కాళేశ్వరం ముంపు భూములను రక్షించండి
కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో పంట భూములు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి కోరారు

– చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో పంట భూములు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి కోరారు. ఆదివారం ఆయన హైదరాబాద్ లోని సచివాలయంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్టు మూలంగా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని వేలాది ఎకరాలు పంట నష్టానికి గురవుతున్న తీరును వివరించారు. బాధిత రైతుల కష్టాలను వివరిస్తూ, పంట నష్ట సమస్యను పరిష్కరించాలని కోరారు.
కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో రైతులు వరుసగా పంట నష్టాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎమ్మెల్యే వినతికి స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి.. ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్కు ఆదేశాలు జారీ చేశారు.