కోరుట్లలో ఏ పార్టీ ప్రభావం ఎంత?

రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. అయితే ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు తప్పేలా లేదు. అలాంటి నియోజకవర్గాల్లో కోరుట్ల ఒకటి. ఆ నియోజకవర్గంలో 2018లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్యే పోటీ జరిగింది. ఇక్కడ బీజేపీకి బలం ఉన్నప్పటికీ ఆ పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థి ప్రభావం అంతంత మాత్రమే ఉండటంతో మూడోస్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, సిరిసిల్లతో పాటు కోరుట్ల ఫలితంపై ఆసక్తి నెలకొన్నది. ఎందుకంటే బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అక్కడ బరిలో ఉన్నారు. దీంతో అక్కడ త్రిముఖ పోరు తప్పేలా లేదు. బీఆర్ఎస్ నుంచి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్ నుంచి జువ్వాడి నర్సింగరావులు ఉన్నారు. ఈసారి ప్రధానంగా పోటీ బీఆర్ఎస్, బీజేపీల మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2009 నుంచి ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి విద్యాసాగర్ రావే అప్రతిహతంగా గెలుపొందుతూ వస్తున్నారు. 2014, 2018లో విద్యాసాగర్ రావుకు ప్రధాన ప్రత్యర్థి జువ్వాడి నర్సింగరావే. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన 2018లో కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. విద్యాసాగర్ రావు ఈసారి ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో బీఆర్ఎస్ ఆయన కుమారుడు సంజయ్కి అవకాశం ఇచ్చింది.
ఈ నియోజకవర్గంలో మున్నూరుకాపు, పద్మశాలి, ముదిరాజ్, బెస్త (గంగపుత్రుల) సామాజికవర్గాల ఓట్లే కీలకం. వెలమ సామాజికవర్గానికి ఈ వర్గాలన్నింటితో అనుబంధం ఉంటుంది. పోటీలో ప్రధానంగా ఆ సామాజికవర్గాల అభ్యర్థులే ఉంటారు కాబట్టి ఉన్నవాళ్లలో అభ్యర్థి వ్యక్తిగత పనితీరే ప్రామాణికంగా ఓట్లు వేస్తున్నారు. అట్లా విద్యాసాగర్రావుకు కలిసి వస్తున్నది. నర్సింగరావు కూడా పాత కాంగ్రెస్ నేత వల్ల నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉంటారు. అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తారనే అభిప్రాయం ఉన్నది. కానీ ఎన్నికల దగ్గరి వచ్చేసరికి ఆయన ఓట్ల వేటలో వెనుకబడుతున్నారు. ఫలితంగా 2014, 2018లో రెండోస్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది అంటారు. ప్రస్తుతం ఈసారి అక్కడ పోటీ చేసే అభ్యర్థుల్లో ఇద్దరు వెలమ (సంజయ్, నర్సింగరావు), ఒకరు మున్నూరు కాపు (అర్వింద్) ఉండటంతో బీసీ సామాజికవర్గాలు ఎటువైపు మొగ్గుచూపుతాయనే చర్చ జరుగుతున్నది. అలాగే బీజేపీకి ఇక్కడ 15-20 వేల ఓటు బ్యాంకు ఉంటుంది. ఇవి అర్వింద్కు కలిసి వచ్చే అవకాశం ఉన్నదంటున్నారు.
ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మున్నూరు కాపు సామాజికవర్గం వాళ్లు రాజకీయంగా ప్రభావితం చేస్తారనే వాదన ఉన్నది. అదే జరిగితే బీజేపీకి ఇది బలం అవుతుంది. ఇక ముదిరాజ్, పద్మశాలి, బెస్త సామాజికవర్గాల్లో ఎక్కువశాతం మంది కూడా బీజేపీ సిద్ధాంతాలను విశ్వసిస్తారని సమాచారం. వాళ్లు కూడా ఈసారి బీజేపీ అభ్యర్థికి అండగా నిలబడితే అర్వింద్ గెలుపు సులభమే అంటున్నారు. అట్లని అధికారపార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అవకాశాలు లేవని కాదు. విద్యాసాగర్ రావుకు ఇప్పటికీ అక్కడి ప్రజల్లో మంచి ఆదరణే ఉన్నది. అది సంజయ్కి లాభించే అంశమే. కాంగ్రెస్ పార్టీకి ఉండే సంస్థాగత ఓటు బ్యాంకు నర్సింగరావుకు కలిసొచ్చినా అది గెలుపు తీరాల దాకా తీసుకుపోలేదని అంటున్నారు. దీంతో ఈసారి కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ గానే ఉండబోతున్నదని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చీల్చబోయే ఓట్లను బట్టి అక్కడ ఏ పార్టీ గెలుస్తుందన్నది నిర్ణయించబోతున్నది. అయితే బీజేపీ అభ్యర్థి అర్వింద్ వ్యవహారశైలి, ఆయన వ్యాఖ్యలు కూడా ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ గెలుపుఓటములను నిర్ణయించినా ఆశ్చర్యపోనక్కరలేదు అంటున్నారు. ఎందుకంటే పార్టీకి క్యాడర్ ఉన్నది. అర్వింద్ సామాజికవర్గం ప్రభావం ఆయనకు కొంత లాభం చేకూరుస్తున్నది. కానీ ఆయన ప్రచారంలో గతంలో వలె ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా, దురుసుగా ప్రవర్తించినా కాషాయపార్టీకి కష్టమే అంటున్నారు. అది బీఆర్ఎస్కు లబ్ధి చేకూరుస్తుందంటన్నారు.