సెక్రటేరియట్‌కు సునీల్‌ కనుగోలు.. లోక్‌సభ ఎన్నికలపై రేవంత్‌తో చర్చ!

కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు గురువారం సచివాలయానికి రావడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం

సెక్రటేరియట్‌కు సునీల్‌ కనుగోలు.. లోక్‌సభ ఎన్నికలపై రేవంత్‌తో చర్చ!
విధాత : కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు బుధవారం సచివాలయానికి రావడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రజల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం పట్ల స్పందన వంటి అంశాలపై రేవంత్‌రెడ్డితో చర్చిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటిన నేపథ్యంలో ప్రభుత్వం పట్ల ప్రజల ఆలోచన ఎలా ఉన్నదో రేవంత్‌రెడ్డికి సునీల్‌ కనుగోలు వివరిస్తున్నట్టు సమాచారం. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారెంటీల్లో ప్రభుత్వం ఇప్పటి వరకూ రెండింటిని మాత్రమే అమల్లోకి తీసుకువచ్చింది. రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం వంటివి ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటితోపాటు ఎన్నికల హామీలు కూడా నెరవేర్చాల్సి ఉన్నది. అయితే.. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కుదురుకోవడానికే సమయం పడుతున్నది. ఈ సమయంలోనే లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్‌ రాబోతున్నది.


ప్రభుత్వం ఏమన్నా చేయాలంటే ఈలోపే చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేయడానికి ఏమీ ఉండదు. ఈ కారణాల రీత్యా ఆరు గ్యారెంటీలను అమలు చేసి లోక్‌సభ ఎన్నికలకు వెళ్లటమా? లేక తర్వాత అమలు చేయడమా? దాని వల్ల లాభాలేంటి? నష్టాలేంటి? అన్న అంశంలో చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. గ్యారెంటీలు అమలు చేయకుడా లోక్‌సభ ఎన్నికలకు వెళితే అది బీఆరెస్‌కు అస్త్రంగా మారుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. అదే సమయంలో గత బీఆరెస్‌ ప్రభుత్వ ఆర్థిక అరాచకం కారణంగా ఖజానా ఖాళీ అయిపోయిందని కాంగ్రెస్‌ చెప్పుకొనే అవకాశాలు ఉన్నా.. అది ప్రజలకు ఏం మేరకు చేరువ అవుతుందనే సందేహాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై సునీల్‌ కనుగోలుతో రేవంత్‌రెడ్డి చర్చిస్తున్నారు.