైన్లలతో అమ్యూజ్మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్ వాటర్ స్పోర్ట్స్, స్ట్రీట్ వెండర్స్, బిజినెస్ ఏరియా, షాపింగ్ మాల్స్ అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లోని చారిత్రాత్మక కట్టడాలయిన చార్మినార్, గోల్కొండ, సెవెన్ టూంబ్స్, తారామతి బారాదరి వంటి వాటిని అనసంధానిస్తూ ఒక టూరిజం సర్క్యూట్ను రూపొందించాలని సూచించారు. ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పీపీపీ మోడల్లో పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి సమయం ఆహ్లాదకరంగా గడిపేందుకు సౌకర్యాలు కల్పించేందుకు పరిశీలించాలన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో చెక్ డ్యాములు నిర్మించి వాటర్ ఫౌంటెన్స్, వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఫైవ్ స్టార్ హోటల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు.