Bandi Sanjay | కేటీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి జైల్లో వేస్తారు.. బీఆరెస్‌ అవుట్ డేటెడ్ పార్టీ: బండి సంజయ్‌

బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి జైల్లో వేస్తారన్న నమ్మకం ఉందని, కేటీఆర్ చేసిన అరాచకాలు, అవినీతి అందరికీ తెలుసని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు

Bandi Sanjay | కేటీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి జైల్లో వేస్తారు.. బీఆరెస్‌ అవుట్ డేటెడ్ పార్టీ: బండి సంజయ్‌

స్వల్పకాలంలోనే కాంగ్రెస్‌పై ప్రజావ్యతిరేకత
కాంగ్రెస్‌లో లుకలుకలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీల మధ్యనే పోటీ
కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

Bandi Sanjay | బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) జైల్లో వేస్తారన్న నమ్మకం ఉందని, కేటీఆర్ చేసిన అరాచకాలు, అవినీతి అందరికీ తెలుసని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ (Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం తెలంగాణ బీజేపీ (BJP) రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత బీఆరెస్‌ ప్రభుత్వ (BRS government) హయంలో నాతో సహా బీజేపీ కార్యకర్తలను కేటీఆర్ హింసించిన తీరు, జైల్లో వేసిన తీరును ఎవరూ మర్చిపోలేదన్నారు. సీఎం రేవంత్ పై నమ్మకం పోయిన రోజు నుంచి కాంగ్రెస్‌తో జరగబోయేది యుద్దమేనని, కాంగ్రెస్, బీఆరెస్‌ ఒక్కటైనా బీజేపీ ధాటికి తట్టుకోలేనంతగా యుద్దం చేస్తామని బండి సంజయ్‌ పేర్కోన్నారు.

బీజేపీలో బీఆరెస్‌ విలీనం (merger of BRS with BJP) కోసం  చర్చలంటూ వచ్చిన వార్తలు అన్ని ఊహాగానాలేనని, అవుట్‌ డేటెడ్‌ బీఆరెస్‌ పార్టీతో చర్చలు జరుపాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. కవిత (Kavitha) బెయిల్ కు, బీజేపీకి ఏం సంబంధమని, సిసోడియాకు (Sisodia) బెయిల్ వస్తే బీజేపీకి సంబంధముందా? అని, కోర్టు విషయాలను పార్టీతో ముడిపెట్డడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారినా నిజాయితీగా పనిచేసే ఐఏఎస్ లకూ నేటికీ పోస్టింగ్ ఇవ్వడం లేదన్నారు. బీఆరెస్‌కు కొమ్ముకాసిన ఐఏఎస్ లకే మళ్లీ మంచి పోస్టింగులిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనా విధానాలకు బీఆరెస్‌కు మధ్య తేడా లేకుండా పోయిందని, అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చురగొన్న ఏకైక పార్టీ కాంగ్రెస్సేనన్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని, పంచాయతీలకు నిధులిచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు కూడా ప్రోత్సహక నిధులివ్వడం లేదని, కేంద్ర నిధులతోనే పంచాయతీలు (panchayats) నడుస్తున్నాయని స్పష్టం చేశారు. మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ, జడ్పీటీసీలే (ZPTC) మా బ్రాండ్ అంబాసిడర్లని, ఏ పార్టీ గెలిస్తే పంచాయతీలు అభివృద్ధి అవుతాయని గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాలన్నారు. పంచాయతీలకు కేంద్రమే నిధులిస్తోందని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఇప్పటికైనా చెప్పడం శుభ పరిణామమన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొనుగోలు దందా బాధ్యతను కాంగ్రెస్ నేతకు అప్పగించిందని ఆరోపించారు.

కాంగ్రెస్‌లో లుకలుకలు

తమ్ముడి కోసమే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లారనడం సరికాదని, రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు హుందాగా వ్యవహరించాలని బండి సంజయ్‌ అన్నారు. కాంగ్రెస్‌లో లుకలుకలు మొదలైనాయని, ఇతర పార్టీలను చీల్చి లాభం పొందాలనే ఆలోచన బీజేపీకి లేదన్నారు. కాంగ్రెస్ కు ప్రజలు ఐదేళ్ల తీర్పు ఇచ్చారని, ఐదేళ్లు అధికారాన్ని ఉంచుకుంటారా? వదులుకుంటారా? అనేది ప్రభుత్వ తీరుపై ఆధారపడి ఉందన్నారు. పాతబస్తీలో రోహింగ్యాలున్న (Rohingyas) మాట వాస్తవమే కదా అని, ఆనాడు డిప్యూటీ సీఎం మహమూద్ అలీయే రోహింగ్యాల పునరావాస కేంద్రానికి రిబ్బన్ కటింగ్ చేశారు కదా? అని గుర్తు చేశారు. వక్ఫ్‌ బోర్డు భూములపై మొసలి కన్నీరు పెడుతున్న ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎన్ని వక్ప్ బోర్డు భూములను (Waqf Board lands) కాపాడారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఒకచోట ఊరు ఊరంతా వక్ఫ్ బోర్డు భూములేనని చెప్పడం ఎంత వరకు న్యాయమని, వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి ఎంత మంది పేద ముస్లింలకు ఇచ్చారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. ప్రైవేట్ భూములు కూడా చాలా చోట్ల వక్ఫ్ బోర్డులో ఉన్నాయని, పూర్తి విచారణ చేస్తే వివరాలు బయటకొస్తాయన్నారు. గతంలో వక్ఫ్ బోర్డు భూములను కాంగ్రెస్, ఎంఐఎం నేతలు చాలా చోట్ల కబ్జా చేశారని, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందితే వాస్తవాలన్నీ బయటకు వస్తాయన్నారు. నేను అందరి మనిషినని, కొందరు కాదనుకుంటే నేనేం చేయగలనన్నారు. పార్టీకి, శాసనసభ్యులకు మధ్య గ్యాప్ ఉందనేది సరికాదని, నా పార్లమెంట్ పరిధిలో 80 శాతానికిపైగా ఓట్లు నమోదు చేయించిన పోలింగ్ బూత్ కమిటీలను త్వరలోనే సన్మానిస్తానన్నారు. తెలంగాణ రాష్ట్ర అధక్ష మార్పు జాతీయ అధ్యక్షులు నడ్దా చూసుకుంటారని, హైకమాండ్ నిర్ణయమే మాకు శిరోధార్యమన్నారు.