MLC election | ప్రశాంతంగా ముగిసిన వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది

ఓటేసిన ప్రముఖులు
విధాత: వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. 4 గంటల్లోపు క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. సుమారు 60 శాతంపైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. 4లక్షల 63,869మంది ఓటర్లు ఉన్న ఈ ఎమ్మెల్సీ స్థానంలో మధ్యాహ్నం 2 గంటల వరకు 49.53 శాతం పోలింగ్ నమోదైంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 605 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగింది.
నల్లగొండ జిల్లా నార్కట్పల్లి పోలింగ్ కేంద్రంకు వెళ్లిన ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ తనపై కాంగ్రెస్ వాళ్లు దాడి చేశారని ఆరోపిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు. ఓటర్లకు ప్రత్యర్థి పార్టీల వారు డబ్బులు పంచుతుండగా వారిని ప్రశ్నించేందుకు వెళ్లగా తనపై దాడి చేశారని పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించాడు. ఈ సంఘటన మినహా మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బ్యాలెట్ బాక్స్లను నల్లగొండలోలోని స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఈ ఉప ఎన్నిక ఫలితం జూన్ 5వ తేదీన వెల్లడి కానుంది.
బీఆరెస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దాంతో ఆ నియోజకవర్గానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆరెస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిల మధ్య ప్రధాన పోటీ సాగింది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన కోచింగ్ సెంటర్ల నిర్వాహకుడు కూడా ప్రధాన పార్టీల ఓట్లను చీల్చడంలో కీలకంగా వ్యవహారించినట్లుగా పోలింగ్ సరళీ మేరకు అంచనా వేస్తున్నారు.
ఓటేసిన అభ్యర్థులు.. ప్రముఖులు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపురం జడ్పీహెచ్లో స్కూల్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు వినియోగించుకున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డి హన్మకొండ సుబేదారి ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. బీఆరెస్ అభ్యర్థి రాకేశ్రెడ్డి కూడా హన్మకొండ వడ్డెపల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. స్వతంత్ర అభ్యర్థి అశోక్ నల్లగొండలోని పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్రెడ్డి సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని 457 నెంబర్ పోలింగ్ బూత్లో తొలి ఓటు వేశారు.