Putta Madhukar | పోలీస్ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్న దుద్దిల్ల కుటుంబం
నాటి నుంచి నేటి వరకు పోలీస్ వ్యవస్థలను మంథని ఎమ్మెల్యే, మంత్రి దుద్ధిల్ల కుటుంబం భ్రష్టుపట్టిస్టోందని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ విమర్శించారు

ముడుపులు తీసుకుని పోస్టింగ్లు ఇస్తున్న మంత్రి సోదరుడు
ప్రసిద్ది పుణ్య క్షేత్రానికి మాయ మచ్చగా ఎస్ఐ వ్యవహారం
తమ కనుసన్నల్లో పని చేసేవారికే ఇక్కడికి ట్రాన్స్ఫర్లు
కాళేశ్వరం ఎస్ఐ దురాఘాతానికి మంత్రి బాధ్యత వహించాలే
ప్రెస్మీట్లో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
విధాత ప్రతినిధి, పెద్దపల్లి: నాటి నుంచి నేటి వరకు పోలీస్ వ్యవస్థలను మంథని ఎమ్మెల్యే, మంత్రి దుద్ధిల్ల కుటుంబం భ్రష్టుపట్టిస్టోందని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ విమర్శించారు. మంథని పట్టణంలోని రాజగృహాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే మంత్రి తండ్రి శ్రీపాదరావు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీని తన మాట వినలేదని ఇక్కడి నుంచి మరోచోటికి ట్రాన్స్ఫర్ చేయించారని అన్నారు. తమ మాట వింటూ కాంగ్రెస్ కండువా కప్పుకునే పోలీస్ అధికారులకు మాత్రమే ఇక్కడ పోస్టింగ్లు ఇచ్చేవారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంథని నియోజకవర్గంలోని మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరం పోలీస్స్టేషన్లో ఎస్ఐ పోస్టింగ్కు మంత్రి సోదరుడు ముడుపులు తీసుకుని ప్రస్తుత ఎస్ఐకి పోస్టింగ్ ఇప్పించారని అన్నారు. ఇలా ఎమ్మెల్యే సోదరుడు తమకు నచ్చిన వారికి ఇక్కడ పోస్టింగ్లు ఇప్పించి తనపై కుట్రలు చేస్తున్నారని, గతంలో ఇక్కడ పని చేసిన సీఐకి ఏసీపీగా పోస్టింగ్ ఇచ్చారని గుర్తు చేశారు.
రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి సన్నిదిలోని పోలీస్స్టేషన్లో ఎస్ఐ ఓ మహిళాకానిస్టేబుల్పై అఘాయిత్యానికి పాల్పడటం ప్రతి ఒక్కరు ఖండించాలని, ఈ వ్యవహరం కాళేశ్వర క్షేత్రానికే మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు. గతంలో ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్ఐ వ్యవహరంపై తమ ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదని, కానీ కాంగ్రస్ ప్రభుత్వం వచ్చాకనే సదరు ఎస్ఐకి కాళేశ్వరంలో పోస్టింగ్ ఇప్పించారన్నారు.
కాళేశ్వరం ఎస్ఐ మంత్రి సోదరుడికి సన్నిహితుడని పదేపదే చెప్పేవాడని, వారి అండదండలతోనే అఘాయిత్యాలు, ఆరాచకాలకు పాల్పడ్డాడని అన్నారు. నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారుతున్నాయని, ఇటీవల మహాదేవ పూర్ పోలీస్స్టేషన్లోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ జెడ్పీటీసీ భర్త డాన్స్లు చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో భారాస పార్టీ శ్రేణులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.